లోకేష్ మైనర్‌గా ఏ ఆదాయమూ లేకుండానే కోట్ల ఆస్తులు కూడబెట్టారట! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లోకేష్ మైనర్‌గా ఏ ఆదాయమూ లేకుండానే కోట్ల ఆస్తులు కూడబెట్టారట!

లోకేష్ మైనర్‌గా ఏ ఆదాయమూ లేకుండానే కోట్ల ఆస్తులు కూడబెట్టారట!

Written By news on Wednesday, November 30, 2011 | 11/30/2011


దానిపై చెల్లించిన పన్నే ఏడు కోట్ల రూపాయలు 
ఆమె మొత్తం ఆస్తి రూ. 27 కోట్లేనంటూ బాబు అబద్ధాలు... ఆస్తి రూ. 27 కోట్లు అయితే ఆదాయం రూ. 34 కోట్లు ఎలా వస్తుంది?
లోకేష్ మైనర్‌గా ఏ ఆదాయమూ లేకుండానే కోట్ల ఆస్తులు కూడబెట్టారట! 
చంద్రబాబుది ఆది నుంచీ అసత్యాల బాటే
లీకులు, రాతలపై స్పందించిన న్యాయస్థానం 
సీబీఐ దర్యాప్తు వివరాలు పత్రికలకు లీక్‌పై రఘురామకృష్ణరాజు పిటిషన్ 
ఎమ్మార్ కొనుగోలుదారులను దోషులుగా చిత్రీకరిస్తున్నారని నివేదన 
సీబీఐ జాయింట్ డెరైక్టర్, ఆయన సహచరులు లీక్ చేస్తున్నారని ఆరోపణ 
తాము దర్యాప్తు వివరాలను లీక్ చేయటం లేదంటూ సీబీఐ వివరణ... ఈ రెండు పత్రికలు,
సీబీఐ, కేంద్ర హోంశాఖలకు నోటీసులు

హైదరాబాద్, సాక్షి ప్రతినిధి: ఈ ఏడాది సెప్టెంబరు 2న... దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతినాడు... తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హడావుడిగా విలేకరుల సమావేశం పెట్టారు. ఎవ్వరూ అడక్కుండానే... ఎలాంటి సందర్భం లేకుండానే... తన ఆస్తులు వెల్లడిస్తున్నానని ప్రకటించారు. ఇంతా చేస్తే ఆయన వెల్లడించిన ఆస్తుల విలువెంతో తెలుసా...? చంద్రబాబువి, ఆయన భార్య భువనేశ్వరివి, కుమారుడు లోకేష్‌వి కలిపి మొత్తం ఆస్తుల విలువ ఆయన ప్రకటించిన దాని ప్రకారం కేవలం రూ.34.20 కోట్లు!. దీన్లో భార్య భువనేశ్వరి ఆస్తుల విలువ రూ.27.18 కోట్లు కాగా కుమారుడు లోకేష్‌వి రూ.6.73 కోట్లు. ఇక చంద్రబాబువైతే కేవలం రూ.39.88 లక్షలు. 

చంద్రబాబు ఆస్తులు ఇంతేనంటే విశ్వసించగలమా? తన ఆస్తుల్ని వెల్లడించి ఆయన ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నారంటూ కనీసం రోజుకొకసారైనా పొగుడుతున్న తెలుగుదేశం నేతలు దీన్ని నిజంగా నమ్ముతున్నట్లేనా? అసలు వాస్తవాలేంటో ఒక్కసారి చూద్దాం. 

చంద్రబాబు భార్య భువనేశ్వరి ఆదాయమెంతంటే...
2010-11లో 13.50 కోట్లు. 
2009-10లో 6.58 కోట్లు.
2008-09లో 13.00 కోట్లు
అంటే.. మూడేళ్లలో వచ్చిన మొత్తం ఆదాయం 33 కోట్ల రూపాయలు. ఇదేమీ అంచనా లెక్క కాదు. ఆదాయపుపన్ను శాఖకు నారా భువనేశ్వరి స్వయంగా సమర్పించిన పన్ను రిటర్నులలోని విలువ. ఈ మూడేళ్లలో ఈ ఆదాయంపై ఆమె చెల్లించిన ఆదాయపు పన్నే అక్షరాలా ఏడు కోట్ల రూపాయలు. మరి చంద్రబాబు లెక్కలు ఎవరిని మోసం చేయడానికన్నట్టు? ఈ తప్పుడు లెక్కలకి టీడీపీ నేతలంతా ఆహా ఓహో అంటూ తానా తందానాలు!!! ఈ లెక్కలన్నీ చెబుతూ తనంత సచ్ఛీలుడెవరూ లేరని, తానే తప్పూ చేయలేదని పదే పదే చెబుతూ.. ఢిల్లీ చుట్టూ తిరుగుతూ.. తనకు వత్తాసు పలికే మీడియాలో వార్తలు రాయించుకుంటున్న చంద్రబాబును దర్యాప్తు సంస్థలు నమ్ముతాయా? జనం నమ్ముతారా? 

1999లో ప్రకటించిన ఆస్తి కేవలం రూ.4 కోట్లు!

1999లో స్పీకరు ఎదుట చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఆస్తుల మొత్తం విలువ కేవలం రూ.4 కోట్లు. పన్నెండేళ్లు గడిచేసరికి... ఇపుడు కేవలం చంద్రబాబు భార్యకు ఏటా వస్తున్న ఆదాయమే దాదాపు 13 కోట్ల రూపాయలు. ఇవన్నీ దాచిపెట్టి తాను అక్రమంగా ఒక్క పైసా కూడా సంపాదించుకోలేదని, తానుంటున్నది కూడా మూడు గదుల ఇంట్లోనేనని బాబు అరుస్తున్న బీద అరుపులు ఎవరి కోసమో... ఏ దర్యాప్తుల నుంచి తప్పించుకోవటానికో మున్ముందు తేలబోతోంది. 

ఇక చంద్రబాబు తనయుడు లోకేష్ విషయానికొద్దాం. ఆయన 2008-09వ సంవత్సరం దాకా ఎక్కడా పెద్దగా ఉద్యోగం చేసిన దాఖలాలు లేవు. అప్పటిదాకా ఆయన చదువుతూనే వస్తున్నారు. కాబట్టే ఆయన 2008-09వ సంవత్సరంలో తన ఆదాయపు పన్ను రిటర్నులో తన వ్యక్తిగత ఆదాయాన్ని కేవలం రూ.86,350గా చూపించారు. దానిపై 4,280 రూపాయల పన్నును చెల్లించారు. తరవాత తమ సొంత కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్‌లో చేరటంతో ఆయనకు జీతం ద్వారా ఆదాయం రావటంతో 2009-10వ సంవత్సరంలో రూ.29.27 లక్షల ఆదాయాన్ని, 2010-11లో రూ.37.18 లక్షల ఆదాయాన్ని చూపించారు. ఆయా ఆదాయాలపై మొత్తంగా రూ.18.36 లక్షల పన్ను కూడా చెల్లించారు. 

ఇక్కడ గమనించాల్సిందొక్కటే. 2008-09 వరకు పెద్దగా ఆదాయమేదీ లేని నారా లోకేష్... మైనర్‌గా ఉన్న నాటి నుంచీ భారీగా ఆస్తులు కూడబెడుతూనే వస్తున్నారు. నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం నిండాలి గ్రామంలో మైనర్‌గా మొదలుపెట్టి... హైటెక్ సిటీ సమీపంలోని మదీనాగూడలో, కొండాపూర్‌లో ఎకరాలకు ఎకరాలు కూడబెట్టుకుంటూనే వచ్చారు. నాయనమ్మ ఇచ్చిన బహుమతుల ద్వారా మదీనాగూడలో భూమితో పాటు బంజారాహిల్స్‌లో భవనాన్నీ సొంతం చేసుకున్నారు. ఆ తరవాత హెరిటేజ్ ఫుడ్స్‌తో పాటు తమ కుటుంబానికి చెందిన వివిధ కంపెనీల్లో షేర్లను కూడా సమీకరించుకున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఒక్కటే. ఇవన్నీ చంద్రబాబునాయుడి ఆస్తులే తప్ప లోకేష్ సొంతంగా సంపాదించినవి కావనేది ఎవ్వరికైనా అర్థమయ్యే వాస్తవం. కానీ చంద్రబాబు మాత్రం అవన్నీ తన ఆస్తులు కావని, కుటుంబం వేరే అని, తాను వేరే అని సమయం వచ్చినపుడల్లా చెబుతుండటమే చిత్రం. 

అంతేకాదు. 2008-09లో లోకేష్ ఆదాయం కేవలం రూ.86 వేలే అయినప్పటికీ 2006-07లో ఆయన సొంతంగా బెంగళూరు, ముంబై సమీపంలో కోట్ల రూపాయల విలువైన భూముల్ని కొనుగోలు చేశారు. అవన్నీ ఇటీవల చంద్రబాబు స్వయంగా వెల్లడించేవరకూ బయటి ప్రపంచానికి తెలియవనే చెప్పాలి. మరి ఇవన్నీ లోకేష్‌కు ఎలా వచ్చాయన్నది విచారణాధికారులు దృష్టిపెట్టాల్సిన అంశమే. 

ఆది నుంచీ అబద్ధాలే...
పక్కన చెప్పిన వాస్తవాల్ని చూస్తే చంద్రబాబునాయుడు చెప్పిన ఆస్తుల లెక్కలు ఎంత తప్పుల తడకలో తేలిగ్గా తెలిసిపోతుంది. అయితే ఒక్క ఆస్తుల విషయంలోనే బాబు అబద్ధాలు చెప్పారనుకుంటే పొరపాటే. బాబుకు ఆది నుంచీ అబద్ధాలు అలవాటే. వ్యవస్థాపక అధిపతిగా తాను స్థాపించిన హెరిటేజ్ ఫుడ్స్‌ను 1994లో పబ్లిక్ ఇష్యూకు తెస్తూ... ఆయన సెబీ ఎదుట డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశారు. తాను అప్పటి దాకా ఎలాంటి వ్యాపారాలూ చేయలేదని, హెరిటేజ్ తప్ప తనకు మరో వ్యాపారం లేదని చెప్పారాయన. నిజానికి 1983లోనే ఆయన భువనేశ్వరి కార్బైడ్స్ అండ్ అల్లాయ్స్, భువనేశ్వరి కార్బైడ్స్ అండ్ కెమికల్స్ అనే సంస్థల్ని ఏర్పాటు చేశారు. నిర్వహణ సరిగా లేకపోవటంతో అవి పూర్తిస్థాయి వ్యాపార కార్యకలాపాలు ఆరంభించకమందే మూత పడ్డాయి. వాటిపేరిట రుణాలు తీసుకుని... ఆ రుణాల చెల్లింపును కూడా ఎగ్గొట్టారు. ఇవన్నీ వాస్తవాలు కాగా... వీటిని మరుగునపరచి తాను ఎలాంటి వ్యాపారాలూ చేయలేదని చెప్పారు. ఒకరకంగా ఇది ఇన్వెస్టర్లను మోసం చేయటం, తప్పుదోవ పట్టించటమే. ఎందుకంటే కంపెనీ ప్రమోటరు గురించి ఆ రోజున ఇలాంటి నిజాలన్నిటినీ చెప్పి ఉంటే... ఆ చరిత్ర చూసి ఇన్వెస్టర్లు ముందుకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉండేవి. హెరిటేజ్ ఫుడ్స్‌కు షేర్లను పబ్లిక్ ఇష్యూలో కొనుగోలు చేసేవారు కరువై ఉండేవారు. కానీ వాటన్నిటినీ మరుగునపరచటంతో ఆ షేర్లు సబ్‌స్క్రయిబ్ కావటం జరిగింది. చంద్రబాబు అబద్ధాలతో ఉద్దేశపూర్వకంగా ఇన్వెస్టర్లను మోసగించినట్లు దీన్నిబట్టే తేటతెల్లమవుతోంది. బహుశా! తాజా విచారణలో భాగంగా మున్ముందు సెబీ వంటి సంస్థలు కూడా దర్యాప్తునకు దిగితే... ఈ బండారాలన్నీ వెలుగులోకి వస్తాయి. అబద్ధాల గుట్టుమట్లన్నీ బయటపడతాయి.
Share this article :

0 comments: