ప్రభుత్వంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
ప్రభుత్వం తక్షణమే సీసీఏల ద్వారా పత్తి కొనుగోలు చేయాలి
ఓదార్పు యాత్ర నుంచి ‘న్యూస్లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఈ ఏడాది వర్షాలు పడక, కరెంటు లేక, లిఫ్టు ద్వారా నీళ్లందక, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా.. పత్తి పంట దిగుబడి దారుణంగా తగ్గిపోయింది. ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్లు పండాల్సిన పత్తి.. నాలుగైదు క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదు. కష్టపడి పండించిన పత్తిని మార్కెట్కు తీసుకుపోతే అక్కడ కనీస మద్దతు ధర లేని అధ్వాన పరిస్థితులున్నాయి. వైఎస్సార్ బతికున్న రోజుల్లో క్వింటాల్ పత్తికి రూ.6,000 వస్తే.. ఇవాళ రూ.3,500 కూడా పలకడం లేదు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దిగుబడి తగ్గడంతోపాటు ధరలు కూడా లేకపోతే రైతులు అప్పుల ఊబి నుంచి ఎలా బయటపడతారని ప్రశ్నించారు. వెంటనే సీసీఏల ద్వారా పత్తి కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.
గుంటూరు జిల్లాలో 30వ రోజు ఓదార్పు యాత్రలో భాగంగా సోమవారం కాకుమాను, పెదనందిపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో జగన్మోహన్రెడ్డి పర్యటించారు. మార్గంమధ్యలో పత్తి రైతులు తమ సమస్యలను జగన్కు ఏకరువు పెట్టారు. వారి కష్టాలను కూలంకషంగా జగన్ అడిగి తెలుసుకున్నారు. పలు గ్రామాల్లో ఎనిమిది వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించడంతో పాటు పెదనందిపాడు మండల కేంద్రంలో కొమ్మినేని శివశాంతి కుటుంబాన్ని జగన్ ఓదార్చారు. యాత్రలో ఎమ్మెల్యేలు బి. గురునాథరెడ్డి, ఎ. అమర్నాథ్రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన్ను కలిశారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచరిత రెండు రోజులుగా యాత్రలో జగన్ వెంటే ఉంటున్నారు. సోమవారం ప్రజల కోరిక మేరకు దాదాపు అన్ని గ్రామాల్లో ఆయన ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..
సర్కారుకు తెలిసి కూడా..: ఇవాళ ఇక్కడికి(పెదనందిపాడుకు) రాక ముందు చాలా గ్రామాల్లో తిరిగా.. చాలా మంది రైతన్నలను కలిశా! పత్తి వేసుకున్న రైతన్నను అడిగా.. అన్నా.. ఎలా ఉన్నారన్నా.. అని అడిగా! వారి కష్టాలు వింటుంటే చాలా బాధనిపించింది. ఇవాళ పత్తి ఏ పరిస్థితుల్లో ఉందీ అంటే.. రైతులు ఎకరంలో పత్తి పండించడానికి నీళ్ల కోసం రూ. పది వేలు, ఎరువులు, విత్తనాలు ఇతర ఖర్చులకు కలిపి మొత్తం రూ.30 వేల దాకా ఖర్చు చేస్తున్నారు. కౌలు రైతులకైతే కౌలుకు రూ. 12 వేలు కలిపి రూ.42 వేల దాకా ఖర్చవుతోంది. కానీ మార్కెట్లో ఇవాళ పత్తి ధర క్వింటాల్ కేవలం రూ.3500 ఉంది. ఈ లెక్కన ఎకరాకు రూ.17,500 కూడా రాని అధ్వానమైన పరిస్థితి. పత్తి రైతులను వెంటనే ఆదుకోకుంటే వారి పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముంది. ప్రభుత్వం వెంటనే సీసీఏలను క్రియాశీలం చేయాలి. సీసీఏల ద్వారా పత్తి కొనుగోళ్లు చేపట్టాలి. అలా చేస్తే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ధర పెరుగుతుందని తెలిసి కూడా ఈ ప్రభుత్వం అంటీముట్టనట్లుగా చూస్తోంది.
104 పథకాన్ని ఖూనీ చేస్తోందీ సర్కారు..: ప్రతి పేద వాడికీ కూడా పెద్ద వైద్యం అందుబాటులోకి రావాలని దివంగత నేత కలలుగన్నారు. తనకు ఆరోగ్యం బాగా లేకుంటే తాను ఏ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నాడో.. అదే ఆసుపత్రిలో ప్రతి పేదవాడు కూడా తన పక్కబెడ్డు మీద వైద్యం చేయించుకోవాలని ఆయన భావించి ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రతి గ్రామానికి ఒక మొబైల్ ఆసుపత్రిలా మందులు అందించేందుకు 104 పథకాన్ని తెచ్చారు. ఇవాళ 104 నెంబర్కు ఫోన్ కొడితే మా ఉద్యోగులు స్ట్రైక్లో ఉన్నారనో.. మా అంబులెన్స్లో మందులు లేవనో సమాధానం చెప్తున్న అధ్వానమైన పరిస్థితుల్లో 104 పథకం ఉంది. ఈ ప్రభుత్వం ఒక పక్కా ప్రణాళిక ప్రకారం 104 పథకాన్ని ఖూనీ చేస్తోంది. రాష్ట్రం ఇంత అన్యాయమైన పరిస్థితుల్లో ఉంది కదా..! ప్రతిపక్షమైనా ఈ ప్రభుత్వాన్ని కాలర్ పట్టుకొని అడుగుతుందేమో.. అని అటు వైపు చూస్తే.. ఇవాళ మన ఖర్మ కొద్దీ అక్కడ చంద్రబాబు కూర్చున్నారు.
5 క్వింటాళ్లు కూడా రావట్లేదు: పత్తి దిగుబడిపై రైతుల ఆవేదన ఓదార్పు యాత్ర మార్గమధ్యంలోని కొమ్మూరు, పాలపర్రు, అన్నవరం, రాజుపాలెం, అడ్డరోడ్డు సమీపం తదితర ప్రాంతాల్లో పత్తి రైతులు జగన్మోహన్రెడ్డిని కలిసి తమ సమస్యలు చెప్పుకొన్నారు. పంట పెట్టుబడి మొదలుకొని మార్కెట్లో విక్రయం వరకు పరిస్థితి ఎలా ఉందని ఆయన రైతులను అడిగి తెలుసుకున్నారు. ఉప్పలపాడు నుంచి అన్నవరం వచ్చే దారిలో పలువురు రైతులకు, జగన్కు మధ్య సంభాషణ సాగిందిలా..
జగన్: ఎకరాకు ఎన్ని క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది? గతంలో 15 నుంచి 20 క్వింటాళ్ళు వచ్చేది. ఇప్పుడు 5 క్వింటాళ్ళు కూడా వచ్చే అవకాశం లేదయ్యా..
ఎకరాకు పెట్టుబడి ఎంతవుతుంది?పత్తినాటినప్పటి నుంచి చేతికొచ్చేంత వరకు రూ.30 వేలకు పైగా ఖర్చవుతుంది.
కౌలు ధరలెలా ఉన్నాయి?ఎకరాకు రూ.12 నుంచి రూ.15 వేల వరకు పలుకుతున్నాయి.
వర్షాలు లేకపోతే పంటలు ఎలా పండిస్తున్నారు?ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో సమీపంలోని ఓగేరు వాగు నుంచి డీజిల్ ఇంజన్ల సాయంతో సాగుచేస్తున్నాం. దీని వల్ల ఎకరాకు రూ.10 వేల వరకు అదనపు భారం పడుతోంది.
పత్తి విత్తనాల ధర ఎలా ఉంది?మీ నాయన ఉన్నప్పుడు బీటీ విత్తనాలు ఎకరాకు సరిపోనూ రూ.750తో తెచ్చుకునే వాళ్ళం. ప్రస్తుతం రూ.1,250 చెల్లించాల్సి వస్తోంది.
ఎరువుల ధరలు ఎలా ఉన్నాయి?ఏం చెప్పమంటారయ్యా! పత్తి నాటేటప్పుడు బస్తా ధర రూ.450 ఉంది. ప్రస్తుతం రూ.1,000 మించిపోయిందయ్యా.
0 comments:
Post a Comment