* అదే పిటిషన్లో ఆయనతో కలిసిన ఆడిటర్ విజయ సాయిరెడ్డి
* అసలు డిపాజిట్ల స్వీకరణే చట్టవిరుద్ధం
* ఆ వ్యాపారంలో వచ్చిన ఆదాయంపై రామోజీకి మినహాయింపా?
* భారీ ఖర్చులు పెట్టామంటూ వందల కోట్ల నష్టాలు చూపించారు
* చంద్రబాబు తన అనుయాయుల కంపెనీలకు లబ్ధి చేకూర్చారు
* ఎన్నారైలను డెరైక్టర్లుగా చేర్చుకుని వారికి రాయితీలిచ్చారు
* ఇండియా హెరిటేజ్ ఫౌండేషన్ పెట్టిందే 2008లో
* ఎన్టీఆర్ ట్రస్టుకు దాన్నుంచే నిధులు వస్తున్నాయంటే.. 2008కి ముందు ఎక్కణ్ణుంచి వచ్చినట్లు?
హైదరాబాద్, న్యూస్లైన్: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భారీగా ఆక్రమాస్తులు పోగేసుకున్నారంటూ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో తాము కూడా భాగస్తులమవుతామంటూ ప్రముఖ పాత్రికేయుడు, పలు పత్రికల వ్యవస్థాపక ఎడిటర్ ఏబీకే ప్రసాద్, ఆడిటర్ విజయసాయిరెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబుతో కలిసి అక్రమాలకు పాల్పడ్డ రామోజీరావు మార్గదర్శి పేరుతో చేసిన అక్రమ దందా, ఆదాయ పన్ను ఎగ్గొట్టిన విధానం... బాబు, ఆయన సతీమణి, ఇతర బినామీలు దేశ, విదేశాల్లో కంపెనీలు సృష్టించి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున లబ్ధిపొందిన విధానాన్ని ఆధారాలతో సహా నివేదిస్తామని, తమ వాదనలు వినాలని హైకోర్టును అభ్యర్థిస్తూ వారు సోమవారం ఈ పిటిషన్ దాఖలు చేశారు. హెచ్యూఎఫ్ కర్త హోదాలో రామోజీరావు ఆదాయ పన్ను చట్టాలను అడ్డగోలుగా ఉల్లంఘించిన తీరును వారు పిటిషన్లో పేర్కొన్నారు. మనీలాండరింగ్ చట్టాల్ని ఉల్లంఘించి ఎన్టీఆర్ ట్రస్టుకు తెస్తున్న నిధులను రాజకీయ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఇంప్లీడ్ పిటిషన్లోని ముఖ్యాంశాలివీ..
సినిమా హక్కులు బదలాయించి.. అక్రమాలు..
హెచ్యూఎఫ్ కర్త హోదాలో రామోజీరావు 2006-07 ఆర్థిక సంవత్సరానికి సమర్పించిన ఆదాయపన్ను రిటర్నుల్లో ఉషోదయ టెలివిజన్, ఉషాకిరణ్ మూవీస్ సంస్థలకు పాత సినిమాల మీద ఉన్న హక్కులను అత్యంత విలువైన ఆస్తులుగా పేర్కొన్నారు. 2005 వరకు ఆ ఆస్తులపై తరుగుదల చూపించి పన్ను మినహాయించారు. ఆ తర్వాత ఈ సినిమాల విలువను హెచ్యూఎఫ్లోనే భాగమైన ఉషోదయ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్కు బదలాయించారు. వీటి విలువను రూ.789 కోట్లుగా పేర్కొన్నారు. తన సంస్థల మధ్యే బదలాయింపును చూపించటం ద్వారా ఉద్దేశపూర్వకంగా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎగ్గొట్టారు. ఇది చట్టవిరుద్ధమని, దీనికి పన్ను చెల్లించాల్సిందేనని పిటిషనర్లు అభిప్రాయపడ్డారు. 2006-07లో మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్కు డివిడెండ్ పేరిట పన్ను ఎగ్గొట్టిన వైనాన్నీ ప్రస్తావించారు.
రూ.150 కోట్ల మేర లెక్కని చూపని సొమ్ము..
ఈ అంశాలన్నిటినీ డీల్ చేస్తున్న నాటి ఆదాయపు పన్ను కమిషనర్ కె.జ్ఞానప్రకాశ్ తాను బదిలీ కావటంతో కొత్తగా వచ్చిన ఎఫ్.ఎం.మొహంతికి వీటన్నిటినీ ట్రాన్స్ఫర్ నోట్ ద్వారా అందజేశారని పిటిషనర్లు తెలిపారు. ‘‘మరో అక్రమమేంటంటే మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఖాతా పుస్తకాల్ని ఆడిట్ చేసిన సత్యనారాయణ అండ్ కంపెనీ 2008 జనవరి 30 నాటికి కంపెనీ డిపాజిట్లు రూ.2,014 కోట్లుగా పేర్కొంది. కానీ రామోజీరావు అదే విషయాన్ని సుప్రీంకోర్టుకు చెబుతూ రూ.1,864 కోట్లుగా పేర్కొన్నారు. అంటే రూ.150 కోట్ల లెక్క చెప్పని సొమ్ముకు పన్ను ఎగవేశారన్నమాట. తన ట్రాన్స్ఫర్ నోట్లో కమిషనర్ ఈ అంశాన్నీ ప్రస్తావించారు’’ అని పిటిషనర్లు తెలిపారు. ఇలాంటి నష్టాలు చూపిస్తున్న కంపెనీలోకి రిలయన్స్ సంస్థ అతి రహస్యంగా డొల్ల కంపెనీల ద్వారా పెట్టుబడి పెట్టిందంటే అది చంద్రబాబు చేసిన సాయానికి ప్రత్యుపకారంగా తప్ప మరో రకంగా కాదని వారు పేర్కొన్నారు.
చంద్రబాబు అనుయాయి కంపెనీలకు రాయితీలు...
చంద్రబాబు భార్య భువనేశ్వరి, బాబు బినామీ నాగరాజునాయుడు, ఆయన భార్య, అమెరికాలో ఉంటున్న రాయపాటి వెంకటపతి వ్యవస్థాపక డెరైక్టర్లుగా 2000 సంవత్సరంలో ‘ఏ2జెడ్ ఈ మల్టీసాఫ్ట్ లిమిటెడ్’ సంస్థను ఏర్పాటు చేశారని, తర్వాత దాని పేరును బిజ్ప్రో టెక్నాలజీస్గా మార్చారని పిటిషనర్లు పేర్కొన్నారు. ‘‘ఇదే వెంకటపతి అమెరికాలో పోర్టల్ప్లేయర్ సంస్థను ఏర్పాటు చేశారు. 1999లో పోర్టల్ప్లేయర్ ఇండియా లిమిటెడ్ను కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. దీనికి ఐదెకరాల స్థలం ఇస్తూ 2001లో బాబు ప్రభుత్వం ఎంవోయూపై సంతకాలు చేసింది. రూ.20 లక్షల ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ, 25 శాతం పవర్ సబ్సిడీ కూడా ఇచ్చారు. బాబు అధికార దుర్వినియోగంతో తన వారికి ప్రజా సంపదను ఎలా దోచిపెట్టారో తెలియజెప్పటానికి ఈ ఉదాహరణలు చాలు’’ అని తెలియజేశారు.
ఇండియా హెరిటేజ్ ఫౌండేషన్ పెట్టింది 2008లో...
ఎన్టీఆర్ ట్రస్టుకు విదేశాల నుంచి భారీ నిధులు వస్తున్నాయని, దీనిపై మనీలాండరింగ్ చట్టం కింద విచారణ జరిపించాలని విజయమ్మ తన పిటిషన్లో కోరటం తెలిసిందే. దానిపై ఇటీవల తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ తమకు అమెరికాలో ఉన్న ఇండియా హెరిటేజ్ ఫౌండేషన్ నుంచి నిధులు వస్తున్నాయని, అందులో తప్పేంటని ఎదురు ప్రశ్నించారు. ‘‘మేం పరిశోధించిన మీదట ఈ ఇండియా హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థ అమెరికాలోని మిచిగన్ రాష్ట్రంలో 2008లో రిజిస్టరైనట్లు తేలింది. మరి అంతకు ముందు ట్రస్టుకు వచ్చిన నిధుల సంగతేంటి? పెపైచ్చు ఈ సంస్థ తన నిధులను రాజకీయ కార్యకలాపాలకు వినియోగించకూడదని, అభ్యర్థుల ప్రచారానికి సైతం ఖర్చుపెట్టకూడదని తన ఆర్టికల్స్లో స్పష్టంగా పేర్కొంది. కానీ ఇక్కడేమో ఎన్టీఆర్ ట్రస్టు కార్యాలయమే రాజకీయ పార్టీ కార్యాలయంలో కొనసాగుతోంది. తన భవనాన్ని పూర్తిగా రాజకీయ కార్యకలాపాలకు వినియోగిస్తోంది. ఇది చట్ట విరుద్ధం. మనీ లాండరింగ్ చట్టంకింద దర్యాప్తు చేస్తే మరిన్ని వాస్తవాలు వెలుగుచూస్తాయి’’ అని పిటిషనర్లు పేర్కొన్నారు.
నేరమయ వ్యాపారానికి.. పన్ను మినహాయింపా!
మార్గదర్శి ఫైనాన్సియర్స్ అనేది రామోజీరావు హెచ్యూఎఫ్(హిందూ అవిభక్త కుటుంబం)లో భాగం. రిజర్వు బ్యాంకు చట్టంలోని సెక్షన్ 45(ఎస్)ను ఉల్లంఘించి.. చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తున్నదనే ఆరోపణలు ఈ సంస్థపై ఉన్నాయి. అంటే దీని ప్రధాన వ్యాపారమే నేరమయం. అలాంటి సంస్థ పన్ను చెల్లించేటపుడు ఆదాయం నుంచి ఖర్చుల్ని మినహాయించుకుంటున్నట్లు చూపిస్తోంది. దీన్ని ఆదాయపు పన్ను చట్టం అనుమతించటం లేదు. చట్టరీత్యా ఇదెంతమాత్రం సరికాదు. ఇక్కడ మార్గదర్శి డిపాజిట్లు సేకరించటమే చట్ట విరుద్ధం. కానీ దాన్ని ఆదాయంగా చూపిస్తూ... భారీ ఖర్చుల పేరిట అలవి కాని నష్టాలు ప్రకటించింది. నిజానికి ఈ ఆదాయమంతా పన్ను పరిధిలోకే వస్తుందని, మినహా యింపులు చెల్లవని పిటిషన ర్లు ఏబీకే ప్రసాద్, విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
0 comments:
Post a Comment