నేత్రదానంతో అంధుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చు: మేకపాటి
భారీగా హాజరైన అభిమాన సందోహం
హైదరాబాద్, న్యూస్లైన్: డిసెంబర్ 21న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా పార్టీ అనుబంధ ఐటీ విభాగం ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లో నిర్వహించిన నేత్రదాన ప్రతిజ్ఞ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. నేత్రదానం చేసేందుకు ఆమోదం తెలుపుతూ దాదాపు 2,800 మంది పత్రాలపై సంతకాలు చేశారు.
పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో 40 లక్షల మంది కంటి చూపులేక బాధపడుతున్నారని ఆయనన్నారు. ‘నేత్రదానం చేయండి-రెండు సార్లు జీవించండి’ నినాదాన్ని అందరూ పాటిస్తే అంధుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని చెప్పారు. ‘‘ఏటా 95 లక్షల మంది మరణిస్తున్నా, వారిలో కేవలం 10,000 మంది మాత్రమే నేత్రదానం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి నేత్రదానం చేస్తే దేశంలో అంధత్వాన్ని నిర్మూలించవచ్చు’’ అన్నారు. నేత్రదానంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం, మీడియా కూడా విస్తృత ప్రచారం చేయాలని ఆయన సూచించారు. మ్యాక్స్ విజన్ కంటి ఆసుపత్రి ప్రతినిధుల సమక్షంలో నేత్రదాన పత్రాలపై సంతకాలు చేసినట్లు పార్టీ ఐటీ విభాగం కన్వీనర్ చల్లా మధుసూదన్రెడ్డి తెలిపారు. సంతకాలు చేసిన వారిలో మేకపాటి, వై.వి.సుబ్బారెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, ఎం.మారెప్ప, అంబటి రాంబాబు, పుత్తా ప్రతాప్రెడ్డి, మేడపాటి వెంకట్, రాజ్ ఠాకూర్, మధుసూదన్రెడ్డి, పీఎన్వీ ప్రసాద్, హర్షవర్ధన్రెడ్డి, ఐటీ ఉద్యోగులున్నారు.
0 comments:
Post a Comment