తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆలస్యం చేస్తున్నందుకు నిరసనగా ప్రభుత్వం కొనసాగేందుకు అర్హత లేదని భావించి అవిశ్వాసానికి మద్దతు తెలిపానని వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే కొండా సురేఖ స్పష్టం చేశారు. తెలంగాణ కోసం తాను ఇదివరకు చేసిన రాజీనామాను ఆమోదించాలని లేదా విప్ ధిక్కరణపై అయినా తనను అనర్హురాలిగా ప్రకటించాలని స్పీకర్ను కోరానని తెలిపారు. సోమవారం ఆమె స్పీకర్ నాదెండ్ల మనోహర్ను కలసి విప్ ధిక్కరణపై లిఖిత పూర్వక వివరణ ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై డిసెంబర్ 9న ప్రకటన చేసి 24 గంటలు గడవకముందే సోనియాగాంధీ ‘యూ’టర్న్ తీసుకుని ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసి, వందలాది మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమయ్యారన్నారు.
అనాటినుంచి తెలంగాణ రావణకాష్టంలా రగులుతూనే ఉందని, ప్రజలు అన్నిరకాలుగా నష్ట పోతూనే ఉన్నారని చెప్పారు. అవిశ్వాసం సందర్భంగా తెలంగాణవాదులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలన్న జేఏసీ పిలుపు మేరకే విప్ను ధిక్కరించి ఓటు వేశానన్నారు. తెలంగాణ విషయంలో టీఆర్ఎస్ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ఉద్య మం తమ పార్టీకి పేటెంట్ అన్నట్టుగా వ్యవహరిస్తోం దన్నారు. ఉద్యమం పేరిట ఆర్థికంగా లాభపడాలన్నది ఆ పార్టీ నేతల ఎత్తుగడ అని విమర్శించారు. తాను వైఎస్ జగన్ వైపు ఉన్నందునే ఉప ఎన్నికల్లో తనపై పోటీపెడతామంటూ ప్రకటన చేస్తున్నారన్నారు. తాను తెలంగాణ కోసమే అవిశ్వాసానికి అనుకూలంగా ఓటువేశానని ముందు నుంచీ చెబుతున్నానని తెలి పారు. ‘టీఆర్ఎస్ వారు కూడా ఓటు వేశారు కదా? వారెందుకు వేసినట్లు? టీఆర్ఎస్ తననే ఎందుకు లక్ష్యం చేసుకుంటోందో తెలియదు’ అని పేర్కొన్నారు. తెలంగాణ అంశాన్ని జగన్ ఏనాడూ వ్యతిరేకించలేదని, సెంటిమెంటును గౌరవిస్తానని పలుమార్లు ప్రకటించారని గుర్తుచేశారు. తెలంగాణపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని, కాంగ్రెస్ ప్రకటించినప్పుడు అడ్డుకుంటే వ్యతిరేకం అనుకోవాలి తప్ప సానుకూలంగా ఉన్నా అవే విమర్శలు చేయడంలో అర్థం లేదన్నారు.
0 comments:
Post a Comment