తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన స్థానాల్లో పోటీ చేయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన స్థానాల్లో పోటీ చేయం

తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన స్థానాల్లో పోటీ చేయం

Written By ysrcongress on Saturday, December 31, 2011 | 12/31/2011

బలమైన ఆకాంక్షతో తెలంగాణ ఎమ్మెల్యేలు 
రాజీనామా చేసిన స్థానాల్లో పోటీ చేయం
18 స్థానాల్లోనే పోటీ...అవిశ్వాసానికి మద్దతుగా ఓటేసిన 17 మంది ఎమ్మెల్యేలను మా పార్టీ తరఫున బరిలోకి దింపుతాం
టీడీపీ కుమ్మక్కు విధానాలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిన నల్లపురెడ్డి కూడా పోటీలోకి
రాజేశ్వర్‌రెడ్డి సతీమణిని మా పార్టీ తరఫున పోటీ చేయాలని ఆహ్వానిస్తున్నాం
వేరే పార్టీ తరఫున బరిలోకి దిగితే.. వ్యతిరేకంగా మా అభ్యర్థిని దించం

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగే అవకాశాలున్న 24 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ 18 చోట్ల పోటీ చేస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. బలమైన ఆకాంక్షతో తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన స్థానాల్లో తమ పార్టీ పోటీ చేయకూడదని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. తామిచ్చిన పిలుపు మేరకు విప్‌ను ధిక్కరించిన 16 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు, ఒక పీఆర్పీ ఎమ్మెల్యేతోపాటు టీడీపీ కుమ్మక్కు విధానాలకు నిరసనగా తమ పార్టీలో చేరిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితో కలిపి 18 మందిని వచ్చే ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపుతుందని జగన్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేగా ఉంటూ ఆకస్మిక మృతి చెందిన రాజేశ్వర్‌రెడ్డి సతీమణిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన ఆహ్వానించారు. అలా కాకుండా ఆమె ఏ ఇతర పార్టీ తరఫున పోటీ చేసినా వ్యతిరేకంగా తాము అభ్యర్థిని నిలబెట్టబోమని స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో అనుసరించే వ్యూహంపై అన్ని ప్రాంతాల నేతలతో జగన్ సమాలోచనలు జరిపారు. ఈ మేరకు ఉప ఎన్నికలపై ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ప్రకటన పూర్తి పాఠమిదీ.. 

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 24 అసెంబ్లీ స్థానాలు ఉప ఎన్నికలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఎన్నికలు రావడానికి కారణమైన నేపథ్యమేమిటో మీకు తెలియనిది కాదు. అయినా ఒక రాజకీయ పార్టీగా మేం అనుసరించాల్సిన వైఖరిని వెల్లడించడానికి ముందు ఈ నేపథ్యాన్ని మీకు మరోసారి గుర్తు చేయాలనుకుంటున్నాం. రైతుల పట్ల, వ్యవసాయం పట్ల, పేదవాడి పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అలక్ష్య వైఖరికి నిరసనగా 16 మంది కాంగ్రెస్ సభ్యులు, ఒక పీఆర్పీ సభ్యురాలు మొన్నటి అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా... ఆ పార్టీల విప్‌లను ధిక్కరించి ఓటేశారు. శాసనసభ సాక్షిగా ఆ సభ్యులు పార్టీ విప్‌ను ధిక్కరించారు. కనుక సహజంగానే వారు ఎమ్మెల్యే సభ్యత్వాలకు అనర్హులు కాబోతున్నారు. విప్‌ను ధిక్కరించాల్సినంత కఠిన నిర్ణయం ఆ సభ్యులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో కూడా మీకు తెలియని విషయం కాదు.

అన్నదాత రోడ్డునపడ్డాడు: గత రెండేళ్లుగా వ్యవసాయ రంగం ఎంతటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోందో మనందరం చూస్తూనే ఉన్నాం. పెట్టుబడులు మూడింతలయ్యాయి. రాబడులు మూడోవంతు కన్నా పడిపోయాయి. దానికి తోడు కరువు, తుపానులు, ప్రభుత్వ నిష్క్రియాపరత్వం, అన్నదాత రోడ్డున పడ్డ పరిస్థితి. వరి వేసుకోవడం కంటే ఉరివేసుకోవడం మేలన్న నానుడి జన జీవితంలోకి వచ్చింది. వేల సంవత్సరాల వ్యవసాయ సాగు చరిత్రలో మొట్టమొదటి సారిగా ఈ రాష్ట్రంలో రైతు వ్యవసాయానికి సెలవు ప్రకటించాడు. రైతు సమ్మె ప్రకటించాడు. రైతు వీధిన పడ్డాడు. మరి రైతు మీదే ఆధారపడ్డ కూలీల పరిస్థితి ఏమిటి? పొట్ట చేతబట్టుకుని వలసల బాట పట్టాల్సిన దుర్భర స్థితి. ఈ పరిస్థితి మారాలనీ, రైతును నిలబెట్టాలనీ, మద్దతు ధర పెంచాలనీ, ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని, ఎరువుల ధరలు తగ్గించాలనీ, నష్టపోయిన రైతుకు పరిహారం చెల్లించాలనీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్నో ఆందోళనలు, దీక్షలు చేసినా సర్కారు స్పందించలేదు. మా పోరాటం చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లయింది.

రైతు ముక్తి కోసం..: ఇక ఈ జనకంటక సర్కార్‌ను కూలదోస్తే తప్ప రైతుకు ముక్తి లేదన్న నిర్ణయానికి మా పార్టీ వచ్చింది. అధికార పక్షంతో అంటకాగుతూ ప్రతిపక్ష హోదానే కళంకితం చేస్తున్న టీడీపీకి సవాల్ విసిరాం. నిజాయతీ ఉంటే, దమ్ముంటే అధికారపక్షంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరాం. మొదట ఆ సవాల్‌ను టీడీపీ స్వీకరించలేదు. వెన్ను చూపింది. మోసగించింది. ప్రభుత్వాన్ని నిలబెట్టడమే ధ్యేయమన్నట్లు ప్రవర్తించింది. చిరంజీవి పార్టీ విలీనమవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోదన్న నిర్ధారణకు వచ్చాక చంద్రబాబు గారు కాంగ్రెస్ పెద్దలతో కుయుక్తులు పన్నారు.

మొక్కుబడిగా అవిశ్వాసం: అవిశ్వాసం పెట్టాలని మా పార్టీ పదే పదే డిమాండ్ చేయడం, మరో పక్క జనంలో కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కయ్యాయన్న అభిప్రాయం బయటపడడంతో ఆ పార్టీలు వ్యూహాన్ని మార్చాయి. కాంగ్రెస్ పార్టీ తన శాసనసభ్యులు ఎవరూ వ్యతిరేకంగా ఓటు వేయకుండా నయాన, భయాన మచ్చిక చేసుకొంది. కొందరిని భయపెట్టింది. కొందరికి పదవులు, కొందరికి ప్యాకేజీలు ప్రవహింపజేసి ఇక భయం లేదనుకొన్న తరువాత టీడీపీకి కనుసైగ చేసింది. ఆ సైగకు స్పందించిన టీడీపీ మొక్కుబడిగా అవిశ్వాసం పెట్టింది. చర్చ సందర్భంగా, అవిశ్వాసానికి మద్దతుగా కాంగ్రెస్ సభ్యులెవరూ ఓటు వేయకుండా ఉండాలని టీడీపీ.. రైతు సమస్యల్ని పక్కన బెట్టి, చనిపోయి రెండున్నరేళ్లు అయినా వైఎస్సార్‌పై నీచమైన విమర్శలకు దిగింది.

అపూర్వ ఘట్టం..: ఇన్ని రకాల ఇబ్బందులూ, బెదిరింపులు ఎదురైనా, శాసనసభ్యత్వం రద్దు కాబోతోందని తెలిసినా, రైతులు కన్నీరు కార్చడం రాష్ట్రానికి అరిష్టం అని భావించి, రైతుల కోసం, పేదవాడి కోసం, విలువల కోసం, విశ్వసనీయత కోసం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపునకు స్పందించి 16 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఒక పీఆర్పీ ఎమ్మెల్యే అవిశ్వాసానికి మద్దతుగా ఓటేసి అపూర్వ త్యాగనిరతిని చాటిన విషయం మీరంతా గమనించారు. అలాగే మరో సభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీ తరపున ఎన్నికైనా రైతు రాజ్యం కోసం, వైఎస్సార్ సంక్షేమ పాలన కోసం, టీడీపీ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మరో నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌గా ఎన్నికై కాంగ్రెస్ అనుబంధ సభ్యునిగా కొనసాగిన రాజేశ్వర్‌రెడ్డి దురదృష్టవశాత్తూ అకాల మృత్యువు పాలయ్యారు. మరో ముగ్గురు టీడీపీ సభ్యులు, ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని ఒక బలమైన కాంక్షతో వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల శాసనసభ్యత్వాలను వదులుకున్నారు.

ఆ 18 స్థానాల్లోనే పోటీ..: ఈ పరిణామాల నేపథ్యంలో మా పార్టీ ఈ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వైఖరిపై ఒక నిర్ణయానికి వచ్చాం. మా పార్టీ పిలుపు మేరకు విప్‌ను ధిక్కరించిన 16 మంది కాంగ్రెస్, ఒక పీఆర్పీ ఎమ్మెల్యే, అలాగే టీడీపీ అనుసరిస్తున్న కుమ్మక్కు విధానాలకు నిరసనగా మా పార్టీతో కలిసిన ప్రసన్నకుమార్ రెడ్డి మొత్తం 18 మంది మా పార్టీ తరపున రంగంలోకి దిగుతారు. రైతులకు, పేదవాడికి అండగా నిలుస్తారు. మహబూబ్‌నగర్ శాసనసభ్యుడు రాజేశ్వర్ రెడ్డి అకాలమరణం కారణంగా అక్కడ జరిగే ఎన్నికల్లో మా పార్టీ తరపున పోటీ చేయాల్సిందిగా ఆయన సతీమణికి విజ్ఞప్తి చేస్తున్నాం. మా తరపున కాకుండా ఆమె వేరే పార్టీ తరపున పోటీ చేసినా ఆమెకు వ్యతిరేకంగా పోటీ పెట్టకూడదని నిర్ణయించుకున్నాం. 

అలాగే తెలంగాణ కోసం రాజీనామా చేసిన వారు అంతకుముందు వరకు ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు. వారు ఒక బలమైన ఆకాంక్షతో పదవులు వదులుకున్నారు కాబట్టి వారిని గౌరవించాలన్నది, వారు ఏ పార్టీ తరపున రంగంలోకి దిగినా పోటీ పెట్టరాదన్నది మా నిర్ణయం. స్వార్థపూరిత, అవకాశవాద రాజకీయాలకు దూరంగా ఉండే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ సూత్రబద్ధ, నైతిక నిర్ణయాన్ని ప్రజాశ్రేణులు హర్షిస్తాయన్నది మా విశ్వాసం.
Share this article :

0 comments: