రైతులు, రైతు కూలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు జరుగనున్నాయి. ఈ నెల 17న పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన కేంద్ర పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఆందోళనను చేపడుతున్నారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా ప్రాంతాల్లో రైతులు క్రాప్ హాలిడేను ప్రకటించారు. అధిక ధరలకు విత్తనాలు, ఎరువులు, రసాయనాలు కొనుగోలు చేసి సాగుచేసినా విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంవల్ల చాలాచోట్ల పంటలు ఎండిపోయాయి. కొద్దో గొప్పో చేతికొచ్చిన పంటకు కూడా ప్రస్తుతం గిట్టుబాటు ధర లభించే పరిస్థితి లేకపోయింది. ఇన్ని సమస్యలతో రైతులు అల్లాడుతున్నా ప్రభుత్వం ఎలాంటి ఉపశమన చర్యలు చేపట్టకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి కనువిప్పు కలిగించడానికి ఈ ఆందోళనను సంకల్పించినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఖరీఫ్ పంట చేతికొస్తున్న తరుణంలో చేస్తున్న ఈ ఆందోళన వల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించడానికి దోహద పడగలదని పార్టీ భావిస్తోంది. అన్ని జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున రైతులతో పాటు పార్టీని సమర్థిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ముఖ్య నేతలంతా పాల్గొనాలని పార్టీ అధ్యక్షుడు ఇప్పటికే సూచనలు జారీ చేశారు. పార్టీ అనుబంధ విభాగాలు కూడా చురుగ్గా పాల్గొని రైతు సమస్యలను ఎలుగెత్తి చాటాలని ఆయన పిలుపునిచ్చారు.
Home »
» రైతు సమస్యలపై నేడు వైఎస్సార్ కాంగ్రెస్ ధర్నాలు
రైతు సమస్యలపై నేడు వైఎస్సార్ కాంగ్రెస్ ధర్నాలు
Written By ysrcongress on Friday, December 23, 2011 | 12/23/2011
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment