విజయమ్మ లేఖ పూర్తి పాఠం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయమ్మ లేఖ పూర్తి పాఠం

విజయమ్మ లేఖ పూర్తి పాఠం

Written By ysrcongress on Monday, January 30, 2012 | 1/30/2012

డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ,
గౌరవనీయులైన ప్రధానమంత్రి
భారత ప్రభుత్వం, న్యూఢిల్లీ గారికి, 
గౌరవనీయులైన అయ్యా, 

గత ఏడాది ఆగస్టు 19వ తేదీన మీకు ఒక లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన రాజకీయ పార్టీలను అణచి వేయడానికి సీబీఐ ఒక సాధనంగా ఎలా వ్యవహరిస్తున్నదో, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిని ఏదో ఒర విధంగా ఇరికించడానికి సంశయాలను రేకెత్తించే రీతిలో దర్యాప్తును కొనసాగిస్తున్నదో మీకు ఆ లేఖలో వివరించాను. మీరు జోక్యం చేసుకుని సీబీఐ సరైన రీతిలో దర్యాప్తులు జరిపే విధంగా చర్యలు తీసుకుంటారని నేను ఎంతో విశ్వాసంతో ఎదురు చూశాను. కానీ దురదృష్టవశాత్తూ పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారాయి. 

చివరి శ్వాస వరకూ కాంగ్రెస్‌లోనే ఉండి మృతి చెందిన దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుమారుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి పార్టీ అధిష్టానవర్గం పెత్తనాన్ని ధిక్కరించడమే కాక బయటకు వచ్చిన తరువాత మా రాష్ట్రంలో అపూర్వమైన రీతిలో ప్రజాదరణను చూరగొని ప్రజా నాయకునిగా ఎదిగాడనే ఒకే ఒక్క కారణంతో వై.ఎస్ పరువు ప్రతిష్టలను మంట గలపాలనే కృత నిశ్చయంతో సీబీఐ అతిగా వ్యవహరిస్తోంది.

2009 మే, వరకూ ఎలాంటి అధికార పదవుల్లో లేని వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డికి సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసులన్నింటిలోనూ ఉద్దేశ్యపూర్వకంగానే ముడి పెట్టాలనే (లింకు పెట్టాలనే) విధంగా ప్రయత్నిస్తోందని చెప్పక తప్పదని మీ దృష్టికి తెస్తున్నాను. సీబీఐ నిర్వాకం గురించి తొలుత చెప్పాలంటే వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రంలో గానీ, కేంద్రంలో గానీ మంత్రిగా లేక పోయినా ఆయనను ప్రధాన నిందితునిగా చేస్తూ చాలా లోప భూయిష్టమైన ఎఫ్.ఐ.ఆర్‌ను ఈ దర్యాప్తు సంస్థ దాఖలు చేసింది. ఏ అధికార పదవుల్లో లేని జగన్ ఏ ఫైళ్లలోనూ సంతకం చేసే అవకాశమే లేదు. ప్రజల సంపదను లూటీ చేయడానికి ఆస్కారం కల్పించిన అధికార ఉత్తర్వులను (జీవోలను) జారీ చేయడానికి కారకులైన అధికారులు, మంత్రులను కాకుండా జగన్‌ను ఎలా బాధ్యుడిను చేస్తారు? ప్రజా సంపద లూటీ అవడానికి కారణమయ్యాయన్న ఆరోపణలున్న జీవోలే డాక్టర్ పి.శంకర్‌రావు హైకోర్టులో వేసిన పిటిషన్‌కు ప్రధానమైన ప్రాతిపదిక. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించడానికి కూడా అవే ప్రాతిపదిక. 

కానీ జరిగేదంతా చూస్తుంటే సీబీఐ, బహుశా తనపై ఉన్న ఒత్తిడుల వల్ల జగన్‌నే లక్ష్యంగా (టార్గెట్‌గా) చేసుకుని వ్యవహరిస్తోంది. అధికార దుర్వినియోగానికి, ప్రజా సంపదను లూటీ చేయడానికి కారణమయ్యాన్న ఆరోపణలున్న జీవోలు జారీకి కారణమైన ఇతరుల జోలికి మాత్రం పోవడం లేదు. వివాదాస్పద జీవోలే ఈ కేసుకు ప్రధాన ప్రాతిపదిక అయినా సీబీఐ రూపొందించిన ఎఫ్‌ఐఆర్‌లో మాత్రం వాటిని జారీ చేసిన అధికారులు, మంత్రుల పేర్లు లేక పోవడం దిగ్భ్రాంతిని కలిగించే విషయంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం సీబీఐని ఇంత పచ్చిగా దుర్వినియోగం చేస్తోందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి ? 


సీబీఐ కోర్టు నుంచి తాను దర్యాప్తు చేస్తున్న కేసుల్లో సానుకూల ఉత్తర్వులు పొందాలనే ఉద్దేశ్యంతో వై.ఎస్.ఆర్ ప్రభుత్వం భారీ ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడిందనే విషయాన్ని ఎత్తి చూపడానికి తప్పుడు సమాచారాన్ని న్యాయమూర్తికి అంద జేయడానికి కూడా సీబీఐ వెనుకాడడం లేదు. అంతర్రాష్ట్ర వివాదం ఉందని నీటి కేటాయింపుపై ఇంజినీరింగ్ శాఖ వ్యతిరేకించినా వైఎస్సార్ ప్రభుత్వం ఇండియా సిమెంట్స్ లిమిటెడ్‌కు 13 టీఎంసీల నీటిని కేటాయించిందని సీబీఐ కోర్టుకు సమాచారం ఇచ్చింది.

ఈ విషయాలు పూర్తిగా వాస్తవ విరుద్ధం. ఇండియా సిమెంట్స్‌కు కేటాయించింది 0.013 టీఎంసీల నీటిని మాత్రమే! సీబీఐ కోర్టుకు చెప్పినట్లు 13 టీఎంసీలు మాత్రం కానే కాదు. ఇందులో వివాదం కూడా ఏమీ లేదు. ఇందులో ఉన్న వాస్తవాలు ఏమిటంటే, ఆంధ్రపదేశ్ దేశంలోనే అతి పెద్ద సిమెంటు ఉత్పాదక సామర్థ్యం గల రాష్ట్రం. ఇక్కడ 20కి పైగా అతి పెద్ద సిమెంటు ఫ్యాక్టరీలు ఉన్నాయి. 

వై.ఎస్ రాజశేఖరరెడ్డికి ముందున్న ప్రభుత్వాలు కూడా సిమెంటు ఫ్యాక్టరీల నిర్మాణానికి అనుమతులివ్వడంతో పాటు వాటిని నీరు, విద్యుత్ వసతి, సున్నపురాయి కేటాయింపు, తవ్వకాలకు అనుమతితో పాటుగా వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనను చే శాయి. ఇందులో కొత్తేమీ లేదు. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఇదే చేస్తాయి. మన రాష్ట్రంలోని గత ప్రభుత్వాలు కూడా సిమెంటుతో పాటుగా అన్ని పరిశ్రమలకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలనూ గతంలో చేశాయి. మరి ఇండియా సిమెంట్స్‌కు కేటాయించిన నీటి వ్యవహారంలోనే వారికేదో మేలు చేసినట్లుగా సీబీఐ అభిప్రాయానికి ఎలా వచ్చింది. ఒక కిలో లీటరు నీటిని 28 రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి స్టీలు ప్లాంటుకు ఏడు రూపాయలకే ప్రతి రోజూ 200 మిలియన్ లీటర్లు కేటాయిస్తున్న విషయం సీబీఐకి తెలియదా? మరి ఎందుకు సీబీఐ కోర్టులకు తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టిస్తోంది? మీడియాకు కూడా వాస్తవ విరుద్ధమై సమాచారాన్ని ఎందుకు ఇస్తోంది?ఐఎంసీ భారత ప్రాజెక్టు విషయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం నరర ప్రాంతంలోని సువిశాలమైన భూమిని ఇంచుమించు ఉచితంగా బహుమానంగా కట్టబెట్టింది.ఖరీదైన భూమిని నామమాత్రపు ధరకు ఇవ్వడమే కాక ఆ భూమిని ఒక మోసపూరిత సంస్థ అయిన ఐఎంజీ భారత పేరు మీద రిజిస్టర్ చేసుకోవడానికి బాబు ప్రభుత్వం నిధులను ఎలా సమకూర్చింది. 

తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ సాక్షులను సీబీఐ బెదిరిస్తోంది. తనకున్న పశు బలాన్ని ఉపయోగించి సాక్షులను ఒత్తిడి చేస్తున్నది. జగన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని సీబీఐ చేయని ప్రయత్నం లేదు. సీబీఐ తనకు కావాల్సిన విధంగా సాక్ష్యాన్ని సేకరించడానికి 164 సీఆర్‌పీసీ కింద సాక్షులను నయానా, భయానా బెదిరించి సీబీఐ జగన్‌కు వ్యతిరేకంగా వాగ్మూలాన్ని సేకరిస్తోంది. రాష్ట్ర ప్రజల మనోగతాన్ని అంచనా వేసినందు ఏదో విధంగా జగన్‌ను ఇరికించి ఆయనను అనర్హుడిగా చేయాలనే ప్రయత్నం జరుగుతోంది. తాజాగా జరిగిన రెండు ఉదంతాలే ఇందుకు నిదర్శనం. డిల్లాయిట్ సంస్థ ద్వారా జగతి సంస్థ అంతర్గత వినియోగం కోసం వాటాల విలువ కట్టిన రిపోర్టు ఒకటి. ఎమ్మార్ దర్యాప్తు రెండవది. 

మొదటి కేసులో జగతి డైరెక్టర్ విజయసాయి రెడ్డి తమను ఒత్తిడి చేసి సంస్థ వాటాల విలువలను ఎక్కువగా పెంచుతూ నివేదిక తీసుకున్నారనీ అంతేకాక వెనుక తేదీ వేసి నివేదిక ఇమ్మన్నారనీ డిల్లాయిట్ సంస్థ ప్రతినిధి చేత న్యాయమూర్తి ముందు వాగ్మూలాన్ని తీసుకున్నారు. తాము సమర్పించిన నివేదిక కేవలం జగతి అంతర్గత అవసరాలకు మాత్రమేననీ బయటి నుంచి పెట్టుబడి పెట్టే వారి కోసం కాదనీ స్పష్టంగా డిల్లాయిట్ సంస్థ ముందే పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా బయటి పెట్టుబడి దారులెవ్వరూ పెట్టుబడులు పెట్టరాదని స్పష్టంగా నిర్దేశించినపుడు ఇక దీని ఆధారంగానే పెట్టుబడులు వచ్చాయనడానికి ఆస్కారం ఎక్కడిది? నివేదికలో ఈ డిస్‌క్లెయిమర్ క్లాజు ఉన్నప్పటికీ సీబీఐ మాత్రం డిల్లాయిట్ నివేదిక వల్లనే పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టారని నమ్మబలుకుతోంది. అలా నమ్మబలుకని పక్షంలో వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అసలు కేసే లేదు. అందువల్లనే సీబీఐ ఆదరాబాదరా డిల్లాయిట్ ప్రతినిధి నుంచి 164 సీఆర్ పీసీ కింద స్టేట్‌మెంట్‌ను తీసుకుంది. ఈ స్టేట్‌మెంట్ ఆధారంగానే విజయసాయిరెడ్డిని అరెస్టు చేసింది. 300 గంటల పాటు అధికారికంగా విజసాయిరెడ్డిని ప్రశ్నించిన సీబీఐకి ఇందుకు సంబంధించి రవ్వంతైనా నష్టపూరితమై సమాచారమైనా లభించలేదు. ఏ సమాచారమూ లభించక పోవడంతో సీబీఐ ఇపుడు విజయసాయిరెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షలు చేయించాలని అంటోంది. నార్కో అనాలసిస్ పరీక్షలు చేయడం అనేది రాజ్యాంగంలోని 20(3) అధీకరణకు పూర్తి విరుద్ధమని సుప్రీంకోర్టు ఇప్పటికే పేర్కొంది. ఈ విషయం తెలిసి కూడా నార్కో పరీక్షలు చేయించాలని కోరిందంటే జగన్‌కు సన్నిహితంగా ఉన్న వారందరినీ భయ పెట్టాలన్నదే సీబీఐ ఉద్దేశ్యంగా కనపడుతోంది. 

ఇక ఎమ్మార్ కేసులో ప్రధాన సూత్రధారి అయిన తుమ్మల రంగారావును ఈ కేసు నుంచి బయట పడేయడానికి సీబీఐ దారి చూతుతూ వైఎస్సార్ కుటుంబానికి అతి సన్నిహితుడైన సునీల్ రెడ్డికి 80 కోట్ల రూపాయలు అంద జేశానని 164 సీఆర్‌పీసీ కింద మెజిస్ట్రేట్ ముందు సాక్ష్యం తీసుకున్నారు. చదరపు గజం 5000 రూపాయల కంటే ఎక్కువగా వసూలు చేసిన సొమ్ముగా దీనిని చూపించారు. దీనినే కారణంగా చూపి సునీల్‌ను వెంటనే అరెస్టు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో కోట్లాది రూపాయల బ్లాక్ మనీ కార్యకలాపాలతో సహా అన్ని రకాలకు అవకతవకలకు పాల్పడిన రంగారావు సాక్ష్యాన్ని నమ్మి సునీల్‌ను అరెస్టు చేశారు. 

సునీల్‌ను అరెస్టు చేసి రంగారావును ఈ కేసులో వదలి వేయడం చూస్తేనే సీబీఐ దర్యాప్తు నిజమైన దోషులను పట్టుకునే దిశలో కాకుండా, అంతిమంగా జగన్‌ను లక్ష్యంగా చేసుకుని సాగుతోందనేది స్పష్టంగా అర్థం అవుతోంది. లేకుంటే మొత్తం కుంభకోణంలో వందలాది కోట్ల రూపాయలు చేతులు మారడానికి, దుబాయ్‌లోని కోనేరు ప్రసాద్ కుమారుల ఖాతాల్లోకి తరలి వెళ్లడానికి కారకుడు రంగారావేనని ప్రాథమిక దశలోనే తేలినా ఎందుకు ఇంత వరకూ అతనిని అరెస్టు చేయలేదు. సీబీఐ ఒత్తిడి మేరకు రంగారావు ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా సునీల్‌ను అరెస్టు చేశారంటే అది జగన్‌ను టార్గెట్ చేయడమే సీబీఐకి అప్పగించిన విధిలాగా కనిపిస్తోంది. ఇటీవల కొద్ది రోజుల క్రితం చోటు చేసుకున్న జరిగింది ఇక్కడ ఉదహరించాలి. 

సీబీఐ ఉద్దేశ్యపూర్వకంగా ఓ వర్గం మీడియాకు కొన్ని లీకులు అందించింది. అదేమిటంటే, ఎమ్మార్ ఉదంతంలో వసూలు చేసిన అధిక మొత్తంలో కొంత భాగం అన్ని రాజకీయ పార్టీలకూ బ్లాక్‌లో అందినట్లు ఇందులో ప్రధాన సూత్రధారి వెల్లడించారని ఈ లీకుల్లో వెల్లడించారు. కానీ సీబీఐ గురి మాత్రం జగన్ వైపే కొనసాగుతోంది. 164 స్టేట్‌మెంట్‌లో రంగారావు చెప్పినట్లుగా మిగతా రాజకీయ పార్టీల ఊసే సీబీఐ ఎత్తడం లేదు. 

ఎమ్మార్ ఉదంతంలో తొలి నుంచీ అప్పటి ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ప్రమేయం ఉన్నట్లుగా స్పష్టంగా సీబీఐకి తెలిసినా ఆయనను ఇప్పటి వరకూ విచారించిన పాపాన పోలేదు. ఆయన స్టేట్‌మెంట్‌ను కూడా తీసుకోలేదు. ఈ దేశంలో అందరికీ తెలుసు కోనేరు ప్రసాద్ ఎమ్మార్ ప్రాజెక్టుకు పరోక్ష యజమాని అని. ఆయనతో దీర్ఘకాలికంగా చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనీ ఆయనకు మంచి మిత్రుడనీ అందరికీ తెలుసు. ఎకరా 4 కోట్లరూపాయల విలువ జేసే 285 ఎకరాల స్థలాన్ని కేవలం ఎకరా 29 లక్షల రూపాయలకు మాత్రమే బాబు కట్ట బెట్టారు. 

సరిగ్గా ఈ స్థలానికి పక్కనే ఉన్న బాబు భార్య స్థలం అంతకు మూడు ఏళ్లకు ముందు ఎకరా కోటి రూపాయల చొప్పున అమ్ముకున్నారు. దీనిని బట్టి రాష్ట్ర ఖజానాకు ఇదెంత నష్టం? ఈ నష్టం కొన్ని వందల కోట్లలో ఉంటుంది. అయితే సీబీఐ మాత్రం ఈ వాస్తవాలను వేటినీ పట్టించుకోలేదు. ఈ స్థలాన్ని అభివృద్ధి కోసం మూడో పార్టీకి ఇవ్వడానికి వీలు కల్పిస్తూ 2003ఆగస్టు 19న చంద్రబాబు ఏ కారణాలతో జీవో నెంబరు 359ని జారీ చేశారో సీబీఐ అసలు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ జీవో ద్వారా జరిగిన ఒప్పందపు సవరణే మొత్తం ఈ కుంభకోణానికి కీలకం. 

ఈ దిశగా అసలు సీబీఐ దర్యాప్తు చేయలేదు. అసలు ఆ సవరణ ఒప్పందం కనుక జరుగక పోయి ఉంటే తదుపరి కుంభకోణం జరుగడానికి ఆస్కారం ఉండేదే కాదు. ఈ ప్రాజెక్టును కేటాయించడానికి అనుసరించిన టెండర్ల విధాన ం కన్నా మోసం (ఫార్సు) మరొకటి ఉండదు. ఈ ప్రాజెక్టులో ముందుకు వచ్చిన ఐదు సంస్థల్లో సోమ్ ఏసియా, షాపూర్‌జీ పల్లోంజీలను కమిటీ నిరాకరించింది. మిగిలిన మూడు సంస్థల్లో అన్నీ చంద్రబాబునాయుడుతో సంబంధాలు ఉన్నవే. ఎల్ అండ్ టి, ఐఓఐ సంస్థలు రెండింటికీ మరో రకంగా లబ్ది చేకూరినందున తమ బిడ్లను ఉపసంహరించుకున్నాయి. 

ఎమ్మార్ సంస్థకు మార్గం సుగమం చేయడానికే ఇదంతా జరిగింది. ఎల్ అండ్ టి డైరెక్టర్ రామకృష్ణ, ఐఓఐ కి చెందిన చుక్కపల్లి సురేష్ ఇద్దరూ బాబు అత్యంత సన్నిహితులు. ఇక్కడ ఉపసంహరించుకున్న ఫలితంగా ఎల్ అండ్ టికి హైటెక్ సిటీ నిర్మాణం, కాకినాడ పోర్టు పనులు లభించాయి. ఇందులో పెద్ద కుంభకోణమే చోటు చేసుకుంది. రైట్స్ సంస్థ ఎల్ అండ్ టి కన్సార్టియమ్‌కు సిఫార్సు చేయక పోవడంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడిన కమిటీ అన్ని నిబంధనలనూ తోసి రాజని ఇదే సంస్థకు పోర్టు పనులను కట్టబెట్టింది. బిడ్ల నుంచి నిష్ర్కమించిన ఐఓఐ సంస్థకు జెమ్స్ అండ్ జుయెల్ పార్కును, హైటెక్ సిటీ రెండో దశ ప్రాజెక్టునూ కట్టబెట్టారు. 

చిరకాల మిత్రులైన బాబు, కోనేరు ప్రసాద్ ఇద్దరూ కలిసి మరో కుట్రను కూడా పన్నారు. ఈ ప్రాజెక్టును రెండుగా విభజించి అత్యధిక లాభాలను ఇచ్చే టౌన్‌షిప్‌లో 74 శాతం ఈక్విటీని ఎమ్మార్‌కు, 26 శాతం ఈక్విటీని ఏపీఐఐసీకి ఉండేలా చూశారు. నిర్మాణంలో ఎక్కువ సమయం పట్టే దీర్ఘకాలిక మరో ప్రాజెక్టు కన్వెన్షన్ సెంటర్, స్టార్ హోటల్‌లో మాత్రం 49 శాతం షేర్లు ఏపీఐఐసీకి, మిగతా షేర్లు ఎమ్మార్‌కు ఉండేలా చేశారు. దీనికన్నా మరో మోసం, కుంభకోణం ఇంకేమైనా ఉంటుందా? సీబీఐ ఎందుకు ఈ కుంభకోణం దిశగా దృష్టిని సారించలేదు? రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేయడానికి కారణమైన కోనేరు ప్రసాద్, చంద్రబాబులను ఎందుకు పట్టించుకోలేదు? అందరికీ అనుమానాలు కలిగిస్తున్న ఈ విషయంలో సీబీఐ ఇక్కడి నుంచి ఎందుకు దర్యాప్తు ప్రారంభించలేదు? అసలు సునీల్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడం ఒక పెద్ద మిస్టరీగా ఉంది. 

ప్రజల్లో వై.ఎస్.రాజశేఖరరెడ్డికి ఉన్న పరువు ప్రతిష్టలను మంట గలిపేందుకే ఇలా చేస్తున్నారనేది స్పష్టం కావడం లేదా? వై.ఎస్ కుమారుడు జగన్ కాంగ్రెస్ అధిష్టానవర్గం పెత్తనాన్ని సవాలు చేసినందుకేననేది స్పష్టం కావడం లేదా?ఎమ్మార్ కుంభకోణంలో సూత్రధారి బాబు పాత్ర ఉన్నట్లు స్పష్టంగా రుజువులు ఉన్న తరువాత కూడా ఆయనను పిలిచే విషయాన్ని సీబీఐ పట్టించుకోవడం లేదు. 

ఈ కేసులో ఆయన ప్రమేయం ఉన్నందుకు బాబును కూడా సీబీఐని అరెస్టు చేయమనండి. ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా ఉన్న కె.రోశయ్య(అప్పటి ఆర్థిక మంత్రి) నేతృత్వంలోని మంత్రివర్గం ఉపసంఘం సిఫార్సుల మేరకే కన్వెన్షన్ సెంటర్ ప్రాజెక్టులో ఏపీఐఐసీ వాటాను అప్పట్లో వైఎస్సార్ ప్రభుత్వం 26 శాతానికి తగ్గించింది. దీని వల్ల ఎలాంటి న్యాయపరమైన హక్కులు పోకుండా ఎక్కువ ఆర్థిక పరమైన భారం పడకుండా ఉంటుంది. 

మనలో చాలా మందిమి దశాబ్దాల తరబడి ప్రజా జీవితంలో ఉన్నాం. కానీ ఇపుడు మేం పడుతున్న బాధలు, గురవుతున్నంత భయాందోళనలు ఎన్నడూ చవి చూడలేదు. మేం జీవనం సాగిస్తున్నది పోలీసు రాజ్యంలోనా? లేక చట్టబద్ధమైన పాలన ఉన్న స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యంలోనా? అని ఆశ్చర్యం, ఆవేదన కలుగుతోంది. పైన పేర్కొన్న సీబీఐ చర్యలన్నీ న్యాయస్థానం ఆదేశాల మేరకే జరుగుతున్నాయనడాన్ని మేం విభేదించడం లేదు. అలాగే న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులకు దురుద్దేశ్యం ఆపాదించే స్థాయికి దిగజారడం కూడా లేదు. కోర్టు ధిక్కారమవుతుందనే భయంతో మాత్రం కాదు, కానీ న్యాయస్థానాల పట్ల మాకు ఉన్న గౌరవాభిమానాలతో మాత్రమే! పిటిషనర్లు సమర్పించి ప్రాథమిక సాక్షాల ఆధారంగా కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించినందుకు మాకు రవ్వంత కూడా కక్ష లేదు. కానీ మాకున్న ఫిర్యాదల్లా తమ రాజకీయ బాస్‌ల ఆదేశాల మేరకు సీబీఐ కేసుల్లో విచారణ జరుపుతున్న తీరుపైనే! కేంద్ర ప్రభుత్వం 1975లో తీసుకున్న ఓ చర్యను ఇక్కడ వివరిస్తాను. 

కొందరు పిటిషనర్లు సమర్పించిన కొన్ని ప్రాథమిక సాక్ష్యాల ఆధారంగా మచ్చలేని మహానాయకులైన జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, నానాజీ దేశ్‌ముఖ్, అటల్ బిహారీ వాజ్‌పాయ్, చరణ్‌సింగ్, మధు దండావతే, మదు లిమాయే, జార్జి ఫెర్నాండెజ్, ఎల్.కె.అద్వానీ వంటి నాయకులతో పాటు మరి కొన్ని మిలియన్ల మందిని కేవలం కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినందుకు జైళ్లలో ఉంచింది. అప్పట్లో న్యాయమూర్తులను సస్పెండ్ చేశారు. రాజ్యాంగ మౌలిక వ్యవస్థనే మార్చే విధంగా లోక్‌సభ పదవీకాలాన్ని ఆరేళ్లకు పొడిగిస్తూ రాజ్యాంగంలో సవరణ తె చ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేశారు. ఈ అస్తవ్యస్త అప్రజాస్వామిక పరిస్థితిని జాతి మొత్తం నిశ్ఛేష్టమై నిస్సహాయంగా చూస్తూ ఉండింది. మొత్తం ప్రజాస్వామిక హక్కులను కాలరాసినపుడు ఏమీ చేయలేక పోయింది. మీలాంటి వ్యక్తి పరిపాలనలో మళ్లీ అలాంటి అప్రజాస్వామిక పరిస్థితి దేశంలో తలెత్తకూడదనే మేం ఆశిస్తున్నాం. 

దేశంలో సీబీఐ, ఇడి సంస్థలు ఆదాయపు పన్ను శాఖలు వ్యవహరిస్తున్న తీరుపై ఆవేదనతో ఫిర్యాదు చేసే వారిలో మేమే ప్రథములం కాము. ఈ సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్న విధానాన్ని మేమే తొలిసారిగా ఎత్తి చూపడం లేదు. తమ కనుసన్నల్లో ఉండని వారినీ తమ పెత్తనాన్ని ప్రశ్నించే వారినీ లేకుండా చేయాలనీ, అణగదొక్కేందుకు ఇలాంటి సంస్థలను దుర్వినియోగం చేయడం కొత్తేమీ కాదని మీ దృష్టికి తెస్తున్నాను. గత డిసెంబర్ 27, 29 తేదీల్లో లోక్‌సభలో, రాజ్యసభలో లోక్‌పాల్ బిల్లు సందర్భంగా జరిగిన చర్చల్లో అన్ని రాజకీయ పార్టీలూ ఒక్క కాంగ్రెస్ తప్ప సీబీఐని కేంద్ర ప్రభుత్వం ఎలా దుర్వినియోగం చేస్తోందో తప్పు పట్టాయి. సీబీఐని అడ్డం పెట్టుకుని తమ పట్ల వ్యక్తం అవుతున్న అసమ్మతిని అణచి వేసేందుకు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలను అణగ దొక్కేందుకూ ఎలా వ్యవహరిస్తున్నదో అన్ని పక్షాలూ వివరించాయి.

అంతిమంగా అయ్యా నేను మనవి చేసేది ఒక్కటే,
సీబీఐ మీ పరిపాలనా నియంత్రణలోనే నడిచే సంస్థ. నిజాయితీ గల మీలాంటి వ్యక్తి ఈ పరిణామాలన్నింటినీ చూసే ఊరుకుంటున్నారని మేం అనుకోవడం లేదు. అందుకే తమ రాజకీయ బాసుల ఒత్తిళ్లకు లోను కాకుండా నిష్పాక్షికంగా సీబీఐ దర్యాప్తు నిర్వహించాలని ఆదేశించాల్సిందిగా మీకు మేం విజ్ఞప్తి చేస్తున్నాం.

మీ భవదీయురాలు
వై.ఎస్.విజయమ్మ
గౌరవాధ్యక్షురాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
Share this article :

0 comments: