లోకేష్‌ను చదివించడానికి 60 లక్షలను వేరెవళ్లతోనో కట్టించిన దౌర్భాగ్య పరిస్థితి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లోకేష్‌ను చదివించడానికి 60 లక్షలను వేరెవళ్లతోనో కట్టించిన దౌర్భాగ్య పరిస్థితి

లోకేష్‌ను చదివించడానికి 60 లక్షలను వేరెవళ్లతోనో కట్టించిన దౌర్భాగ్య పరిస్థితి

Written By ysrcongress on Saturday, February 11, 2012 | 2/11/2012

‘టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడును నేటి యువత ఏం చూసి ఆదర్శంగా తీసుకోవాలి? . పిల్ల నిచ్చిన మామకు వెన్ను పోటు పొడిచినందుకా? తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావునూ, బావమరిది హరికృష్ణనూ, చివరకు రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడిని కూడా వాడుకుని వదిలేసినందుకా? లేక తొమ్మిదేళ్ల పాలనలో ప్రజా వ్యతిరేక పాలనను అందించినందుకా? ప్రజా ఉద్యమాలను అణచి వేసినందుకా? లేక ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయించి యువకులకు ఉద్యోగాలు లేకుండా చేసినందుకా?’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. ప్రతిష్టను కోల్పోతున్న తన పార్టీని కాపాడుకోవడానికి యువతరంగాలు పేరుతో బాబు నిర్వహిస్తున్న సభల్లో ‘నేను ముఖ్యమంత్రిగా ఉండగా...అవి చేశాను, ఇవి చేశాను...అని సొంత డబ్బా కొట్టుకుంటున్నారు’ అని ఆయన ఎద్దేవా చేశారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాబు ఎంతటి గొప్పవాడో.. పాపం, ఎవరూ చెప్పడం లేదని, అందుకే తనను తానే పొగుడుకునే దౌర్భాగ్య స్థితికి దిగజారాడని అంబటి పేర్కొన్నారు.

ఎన్టీఆర్ కుటుంబాన్ని తన రాజకీయాలతో చిందర వందర చేసిన బాబు అధికారం కోసం తాను ఏ గడ్డైనా కరుస్తానని యువతకు బోధిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. తొమ్మిదేళ్లు తన పాలన బ్రహ్మాండంగా ఉండేదని, కావాలంటే తమ తల్లిదండ్రులను అడిగి తెలుసుకోవాలని బాబు వారిని కోరుతున్నారని నిజంగా ఆయన పాలన అంత బాగుంటే ప్రజలు వరుసగా ఎందుకు చిత్తుగా ఓడించారో, ఇప్పటికీ డిపాజిట్లు గల్లంతయ్యేలా ఎందుకు తిరస్కరిస్తున్నారో చెప్పాలని రాంబాబు నిలదీశారు. ఇప్పటికే రెండు సార్లు బాబును ప్రజలు ఛీకొట్టారని, మరో మారు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. బాబు పాలన ఎలాంటిదో యువకుల తల్లిదండ్రులకు బాగా తెలుసునని, అందుకే వారు ఇలాంటి తీర్పు ఇచ్చారని ఆయన అన్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫీజు రీఇంబర్స్‌మెంట్ పథకం వల్లనో, తల్లిదండ్రుల కష్టార్జితం వల్లనో చదువుకుంటున్న యువకుల వద్దకు వెళ్లి తానే ఆదర్శవంతుడనని చెప్పుకోవడం దారుణమని ఆయన అన్నారు. 

తన కుమారుడు లోకేష్‌ను స్టాన్‌ఫోర్డు యూనివర్సిటీలో చదివించడానికి 60 లక్షల రూపాయలను వేరెవళ్లతోనో కట్టించిన దౌర్భాగ్య పరిస్థితి గురించి యువతకు ఎందుకు చెప్పడం లేదని ఆయన చంద్రబాబుని ప్రశ్నించారు. తానుండగా ఉద్యోగాలు కల్పించాననడంలో ఏ మాత్రం నిజం లేదని, దేశం మొత్తం 160 ప్రభుత్వ రంగ సంస్థలు మూత పడితే బాబు హయాంలో మన రాష్ట్రంలోనే 80 సంస్థలు మూతపడ్డాయని ఆయన గుర్తు చేశారు. అంతెందుకు, బాబు తాను రాసుకున్న ‘మనసులో మాట’ పుస్తకంలో ప్రభుత్వ ఉద్యోగాలపై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారోయువత తెలుసుకోవాలని అంబటి సూచించారు. బాబు తాను రాసిన ఈ పుస్తకాన్ని మార్కెట్ నుంచి ఎందుకు మాయం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే యువతరంగానికి వచ్చిన యువకులందరికీ ఈ పుస్తకాన్ని పంచి పెట్టాలని, అది చూసిన వారు వచ్చిన దారినే తిరిగి పోతారని ఆయన సవాలు విసిరారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఖజానాకు భారమని చెప్పిన బాబు ఇపుడు ఉద్యోగాలు ఇస్తానంటే నమ్మేంతటి అమాయకులు యువకులు కారని ఆయన వ్యాఖ్యానించారు. జూనియర్ డాక్టర్ల సమ్మె వల్ల రాష్ట్రంలోని వైద్యశాలల్లో రోగుల మృతితో మరణ మృదంగం మోగుతోంటే ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం అమానుషం అని రాంబాబు దుయ్యబట్టారు. సమ్మె చేస్తున్న వారిదే బాధ్యత అన్నట్లుగా ప్రభుత్వం చేతులు దులుపుకోవడం సరికాదని వారిని చర్చలకు పిలిచి వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: