చార్జీలు పెంచబోమన్న వైఎస్ హామీని సర్కారు అమలు చేయదేం? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చార్జీలు పెంచబోమన్న వైఎస్ హామీని సర్కారు అమలు చేయదేం?

చార్జీలు పెంచబోమన్న వైఎస్ హామీని సర్కారు అమలు చేయదేం?

Written By ysrcongress on Sunday, February 19, 2012 | 2/19/2012

రెంట్ చార్జీల పెంపును తిరస్కరించండి.. ఈఆర్‌సీకి రైతుల డిమాండ్ 
చార్జీలు పెంచబోమన్న వైఎస్ హామీని సర్కారు అమలు చేయదేం?
గతంలో ఎన్నడూ లేని విధంగా కరెంట్ చార్జీలను 21శాతం పెంచారు
ఎంపీల ప్లాంట్లకు ఫుల్లుగా గ్యాసు, జెన్‌కోకు మొండిచేయా?
ప్రతిపాదనలను ప్రభుత్వానికి ఈఆర్‌సీ తిప్పి పంపాలి : కె.రామకృష్ణ
చార్జీల పెంపును అంగీకరిస్తే రాష్ట్రం అగ్నిగోళమే: రాఘవులు
కరెంటు శాఖ వల్ల మేం పైరవీకారులుగా మారాల్సి వస్తోంది: హరీశ్
మేం చెట్లపాటి విలువ చేయమా : రైతు సమాఖ్య నేత వేణుగోపాల్‌రావు

హైదరాబాద్, న్యూస్‌లైన్: కరెంటు చార్జీల పెంపు ప్రతిపాదనలపై పార్టీల, ప్రజా సంఘాల నేతలు, రైతులు కన్నెర్రజేశారు. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)ని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.5,000 కోట్ల దాకా చార్జీలను పెంచుతూ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు సమర్పించిన ప్రతిపాదనలను తిరస్కరించాలని వారు కోరారు. డిస్కంల ప్రతిపాదనపై లక్డీకాపూల్‌లోని ఫ్యాప్సీ హాలులో ఈఆర్‌సీ చైర్మన్ రఘోత్తమరావు, సభ్యుడు శేఖర్‌రెడ్డి శనివారం నిర్వహించిన బహిరంగ విచారణ ఇందుకు వేదికైంది. వచ్చే ఐదేళ్లూ కరెంటు చార్జీలు పెంచబోమని 2009 ఎన్నికల ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారని సీపీఐ నేత కె.రామకృష్ణ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ హామీ ద్వారా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు చార్జీలు పెంచడమేమిటంటూ ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. 

చార్జీల పెంపుపై ఏమైనా అభిప్రాయాలుంటే ఈఆర్‌సీకి చెప్పుకోవాలంటూ అదే ప్రభుత్వం ఇప్పుడు చేతులు దులుపుకోవడం దారుణమన్నారు. చార్జీల పెంపును తిరస్కరిస్తూ ప్రతిపాదనను ప్రభుత్వానికి వెనక్కు పంపాల్సిందిగా ఈఆర్‌సీని కోరారు. అప్పుడు ప్రభుత్వంతో తాము తాడోపేడో తేల్చుకుంటామని తెలిపారు. కరెంటు చార్జీలను గతంలో ఎన్నడూ లేనివిధంగా మొత్తంమీద 21 శాతం పెంచారన్నారు. ప్రజాప్రతినిధులు తమ సొంత బాగోగులే చూసుకుంటున్నారంటూ దుమ్మెత్తిపోశారు. ఎంపీలకు చెందిన విద్యుత్ ప్లాంట్లకు గ్యాస్ కేటాయింపులు జరుగుతున్నాయని, జెన్‌కో ప్లాంట్లకు మాత్రం జరగడం లేదని వాపోయారు. కోనసీమ విద్యుత్ ప్లాంటుతో అప్పట్లో ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)పై విచారణ జరిపి సీఐడీ సవరించిన నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మిగతా ప్రైవేట్ ప్లాంట్ల పీపీఏలపై కూడా విచారణ జరిపించాలన్నారు.

ప్రజలు భరించలేరు: రాఘవులు

చార్జీల పెంపును ప్రజలు భరించే స్థితిలో లేరని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. చార్జీలు పెంచడాన్ని తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. కమిషన్ కూడా అంగీకరించొద్దని సూచించారు. కాదని చార్జీలు పెంచితే రాష్ట్రం అగ్నిగోళంగా మారే ప్రమాదముందని తీవ్రంగా హెచ్చరించారు. తక్కువ స్థాయిలో విద్యుత్ వినియోగించే గృహ వినియోగదారులకు టెలిస్కోపిక్ విధానాన్ని ఎత్తేయడం తగదన్నారు. పారిశ్రామికరంగం ఇప్పటికే తిరోగమనంలో ఉన్న ఈ సమయంలో చార్జీలు పెంచితే మరింత వెనకబాటు తప్పదన్నారు. ‘‘బొగ్గు, గ్యాస్ ధరల పెంపుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలే కారణం. వాటి పాపాలను ప్రజలపై రుద్దడం సరికాదు. డిమాండ్, లోటులను తక్కువగా చూపి ప్రభుత్వం నాటకమాడుతోంది. తద్వారా సబ్సిడీ భారాన్ని తగ్గించుకునేందుకు ఎత్తు వేసింది. ప్రభుత్వం ఆడుతున్న ఈ నాటకానికి ఈఆర్‌సీ కూడా వంతపాడుతోందన్న అనుమానం రాకుండా చూడాల్సిన బాధ్యత సంస్థదే. కేటగిరీలకు ఉన్నట్టుగానే సర్దుబాటు చార్జీలు కూడా వేర్వేరుగా ఉండాలి. లేదంటే పేదలపై అధిక భారం పడుతుంది. జెన్‌కోకు డిస్కంలు చెల్లించాల్సిన రూ.3,200 కోట్లను ప్రభుత్వమే చెల్లించాలి’’ అని డిమాండ్ చేశారు. 

లాంకోకు గ్యాస్ కేటాయింపులు జరుగుతున్నాయి కానీ తెలంగాణలో జెన్‌కో ప్లాంట్లకు మాత్రం జరగడం లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ‘‘విశాఖలో రెండు గంటలు కరెంటు కోతలు విధిస్తుంటే వరంగల్, మెదక్‌లలో 4 గంటల పాటు కోత అమలు చేస్తున్నారు. కరెంటు శాఖ వాళ్ల వల్ల మేం పైరవీకారులుగా మారాల్సి వస్తోంది. రైతులకు కావాల్సిన ట్రాన్స్‌ఫార్మర్లు, కనెక్షన్ల కోసం కూడా మేం అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమన్వయకర్త కె.రఘు ఆరోపించారు. 300 యూనిట్లకు మించి వాడే లగ్జరీ వినియోగదారులకు చార్జీలను తక్కువగా పెంచుతూ, 50 యూనిట్లు వాడేవారినే లక్ష్యంగా చేసుకుని ఎక్కువగా పెంచారని విమర్శించారు. ల్యాంకో నుంచి 50 శాతం కరెంటును తక్కువ ధరకు తీసుకోకుండా అధికంగా చెల్లిస్తుండటం వల్ల ప్రజలపై ఏటా రూ.4,290 కోట్ల భారం పడుతోందన్నారు. సర్దుబాటు చార్జీలను డిస్కంల వారీగా వసూలు చేయాలని విద్యుత్‌రంగ నిపుణుడు ఎం.వేణుగోపాల్‌రావు కోరారు. టెలిస్కోపిక్ విధానం ఎత్తివేతను అంగీకరించొద్దన్నారు. జెన్‌కో విద్యుత్ ప్లాంట్ల వ్యయం పెరుగుతోందని పీపుల్స్ మానిటరింగ్ గ్రూపు చైర్మన్ తిమ్మారెడ్డి అన్నారు. ఎల్‌టీ పరిశ్రమలకు కరెంటు సరఫరాను ఈ ఏడాది కంటే వచ్చే ఏడాది తగ్గించి చూపారంటూ తప్పుబట్టారు. కరెంటు కోతలపై నిరసన వ్యక్తం చేసినందుకు వారిపై కోపంతో విద్యుత్ సంస్థలు ఇలా వ్యవహరిస్తున్నాయన్న అనుమానం వస్తోందన్నారు. చార్జీల పెంపుకు అవకాశం ఇవ్వాలని సీపీడీసీఎల్ సీఎండీ అనంతరాము ఈఆర్‌సీని కోరారు.

ఇదీ చార్జీల పెంపు మతలబు..!

నెలకు 30 యూనిట్ల (ఏడాదికి 360 ) కంటే ఎక్కువ కరెంటు వాడేవారికి టెలిస్కోపిక్ విధానాన్ని ఎత్తేయడం ద్వారా ఎలా ఎక్కువ భారం పడేదీ టీజాక్ నేత కె.రఘు సవివరంగా తెలిపారు. 50 యూనిట్లు వాడేవారు ప్రస్తు తం చెల్లిస్తున్న రూ.72.50కి బదులు యూనిట్‌కు రూ.2.6 చొప్పున ఏకంగా రూ.130 చెల్లించాల్సి వస్తుంది. అంటే వారికి చార్జీలు ఏకంగా 79.31 శాతం మేర పెరుగుతాయి!

కరెంటు వాడకం టారిఫ్/ నెలవారీ చార్జీ
(యూనిట్లలో) యూనిట్
2011-12 50 రూ. 1.45 రూ.72.50
2012-13 50 రూ.2.60 రూ.130.00

ఇవీ పెంపు ప్రతిపాదనలు...
పరిశ్రమలకు విద్యుత్ చార్జీలు యూనిట్‌కు రూ.4.13 నుంచి రూ.5కు పెంపు
హై-టెన్షన్ (హెచ్‌టీ) కేటగిరీ పరిశ్రమలకు కరెంటు చార్జీలు యూనిట్ రూ.1 నుంచి రూ.1.22 దాకా పెంపు
రైల్వే ట్రాక్షన్ కరెంటు చార్జీలు రూ. 4.45 నుంచి రూ.5.75కు పెంపు
కరెంటు బిల్లులు సక్రమంగా చెల్లించకపోతే గృహ వినియోగదారులపై కేటగిరీలవారీగా రూ.10-రూ.25 దాకా, వాణిజ్య సంస్థలు రూ.25-75 దాకా ఆలస్య రుసుం విధించే యోచన
మొత్తం రూ.4,945 కోట్ల మేర చార్జీల పెంపుకు అనుమతివ్వాలని ఈఆర్‌సీకి డిస్కంల విజ్ఞప్తి

మేం చెట్లపాటి విలువ చేయమా?
కరెంటు చార్జీల పెంపు ప్రతిపాదనలకు నిరసనగా, రైతు సంఘాల సమాఖ్య నేత వేణుగోపాల్‌రావు గోనెసంచితో తయారు చేసిన షర్టు ధరించి సమావేశానికి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. 
బీవీ రాఘవులు ప్రసంగం సందర్భంగా జోక్యం చేసుకుని, ‘విద్యుత్ టవర్ల నిర్మాణ సమయంలో పొలంలో పంట, చెట్లు ఉంటే వాటికి నష్టపరిహారం చెల్లిస్తున్నారు. కానీ పొలానికి మాత్రం చెల్లించడం లేదు. మేం చెట్లపాటి విలువ చేయమా?’ అని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. దీనిపై కమిషన్ తక్షణం స్పందించి, పరిహారమిచ్చేలా ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు. బతకడమే కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కిడ్నీ అమ్ముకునేందుకు తనకు అవకాశమివ్వాలని అభ్యర్థించారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల భూములు ఎందుకు తీసుకోరని ఆవేశంగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా విచారణ ప్రక్రియ కాసేపు నిలిచిపోయింది. రైతుల పట్ల ప్రేమ ఉంటే సమావేశాన్ని బాయ్‌కాట్ చేయాలని రాఘవులును కోరారు. ‘మీరు మాట్లాడినట్టుగానే మాట్లాడి, బాయ్‌కాట్ చేస్తా’నని రాఘవులు బదులిచ్చారు.
Share this article :

0 comments: