ఈసీకి ఫిర్యాదు చేసిన వైఎస్సార్ సీపీ నేతలు
హైదరాబాద్, న్యూస్లైన్: కోవూరులో డిపాజిట్ దక్కించుకునేందుకోసం కాంగ్రెస్, టీడీపీలు నీతిబాహ్యంగా ప్రవర్తిస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధులు జూపూడి ప్రభాకరరావు, జనక్ప్రసాద్లు ధ్వజమెత్తారు. ఇంటింటికీ సారా, డ బ్బులు పంచుతూ కులదైవాలపై ప్రమాణాలు చేయించడం ఆ పార్టీల బరితెగింపు చర్యలకు నిదర్శనమన్నారు. కోవూరులో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు డబ్బులు వెదజల్లుతూ ఓటర్లను ప్రలోభపెడుతున్నాయని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రశాంత వాతావరణంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ, కాంగ్రెస్లు సిగ్గొదిలి చివరి ప్రయత్నంగా ఎన్నికల్లో తమ పార్టీలకే ఓటేయాలని ఓటర్లతో ప్రమాణాలు చేయిస్తూ దుష్టసంప్రదాయానికి తెరలేపాయని దుయ్యబట్టారు. ఇందుకూరుపేట మండలం కిష్టాపురం గ్రామంలో ఓటర్లతో ప్రమాణాలు చేయించి ఎన్నికల నియామవళి ఉల్లంఘించినా పట్టించుకోకపోవడం శోచనీయమని జనక్ప్రసాద్ అన్నారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు కేకే మహేందర్రెడ్డి మాట్లాడుతూ దొంగలు.. దొంగలు ఊర్లూ పంచుకున్నట్లు కోవూరులో టీడీపీ, కాంగ్రెస్లు కుమ్మక్కై ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నాయని, కుల, మత ఆచారాలపై ప్రమాణాలు చేయిస్తూ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు కుయుక్తులు పన్నుతున్నాయని విమర్శించారు. ఈసీని కలిసిన వారిలో మాజీ మంత్రి మూలింటి మారెప్ప, ఎస్సీ సెల్ కన్వీనర్ నల్లా సూర్యప్రకాశరావు తదితరులున్నారు.
0 comments:
Post a Comment