తెలంగాణ కోసం పదవిపోవడం సంతోషం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలంగాణ కోసం పదవిపోవడం సంతోషం

తెలంగాణ కోసం పదవిపోవడం సంతోషం

Written By ysrcongress on Saturday, March 3, 2012 | 3/03/2012

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా ఎమ్మెల్యే పదవిని కోల్పోవడం తనకు చాలా సంతోషంగా ఉందని మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. తెలంగాణ రాజకీయ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకే అవిశ్వాసం సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు ఆమె చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు అడ్డంకులు సృష్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కొనసాగే అర్హత లేదని అవిశ్వాసానికి మద్దతిచ్చానన్నారు. తెలంగాణ కోసం తాను చేసిన కృషి పరకాల ప్రజలు తప్పకుండా ఆదరిస్తారన్నారు. పరకాలలో తనపై టీఆర్‌ఎస్ పోటీ చేస్తే అది స్వయంకృతాపరాదమే కాకుండా తెలంగాణ వాదాన్ని నీరుగార్చటం అవుతుందన్నారు. ఆమె తన నివాసంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ విషయంలో తన చిత్తశుద్దిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదన్నారు. తాను రెండు సార్లు రాజీనామా చేశానని చెప్పారు. ఇప్పటికీ స్పీకర్ వద్ద ఒకటి పెండింగ్‌లోనే ఉందన్నారు. విప్ దిక్కరించినందుకు అనర్హత వేశారే కానీ తన రాజీనామాను డిస్మిస్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించలేదన్నారు.

పరకాలలో తనపై టీఆర్‌ఎస్ పోటీ చేయదని భావిస్తున్నట్లు చెప్పారు. ఒక వేళ పోటీ చేస్తే రాజకీయ జేఏసీ, విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వచ్చే అవకాశముందని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా ఎక్కడా ప్రవర్తించలేదన్నారు. సెంటిమెంట్‌ను గౌరవించినందు వల్లే తెలంగాణ కోసం పదవులు వదులుకున్న స్థానాల్లో తమ పార్టీ పోటీ చేయడంలేదని వివరించారు. తెలంగాణపై కాంగ్రెస్ నాన్చుడి ధోరణి వల్లే ఎన్నో కుటుంబాలు తమ పిల్లల్ని కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇప్పటికీ కేసులతో వేధింపులకు గురవుతున్నారని గుర్తు చేశారు. అందుకే ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉండరాదనే అవిశ్వాసానికి మద్దతిచ్చానని చెప్పారు. అవిశ్వాసానికి రెండ్రోజుల ముందు కూడా ఇదే విషయాన్ని చెప్పానన్నారు. తెలంగాణను ఏ విధంగా కాంగ్రెస్ అణగదొక్కుతుందో వచ్చే ఉప ఎన్నికల్లో ప్రజలకు వివరిస్తానన్నారు. అంతేకాదు ఎవరి రెక్కల కష్టంపై అధికారం చేపట్టిందో అదే కుటుంబాన్ని కేసులతో వేధింపులకు గురిచేస్తుందన్నారు. అవినీతి ముద్రవేసి కక్షసాధింపులకు గురిచేస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్-టీడీపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆమె హెచ్చరించారు. త్వరలో వచ్చే ఉప ఎన్నికల్లో వైఎస్ సంక్షేమ పథకాలను, తెలంగాణ సెంటిమెంట్ రెండిటినీ ప్రచారాస్త్రాలుగా చేసుకోనున్నట్లు ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు.
Share this article :

0 comments: