సోనియా నియంతృత్వంతోనే కాంగ్రెస్కు ఎన్నికల్లో పరాభవం
రాష్ట్రాల్లో సమర్థులైన నాయకులను అణచివేస్తున్న అధిష్టానం
వైఎస్ఆర్ పథకాలకు తూట్లు పొడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
పులివెందుల(వైఎస్ఆర్ జిల్లా), న్యూస్లైన్: ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే ఇబ్బందులను.. వేధింపులను ఎదుర్కొంటూనే.. ప్రజాసమస్యల నిమిత్తం రైతు దీక్ష..పోలవరం కోసం పాదయాత్ర.. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంటు కోసం నిరాహార దీక్ష.. చేనేతల సంక్షేమం కోసం మూడు రోజుల దీక్ష.. రైతులకు సాగునీటి కోసం జలదీక్ష ఇలా నిత్యం పోరాటం చేస్తూ ముందుకు వెళుతున్న జగన్ బాబును చూస్తే ఒక్కోసారి బాధనిపిస్తోంది. కనీసం తినడానికి కూడా సమయం లేకుండా పోయిందనుకున్నప్పుడు ఏం ఖర్మ చేసుకున్నామా అనిపిస్తుంటుంది. ఎందుకు నాయనా ఈ నిరాహార దీక్షలు అంటే.. ప్రజల కోసం పోరాడేటప్పుడు ఇలాంటివి తప్పవమ్మా... అప్పుడు నాన్న కూడా ఇలాగే కష్టపడ్డారంటూ జగన్బాబు చెబుతున్నప్పుడు ఒకింత బాధనిపిస్తోంది. ఇలా ఎన్నాళ్లు పోరాడాలో తెలియదు కానీ.. వైఎస్ రాజశేఖరరెడ్డి జగన్బాబును నాకు అప్పగించారు. నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నా.. ఆశీర్వదించండంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.విజయమ్మ పేర్కొన్నారు. పులివెందులలోని బాకరాపురంలోని వైఎస్ఆర్ మోమోరియల్ ఆడిటోరియంలో సోమవారం ఉదయం ఏర్పాటైన వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో విజయమ్మ ప్రసంగించారు.
మాటలతో కాకుండా చేతలతో సంక్షేమ రథాన్ని నడిపిన మహానేత వారసత్వ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఏడాది ఇడుపులపాయలో పురుడు పోసుకుందన్నారు. 1978లో ఎమ్మెల్యేగా తొలిసారిగా ఎన్నికైన ఆయన 24 ఏళ్లు ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, బస్సు యాత్రలు, ప్రాణాలకు తెగించి పాదయాత్రలు చేసి దేవుడు, ప్రజల ఆశీర్వాదం వల్ల సీఎం అయ్యారని పేర్కొన్నారు. ఆర్టీసీ చార్జీలతో సహా ఎలాంటి పన్నులు పెంచకుండానే.. వైఎస్ హయాంలో పెంచినదంతా సంక్షేమమేనని చెప్పడానికి సంతోషంగా ఉందని వివరించారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని చూస్తుంటే చాలా బాధేస్తోందని, ఎందుకు ఆయన పథకాలను నిర్వీర్యం చేస్తున్నారో... ప్రభుత్వాన్ని సరిగా ఎందుకు నడిపించలేక పోతున్నారో అర్థం కావడం లేదన్నారు. మంత్రి శంకర్రావు, టీడీపీ నాయకులు కలసి హైకోర్టులో వేసిన పిటిషన్లో.. వైఎస్ 26 జీవోలను విడుదల చేసి లబ్ధి పొందారని ఆరోపించిన నేపథ్యంలో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు 8 నెలల సమయం ఇచ్చినా స్పందించక పోవడం విచాకరమని వై.ఎస్.విజయమ్మ పేర్కొన్నారు.
2009-10లో కరువు, వరదలు వస్తే రూ.1800 కోట్లు సాయం అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించి ఇప్పటికి కనీసం 10 శాతమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితికి చేరారన్నారు. రైతులకు 7 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయడం లేదని, కరెంటు కోతతో వారానికి మూడురోజులు మాత్రమే చిన్న పరిశ్రమలు నడిపించే పరిస్థితి ఏర్పడటం దురదృష్టకరమన్నారు. వైఎస్ సీఎంగా ఉన్నపుడు వేసవి రాక మునుపే కరెంటు కోతలపై దృష్టి సారించి తీవ్ర ప్రభావం పడకుండా చూసేవారని వివరించారు. ఈ మధ్య జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో రాహుల్గాంధీ ఆరు నెలల ముందునుంచే ప్రచారం చేశారని, సోనియా, ప్రియాంక, వారి పిల్లలు తిరిగినా సొంత ప్రాంతాల్లో దెబ్బతిన్నారని విమర్శించారు.
రాష్ట్రాల్లో సమర్థులైన నాయకులను తొక్కి పెట్టాలని అధిష్టానం చూడటమే ఇలాంటి పరిస్థితికి కారణంగా అభివర్ణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతోందని, ఎదిరించిన నాయకులను ప్రభుత్వం ద్వారా వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శిం చారు. కడప, పులివెందుల ఉప ఎన్నికలలో మీరు చూపించిన ప్రేమ, ఆప్యాయతలు ఈ జన్మలో మరచిపోలేని వన్నారు. అదే అభిమానాన్ని అన్ని ఎన్నికలలో చూపించి జగన్బాబుకు అండగా నిలవాలని ఆమె అభ్యర్థించారు. రాజశేఖరరెడ్డి కొడుకు జగన్ అధికారంలోకి వస్తే అన్ని పథకాలను తిరిగి చక్కగా అమలు చేస్తారని రాష్ట్రమంతా ఎదురు చూస్తోందని వివరించారు. వైఎస్ఆర్ అభిమానులపై తప్పుడు కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అయినా చెక్కుచెదరని ఆత్మస్థయిర్యంతో తమకు అండగా నిలిచినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ‘రాజశేఖరరెడ్డిగారి దయ, దేవుని ఆశీస్సులతో నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నాను.. రాజన్న పాలన కోసం జగన్ను దీవించాల’ని వై.ఎస్. విజయమ్మ ప్రజలకు పిలుపునిచ్చారు
0 comments:
Post a Comment