ప్రగతి నిరోధక బడ్జెట్: సోమయాజులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రగతి నిరోధక బడ్జెట్: సోమయాజులు

ప్రగతి నిరోధక బడ్జెట్: సోమయాజులు

Written By ysrcongress on Saturday, March 17, 2012 | 3/17/2012

యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు దిశ, దశ లేదని, అన్ని రంగాలను విస్మరించిందని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు డి.ఎ.సోమయాజులు విమర్శించారు. ప్రతి పౌరునికి ఆర్థిక స్వావలంబన, సాధికారత భ రోసా కల్పించాల్సిన ప్రభుత్వం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. పార్టీనేత కొణతాల రామకృష్ణతో కలిసి శనివారమిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశం అభివృద్ది దిశలో నడిపించేందుకుగాను కీలక నిర్ణయాలు తీసుకోవడంలో యూపీఏ-2 ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పెట్టుబడులు లేకపోతే ప్రగతి ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. 

‘‘కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కీలక రంగాలైన వ్యవసాయాన్ని, ఉత్పత్తి రంగాన్ని పూర్తిగా విస్మరించింది. ఎరువుల ధరలపై సబ్సిడీ ఎత్తేస్తే, ధ్యానానికి మద్దతు ధర ఇప్పుడున్న దాని కన్న రూ.500 పెంచాలి. కానీ కేంద్ర అవేవి పట్టించుకోకుండా మిన్నకుండి పోయింది. దీంతో 1981-91 మధ్య కాలంలో 5.2 శాతం అభివృద్ధిలో ఉన్న వ్యవసాయ రంగం, ఆ తర్వాత నుంచి క్షీణిస్తూ ప్రస్తుతం 2 శాతానికి పడిపోయింది. ఇదే పద్దతి కొనసాగితే వ్యవసాయ రంగం ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముంది. అయితే ఈ రంగాన్ని ఆదుకోవాల్సిన కేంద్రం బాధ్యతను పూర్తిగా బ్యాంకులపై నెట్టివేయడం చాలా దురదృష్టకరం. రైతులకు లక్ష రూపాయాల వరకు బ్యాంకులు రుణాలిస్తాయని చెబుతుంది. కానీ క్షేత్రస్థాయిలో జరిగే దాఖలాలు ఒక్కటీ కనిపించవు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తించాలి! సేద్యపు రంగానికి బ్యాంకులు కచ్చితంగా 18 శాతం నిధులు ఇవ్వాలని ఆర్‌బీఐ నిబంధనలున్నాయి. అవి ఏనాడు పూర్తిస్థాయిలో అమలుకాలేదు. ప్రభుత్వాలు ఈ రకంగా వ్యవహరిస్తే 60 శాతం మంది ఆధారపడుతున్న వ్యవసాయ రంగం మనుగడ కష్టమే’’ అని సోమయాజులు ఆందోళన వ్యక్తం చేశారు. 

వ్యవసాయం తర్వాత అత్యంత కీలకమైన తయారీ రంగాన్ని కూడా యూపీఏ పూర్తిగా పెడచెవిన పెట్టిందని విమర్శించారు. ‘‘తయారీ రంగంలోని త్రైమాసిక ఫలితాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఆ రంగం నెగిటివ్ 2 శాతంగా ఉంది. ఇదే పద్దతి కొనసాగితే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? ప్రభుత్వం పెట్టుబడులు పెట్టకపోతే దేశం ముందుకెలా వెళ్లేది?’’ అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు చేస్తేనే ప్రవేట్ సంస్థలు పది రూపాయలు ఖర్చు చేస్తాయన్న విషయాన్ని గుర్తించాలన్నారు. 

‘‘కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జీడీపీ వృద్ధిరేటు 9శాతం లక్ష్యంగా పెట్టుకుంటుంది. కానీ దురదృష్టం కొద్ది ప్రతి ఏటా లక్ష్యాన్ని చేరుకోలేకపోతుంది. 11వ పంచవర్ష ప్రణాళికలో కూడా 9శాతం లక్ష్యంగా పెట్టుకోగా 7.5 శాతాన్నే సాధించగలిగింది. ప్రస్తుతం అదే మాదిరిగా 9 % పెంచుతామని పాత పాటే పాడుతున్నారు’’ అని ఎద్దేవా చేశారు. రెవెన్యూ లోటు సున్న శాతానికి తీసుకురావాలనుకుంటున్న ప్రభుత్వం నికర వ్యయం ఖర్చు చేయకపోతే ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. పన్ను రేటు పెంచితే రెవెన్యూ ఆదాయం పెరగదన్న విషయం తెలిసి కూడా కేంద్రం అదే తప్పిదం చేస్తుందని విమర్శించారు.

జైరాం చర్యలతో దేశం మూడేళ్లు వెనక్కి!
కేంద్ర పర్యావరణ శాఖా మంత్రి జైరాం రమేష్ రెండేళ్లుగా చేపడుతున్న చర్యలతో దేశం మూడేళ్లు వెనక్కి పోయిందని సోమయాజులు ఆరోపించారు. పర్యావరణాన్ని సాకుగా చూపి బొగ్గు దిగుమతిని పూర్తిగా నిషేధించారని, దీంతో దేశంలో కరెంట్ కొరత ఏర్పడిందన్నారు. ఫలితంగా తయారీ రంగం పూర్తిగా మరుగునపడిందన్నారు. జైరాం చర్యలు చూస్తుంటే ‘‘అస్థిపంజరాన్ని డైటింగ్ చేయమన్నట్లుంది’’ అని ఎద్దేవా చేశారు. అభివృద్ది చెందని దేశంలో గ్లోబల్ ఫైర్ కు సంబంధమేంటి? అని నిలదీశారు. ఆయన చర్యల వల్లే దేశం మూడేళ్ల అభివృద్ది ఆగిపోయింది. ఈ విషయం తెలిసి కూడా ప్రధాని మన్మోహన్ ఎందుకు మిన్నకుండి పోయారో అర్థంకావడం లేదన్నారు.

Share this article :

0 comments: