|
* సంకీర్ణ సారథిగా కాంగ్రెస్ పలుకుబడికి దెబ్బ
* భాగస్వాముల్లో విశ్వసనీయతను కోల్పోతున్న పార్టీ
* కాంగ్రెస్ను మునుగుతున్న నావగా చూస్తున్న మిత్రులు?
* రాహుల్ నాయకత్వ సామర్థ్యంపై కాంగ్రెస్లోనే సందేహాలు!
* ప్రియాంకపైనా ఆశలు పెట్టుకోలేమంటున్న పార్టీ శ్రేణులు
* 2014లో దేశవ్యాప్తంగా ప్రతికూలత తప్పదన్న వ్యాఖ్యలు
* స్థానిక నాయకత్వాన్ని అణచేయడమే కారణమంటున్న నేతలు
* మధ్యంతరం తప్పకపోవచ్చంటూ అంచనాలు
న్యూఢిల్లీ నుంచి డబ్ల్యూ చంద్రకాంత్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిలిన ఎదురుదెబ్బలు యూపీఏ సర్కారుపై పెను ప్రభావమే చూపనున్నాయి. సంకీర్ణ సారథిగా కూటమిలో కాంగ్రెస్ పలుకుబడిని, భాగస్వాముల్లో ఆ పార్టీకున్న విశ్వసనీయతను ఇవి బాగా దెబ్బతీశాయని భావిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో పార్టీని ముందుండి నడిపించిన నెహ్రూ-గాంధీ కుటుంబ వారసుడు రాహుల్గాంధీ నాయకత్వ సామర్థ్యంపై ఇప్పటికే ఉన్న సందేహాలను ఎన్నికల ఫలితాలు మరింతగా పెంచాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ ఫలితాలను ఆయన వైఫల్యంగానే కాంగ్రెస్ శ్రేణులు పరిగణిస్తున్నాయి. ప్రధానిగా దేశంపైనా, సారథిగా పార్టీపైనా తమ కుటుంబ పెత్తనాన్ని కొనసాగించాలన్న ఆయన ఆకాంక్షలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టేనంటున్నారు. ఈ ఫలితాలపై కాంగ్రెస్ పెద్దల్లో ఇప్పటికే అంతర్మథనం మొదలైంది. కాంగ్రెస్పై యూపీఏ మిత్రుల్లో విశ్వాసం సన్నగిల్లుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ చివరికి మధ్యంతర ఎన్నికలకు దారితీసినా ఆశ్చర్యం లేదంటున్నారు.
వారసుల ప్రభావమేదీ..!?
యూపీలో రాహుల్ కాలికి బలపం కట్టుకుని తిరిగినా, ఆయన సోదరి ప్రియాంక తన పిల్లలతో పాటుగా ప్రచారం చేసినా లాభం లేకపోయింది. వారసత్వ రాజకీయాలను ప్రజలు ఆమోదించడం లేదనేందుకు ఈ ఫలితాలు పూర్తిగా అద్దం పట్టాయంటున్నారు. ప్రియాంక రాజకీయాల్లోకి వచ్చినా ఆమెకు జనాదరణ దక్కుతుందని చెప్పలేని పరిస్థితి నెలకొందన్న అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లోనే విన్పిస్తుండటం విశేషం! కంచుకోటలైన అమేథీ, రాయ్బరేలీల్లోనే ఏ ప్రభావమూ చూపని వ్యక్తి దేశవ్యాప్తంగా ఏదో అద్భుతం చేస్తారని ఎలా ఆశిస్తామని వారు ప్రశ్నిస్తున్నారు.
లోక్సభ ఎన్నికలకు రెండేళ్ల వ్యవధే ఉన్నందున యూపీలో పరిస్థితిలోనూ, ప్రజాభిప్రాయంలోనూ పెద్దగా మార్పు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఆ లెక్కన 2009లో యూపీలో నెగ్గిన 22 లోక్సభ స్థానాలను నిలుపుకోవడం కూడా కాంగ్రెస్కు శక్తికి మించిన పనే! దీనికి తోడు బీఎస్పీ నుంచి పాలనా పగ్గాలను చేజిక్కించుకున్న సమాజ్వాదీ తన ఎన్నికల వాగ్దానాలను ఏమాత్రం నెరవేర్చగలిగినా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి మరింత దయనీయం కాక తప్పదంటున్నారు. నిరుద్యోగ యువత కోసం అఖిలేష్ యాదవ్ ప్రతిపాదించిన సామాజిక భద్రత పథకం ఏమాత్రం విజయవంతమైనా యూపీపై కాంగ్రెస్ పూర్తిగా ఆశలు వదులుకోక తప్పని పరిస్థితి! ఇక మైనింగ్ కుంభకోణాలు, అంతర్గత పోరు వంటి కారణాలతో గోవాలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పంజాబ్లో ఈసారైనా అధికారంలోకి రావాలన్న ఆశలు అడియాసలుగానే మిగిలాయి.
ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ మెజారిటీకి చేరువగా రాగలిగినా, అధికార బీజేపీలో నెలకొన్న అంతర్గత పోరే అందుకు ప్రధాన కారణం. నాలుగు రాష్ట్రాల్లోనూ పట్టణ, గ్రామీణ ఓటర్లంతా మూకుమ్మడిగా పార్టీని తిరస్కరించిన వైనం కాంగ్రెస్ పెద్దల్లో గుబులు రేపుతోంది. ఆంధ్రప్రదేశ్పై కాంగ్రెస్కు ఇప్పటికే ఆశలు పూర్తిగా అడుగంటిన విషయం తెలిసిందే. యూపీ, ఏపీలతో పాటు తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ వంటి పెద్ద రాష్ట్రాలన్నింట్లోనూ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రతికూల ఫలితాలు ఖాయమంటున్నారు.
కాంగ్రెస్లో విభేదాలు?
కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే విభేదాలు నెలకొన్నాయా? అవి నానాటికీ తీవ్రతరమవుతున్నాయా? పార్టీలోనూ, యూపీఏ సర్కారులోనూ కీలక పాత్ర పోషిస్తున్న పలువురు సీనియర్లకు.. సోనియా-రాహుల్ బృందానికి మధ్య పలు అంశాల్లో పలు కారణాలతో విభేదాలు ప్రస్ఫుటంగా కన్పిస్తున్నాయని చెబుతున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్గాంధీ విఫలమవ్వాలని కాంగ్రెస్ సీనియర్లలో పలువురు గట్టిగా కోరుకున్నారని కూడా అంటున్నారు! ప్రధాని కార్యాలయం కూడా పార్టీ నాయకత్వంపై ఆధారపడకుండా పలు ప్రభుత్వ పథకాలను సొంతంగానే ప్రచారం చేసుకునేందుకు నడుం బిగించడమూ లోతుగా ఆలోచించాల్సిన విషయమేనని ఏఐసీసీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
పార్టీపై సోనియా కుటుంబానికి ఉన్న నియంత్రణపై ఇవి ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ సహా విపక్షాలన్నీ కాంగ్రెస్పై విమర్శలకు మరింతగా పదును పెడుతున్నాయి. అన్ని రంగాల్లోనూ ఆ పార్టీ విఫలమవుతున్న తీరుకు, దానిపై జనాగ్రహానికి ఫలితాలు అద్దం పట్టాయంటున్నాయి. లోక్సభకు త్వరలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని బీజేపీ అగ్రనేత సుష్మాస్వరాజ్ తదితరులు అభిప్రాయపడుతున్నారు.
పునరాలోచనలో మిత్రులు...?
తృణమూల్ కాంగ్రెస్ సహా యూపీఏ మిత్రపక్షాలన్నీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఈ ‘సెమీఫైనల్స్’లో కాంగ్రెస్ ఘోర ఓటమి చవిచూసిందని అవి అభిప్రాయపడుతున్నాయి. ఈ పరిణామాన్ని తమకు ఓ హెచ్చరికగా కూడా ఆ పార్టీలు పరిగణిస్తున్నాయి. నానాటికీ నీట మునుగుతున్న ఓడలో అవి ఎంతకాలం ఉంటాయన్న ప్రశ్న ఇటు పరిశీలకుల్లో ఆసక్తిని, అటు కాంగ్రెస్లో భయాందోళనలను రేకెత్తిస్తోంది. స్థానిక, ప్రాంతీయ పార్టీలకే ప్రజలు పట్టం కడుతున్న వైనం కూడా పార్టీ ఆందోళనలను మరింతగా పెంచుతోంది. లేనిపోని భయాలతో ప్రతి రాష్ట్రంలోనూ స్థానిక నాయకత్వాన్ని పద్ధతి ప్రకారం అణచివేస్తూ వచ్చిన ఫలితాన్ని ఇప్పుడు అనుభవించాల్సి వస్తోందని కాంగ్రెస్ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.
ఇప్పుడు యూపీలో జరిగిందే ఇకపై ఏపీతో సహా మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ జరగనుందని వారు జోస్యం చెబుతున్నారు. మరోవైపు పార్లమెంటు సమావేశాల్లో కూడా విపక్షాల దాడిని ఎదుర్కోవడం ఇకపై యూపీఏకు శక్తికి మించిన పనేనంటున్నారు. లోక్పాల్, ఆహార భద్రత వంటి పలు కీలక బిల్లుల ఆమోదం తదితరాలు పాలక సంకీర్ణానికి పెను సవాలుగా నిలిచే ఆస్కారముంది. దాంతోపాటు ఇప్పటికే మధ్యతరగతి ఆగ్రహాగ్నిని చవిచూస్తున్న నేపథ్యంలో.. ప్రతిపాదిత పెట్రో ధరల పెంపు, ద్రవ్యోల్బణ అదుపు వంటి చర్యలకు కూడా స్వేచ్ఛగా సాహసించలేని ఇబ్బందికర పరిస్థితిని యూపీఏ ఎదుర్కోనుంది.
0 comments:
Post a Comment