ఎలక్షన్ టెన్షన్.. అందుకే పెన్షన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎలక్షన్ టెన్షన్.. అందుకే పెన్షన్

ఎలక్షన్ టెన్షన్.. అందుకే పెన్షన్

Written By news on Friday, April 20, 2012 | 4/20/2012



* ఇళ్లు, ‘దీపం’గ్యాస్, పింఛను తాయిలాలు
* ఓటర్లపై హడావుడిగా వరాలు కురిపిస్తున్న ప్రభుత్వం
* ఇంతకాలం విస్మరించి.. 3,000 ఇళ్ల చొప్పున మంజూరు
* కాంగ్రెస్ ఇన్‌చార్జిలు చెప్పిన వారికే ఇచ్చేలా మంత్రాంగం
* ఇప్పటికే రూపొందించిన అర్హుల జాబితాలు బుట్టదాఖలు
* ‘దీపం’ గ్యాస్ కనెక్షన్లు కూడా ‘ఉప’ సెగ్మెంట్లకే!
* సీఎం నిధి కింద ‘ఉప’ స్థానాలకు ఇప్పటికే నిధుల వరద
* ఆ పనులన్నీ నామినేషన్‌పై కాంగ్రెస్ కార్యకర్తలకే!

నంతపురం/గుంటూరు, న్యూస్‌లైన్: రాష్ట్రంలో ఒకటి తర్వాత ఒకటిగా ఎన్నికల్లో ఎదురవుతున్న వరుస ఓటములతో బెంబేలెత్తుతున్న అధికార కాంగ్రెస్ పార్టీ.. ఒక లోక్‌సభ, 18 అసెంబ్లీస్థానాలకు త్వరలో జరగనున్న ఉప ఎన్నికల గండాన్ని గట్టెక్కేందుకు అన్నిరకాల అడ్డదారులూ తొక్కుతోంది. ఇన్నాళ్లుగా తాను గాలికొదిలిన ఆ నియోజకవర్గాలపై ఇప్పుడు ఎక్కడ లేని ప్రేమా ఒలకబోస్తోంది! వాటి అభివృద్ధికి తొలి విడతలో సీఎం ప్రత్యేక నిధి కింద ఇప్పటికే నిధుల వరద పారించగా.. తాజాగా మలి విడతలో మరిన్ని తాయిలాలు ప్రకటిస్తోంది. ‘పక్కా ఇళ్లు’ ఇస్తామంటూ ఆశలు చూపుతోంది.

వారూ వీరని తేడా లేకుండా అన్ని వర్గాలకూ హడావుడిగా పింఛన్లు ప్రకటించేస్తోంది. గ్యాస్ కనెక్షన్లంటూ ‘దీపం’ ఉండగానే, ఎన్నికల ‘కోడ్’ కూసే లోపే ఇల్లు చక్కదిద్దుకోజూస్తోంది! పనిలో పనిగా.. సీఎం నిధి కింద మంజూరు చేసిన పనులను నామినేషన్‌పై పార్టీ కార్యకర్తలకే కట్టబెట్టుకునే పనిలో పడింది. కేవలం ఓట్ల యావతో, అధికారాన్ని యథేచ్ఛగా దుర్వినియోగపరుస్తూ కాంగ్రెస్ పార్టీ పడుతున్న ఈ పాట్లను, చేస్తున్న ఓట్ల ఫీట్లను చూసి కాంగ్రెస్ నేతలు, అధికారులే గాక జనం కూడా నవ్విపోతున్నారు.

‘దీపం’తో ‘ఇళ్లు’ చక్కబెట్టుకుంటున్నారిలా..
ఉప ఎన్నికలు జరిగే శాసనసభ స్థానాల్లో ఒక్కో స్థానానికి ప్రత్యేకంగా 3,000 ఇళ్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం బుధవారం హడావుడిగా ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకూ ఇలా ఇళ్లను మంజూరు చేశారు. పైగా ఆయా సెగ్మెంట్ల కాంగ్రెస్ ఇన్‌చార్జిలు అందించే జాబితా మేరకే వాటిని మంజూరు చేయాలంటూ గృహ నిర్మాణ శాఖ డీఎంలపై స్వయానా మంత్రులే తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. దాంతో రచ్చబండ-1, రచ్చబండ-2ల్లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా రూపొందిన అర్హుల జాబితాలను డీఎంలు అటకెక్కించారు. కాంగ్రెస్ ఇన్‌చార్జిల జాబితాల ప్రకారమే ఇళ్ల మంజూరుకు రంగం సిద్ధం చేశారు.

అనంతపురం జిల్లాలో ఉప ఎన్నికలు జరిగే అనంతపుం, రాయదుర్గం సెగ్మెంట్లకు మంజూరైన ఇళ్ల విషయంలో ఇప్పటికే ఈ దిశగా కసరత్తు సాగుతోంది. ఇక నిరుపేద మహిళల వంటింటి కష్టాలను దూరం చేసేందుకు ‘దీపం’ పథకం కింద కేంద్రం రాయితీపై మంజూరు చేసే గ్యాస్ కనెక్షన్ల లక్ష్యాన్ని కూడా మంత్రులు నీరుగారుస్తున్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు, అందులోనూ పీవోపీ (నిరుపేద) మండలాలకు ప్రాధాన్యమివ్వాలి. లబ్ధిదారులను గ్రామసభల్లో ఎంపీడీవోలు ఎంపిక చేస్తారు. దీపం పథకం గ్యాస్ కనెక్షన్ మంజూరుకు ప్రతిపాదించే పత్రంపై కచ్చితంగా ఎంపీడీవో సంతకం ఉండాలి. కానీ మంత్రులు ఈ పథకం లక్ష్యాన్నే నీరుగారుస్తున్నారు. అనంతపురం జిల్లాకు 2011-12లో దీపం పథకం కింద 13,649 గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి.

ఉప ఎన్నికలు జరిగే అనంతపురం, రాయదుర్గం సెగ్మెంట్లకే వాటిలో చెరో 4,000 చొప్పున ఏకంగా 8,000 కనెక్షన్లను మళ్లించారు. వాటిని కూడా కాంగ్రెస్ కార్యకర్తలు సూచించిన వారికే మంజూరు చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన మంజూరు పత్రాలను కూడా సిద్ధం చేశారు. కానీ వాటిపై చాలావరకు ఎంపీడీవోల సంతకాలు లేవు. మంత్రుల అధికార దుర్వినియోగం వల్ల అర్హులైన నిరుపేదలకు అన్యాయం జరుగుతోందని రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన ఒక ఎంపీడీవో ‘న్యూస్‌లైన్’తో వాపోయారు. ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతోన్న నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సీఎం ప్రత్యేక నిధి కింద భారీ ఎత్తున నిధులు మంజూరు చేశారు. ఆ నిధులతో చేపట్టే పనులను నామినేషన్ పద్ధతిలో కాంగ్రెస్ కార్యకర్తలకే కట్టబెట్టి.. లబ్ధిచేకూర్చాలని నిర్ణయించారు.

ఇదే అంశంపై రాయదుర్గం ఉప ఎన్నిక ఇన్‌చార్జ్ అయిన రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి గురువారం కళ్యాణదుర్గంలోని ఆయన సొంతింట్లో అదనపు జాయింట్ కలెక్టర్ చెన్నకేశవరావు, పంచాయతీరాజ్‌శాఖ అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమాయ్యారు. రాయదుర్గం నియోజకవర్గానికి సీఎం ప్రత్యేక నిధి కింద మంజూరు చేసిన రూ.6.54 కోట్ల వ్యయంతో చేపట్టే పనులను నామినేషన్ పద్ధతిలో కాంగ్రెస్ కార్యకర్తలకే కట్టబెట్టాలని మంత్రి ఈ సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

జోరుగా పింఛన్లు మంజూరు
ఓటర్లకు గాలమేసేందుకు సర్కారు ఎడాపెడా పింఛన్లు మంజూరు చేసేస్తోంది. పింఛన్లు మంజూరు చేయాలంటూ రెండేళ్ల నుంచి కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే దరఖాస్తుదారులను వదిలి.. ఉప ఎన్నికలు జరగబోయే ఆ 18 నియోజకవర్గాలపైనే కన్నేసింది. అక్కడ దరఖాస్తుదారుల అర్హతలు పరిశీలించకుండానే రాత్రికి రాత్రే ఫింఛన్లు మంజూరు చేసింది. ఒక్కో నియోజకవర్గానికి రెండు వేల పింఛన్లకు తగ్గకుండా మంజూరు చేస్తూ శనివారం రాత్రి జాబితాలను జిల్లాలకు పంపింది. ఎన్నడూ లేని విధంగా పింఛను మంజూరు పత్రంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రి సునీతా లక్షా్మారెడ్డి ఫొటోలను కూడా ఉంచారు. వీటిని చూసి వివిధ జిల్లాల అధికార యంత్రాంగం విస్మయం వ్యక్తం చేస్తోంది.

ఈ నెల 14న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పింఛన్ల మంజూరు ఉత్తర్వులను జారీ చేశారు. ఒక జీవో, మెమో గానీ లేకుండా కేవలం లబ్ధిదారుల జాబితాలను వెబ్‌సైట్‌లో పెట్టి ఆయా జిల్లాల డీఆర్‌డీఏ అధికారులకు సమాచారం అందజేశారు. 16న ఆయా జిల్లాల అధికారులు వీటిని డౌన్‌లోడ్ చేసుకుని సంబంధిత ఎంపీడీవోలకు జాబితాలను పంపారు.

వృద్ధులు, వితంతవులు, వికలాంగులు, కల్లు గీత కార్మికులకు నెలకు రూ.200 చొప్పున పింఛను మంజూరు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ నెల నుంచే వీటిని లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మండలాలకు అందిన వివిధ గ్రామాల పింఛన్లను పరిశీలించిన ఎంపీడీవోలు వీటిని ఎప్పుడు పంపిణీ చేయాలో తెలియక గందరగోళం పడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రజాపథంలోనా, లేక ప్రతి నెలా ఇచ్చే తేదీల్లో పంచాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.
Share this article :

0 comments: