మిర్చి రైతు కంట్లో ‘కారం’! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మిర్చి రైతు కంట్లో ‘కారం’!

మిర్చి రైతు కంట్లో ‘కారం’!

Written By news on Thursday, April 26, 2012 | 4/26/2012

వ్యవసాయ ఉత్పత్తుల ధరలకు సంబంధించి దళారుల మోసాలను కాసేపు పక్కన పెడితే... అనేక కారణాల వలన కూడా ధరలకు నిలకడ కొరవడుతున్నదని చెప్పక తప్పదు. ప్రభుత్వ యంత్రాంగం ధరల స్థిరీకరణకు వ్యవస్థాగతంగా ఇప్పటివరకూ సానుకూల చర్యలు చేపట్టలేదు. ధరల స్థిరీకరణ జరగకనే దళారులు దండుకుంటున్నారనే వాస్తవాన్ని ప్రభుత్వం గమనించనట్టు నటిస్తున్నది.వ్యవసాయ ఉత్పత్తుల ధరలను దళారులతో పాటు రాష్ట్రీయ, అంతర్రాష్ట్రీయ మార్కెట్ శక్తులు నిర్ధారిస్తాయనేది ఓ నగ్న సత్యం. ఈ పరిస్థితుల్లో బక్కచిక్కిన సన్న, చిన్నకారు రైతన్నల బాగోగులకు బాధ్యత వహించాల్సింది వ్యవస్థే! రైతు సహనానికి పరీక్షలు ఏటేటా పెడుతూనే ఉన్నారు. సహనం కోల్పోకముందే మార్కెట్‌లో నెలకొని ఉన్న అవ్యవస్థను చక్కదిద్ది అన్నదాతకు ఆదరువు కల్పించాల్సిన కనీస కర్తవ్యం రాష్ట్ర ప్రభుత్వానిదే.
ఆసియాలోనే అతి పెద్ద మార్కె ట్‌గా పేరున్న వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్‌లో ఆక స్మికంగా తగ్గిన మిరప కొను గోలు ధరను చూసి కోపోద్రిక్తు లైన సుమారు 2 వేల మంది రైత న్నలు విధిలేక మార్కెట్ ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారు. మధ్యా హ్నం వరకు సుమారు రూ.5,500 పలికిన మిర్చి ధర దళారుల పుణ్యమా అని అమాంతం రూ.1,800 నుంచి రూ.2,000లకు పడిపోవడంతో బుద్ధారం గ్రామానికి చెందిన రైతు బాబూరావు కన్నీటి పర్యంతమయ్యాడు. ఇతర ప్రాంతాల్లో సరైన ధర లభిం చక ఖమ్మంలో మార్కెట్‌కు సెలవు కావడం వలన ఎనుమా ముల మార్కెట్‌కు మిర్చి పంట ఇబ్బడిముబ్బడిగా చేరు కోవడం చూసిన దళారులు మార్కెట్ అధికారులతో చేతు లు కలిపి మిర్చి ధరను కూలదోశారన్నది సుస్పష్టం.

ఏప్రిల్ 10న రూ.5,700 పలికిన నాణ్యమైన మిర్చి ధర ఒక్కరోజులో రూ.5,300కు, ఇతర రకాలు రూ. 2,000ల లోపునకు దిగజారడాన్ని రైతన్నలు నిలదీశారు. కానీ, దళారులు దిగిరాలేదు సరికదా, తూకం పెరగడానికి కాయ మీద నీళ్లు చల్లడం వంటి అనేక అనైతిక చర్యలకు రైతులు పాల్పడుతున్నారనే ఆరోపణలు చేయడం దళారీల మానసిక రుగ్మతకు అద్దంపట్టింది. ఒకరో అరో రైతన్నలు తమ దుర్భర ఆర్థికస్థితి నుంచి బయటపడేందుకు చిన్న చిన్న తప్పులు చేస్తే చేసి ఉండవచ్చు. 

అంతమాత్రాన రైతాంగం అంతటికీ ఈ అనైతికతను అంటగట్టడం అన్యా యం. సరుకు భారీగా మార్కెట్‌లోకి రావడం అదనుగా తీసుకుని మోసపూరితంగా ధరలను నిర్ణయించే వైఖరి ఏ విధంగా చూసినా సమంజసం కాబోదు. ప్రభుత్వ యం త్రాంగం, మార్కెటింగ్ కమిటీ బాధ్యులు దళారులతో కుమ్మక్కయిన ఫలితం ఇది. ఆ రోజు చోటు చేసుకున్న సంఘటన కొత్తదేమీ కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ మార్కెట్ యార్డులో జరుగుతున్నదే. మీడియాలో ఈ దారుణాలపై ఎప్పటికప్పుడు ప్రత్యేక కథనాలు వెలువడు తూనే ఉన్నప్పటికీ చర్యలు మాత్రం శూన్యం.

ఈ సంఘటనకు సరిగ్గా 24 గంటల ముందు ఇదే మార్కెట్ యార్డులో పత్తి రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్ ప్రాంగణంలో అస్థిరమైన పత్తి మార్కెట్ ధరలకు నిరసనగా ధ్వంస రచనకు పూనుకున్నారు. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది తదుపరి నష్టం జరగకుండా రైతు లను ఆపగలిగారు కానీ, మార్కెట్ సిబ్బంది, దళారులు ధర విషయంలో పాల్పడుతున్న అనైతిక చర్యలను మాత్రం అరికట్టలేకపోయారు.

పత్తి ధర రూ.3,900 రెండు రోజుల్లో రూ.3,600కు పడిపోయింది. ఈ విధంగా ధరలు అకస్మాత్తుగా తగ్గుముఖం పట్టడంతో ఓపిక నశించి రైత న్నలు గత్యంతరం లేక తిరగబడ్డారని చెప్పాలి. పత్తి ధరలో హెచ్చుతగ్గులు కేవలం ఎనుమాముల మార్కెట్‌లో మా త్రమే ఆ రెండు రోజుల్లో మాత్రమే చోటు చేసుకున్నాయి. తెలంగాణలోని చొప్పదండి, జనగామ, ఆదిలాబాద్, జమ్మికుంట తదితర మార్కెట్లలో ఈ విధమైన హెచ్చు తగ్గులు లేకపోవడం గమనార్హం. మన రాష్ట్రంలో పత్తి విత్త నం, పత్తి బేళ్ల ధరలు తగ్గినందువల్లే ధరలు ప్రభావితమ య్యాయని జిల్లా ఉన్నతాధికారుల ప్రకటన వాస్తవ దూరమే. ఎందుకంటే వేరే మార్కెట్లలో ధరలు తగ్గలేదు. 

నిజామాబాద్ మార్కెట్‌లో ఇదే విధమైన దుస్థితిని పసుపు రైతులు అనుభవిస్తున్నారు. మార్క్‌ఫెడ్ విధించిన నిబంధనలు నిజామాబాద్ జిల్లా పసుపు రైతుల పాలిట శాపంగా పరిణమించాయంటే అతిశయోక్తి కాదు. పసుపు రైతులు పంట మీద గిట్టుబాటు ధర పొందడం సంగతి అలా ఉంచి కనీసం సాగు ఖర్చులు కూడా రాబట్టుకోలేక పోతున్నారు. ఈ జిల్లాలో ఉత్పత్తి అయిన పసుపు అరబ్ దేశాలకు ఎగుమతి అవుతుంది. 

ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ తదితర జిల్లాలలో ఉత్పత్తయ్యే పసుపు కూడా ఈ మార్కెట్‌కే తరలివస్తుంది. కూలీ రేట్లతో సహా క్రిమిసం హారక మందులు, ఎరువులు వంటి ఉత్పాదకాల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో రైతన్నకు పసుపు పండిం చడానికి ఎకరాకు రూ.75 వేల నుంచి రూ.1 లక్ష దాకా ఖర్చవుతున్నది. గత సంవత్సరం పసుపు రైతులు క్విం టాల్ ఒకటికి రూ.14,000కు పైగా గిట్టుబాటు ధర పొం దారు. కానీ, ఈ ఏడాది మార్కెట్‌లో రూ.3,500 లేక రూ.4,000 కూడా దక్కలేదు.

రైతులు తమ దీనావస్థను పదే పదే కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్న ఫలితంగా రాష్ట్రంలో పసుపు కొనుగోళ్లు తమ ఏజెన్సీ మార్క్‌ఫెడ్ ద్వారా చేయించాలని కేంద్రం సూచించింది. కానీ గిట్టు బాటు ధరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా నాణ్యతను అనుస రించి చెల్లింపులకు శ్రీకారం చుట్టింది. దీని ఫలితంగా ప్రైవేట్ కొనుగోలుదారులు రూ.5,000 దాకా చెల్లిస్తుం డగా, మార్క్‌ఫెడ్ మాత్రం నిబంధనల పేర రూ.4,000 మించి చెల్లించలేదు. 

గుంటూరు మార్కెట్ యార్డులో కూడా ఇదే పరిస్థితి. ఎనుమాములలో ఏ విధంగా దళారులు, మార్కెట్ ఉద్యో గులు కలిసికట్టుగా రైతుకు గిట్టుబాటు ధరను అడ్డుకు న్నారో, గుంటూరు మార్కెట్‌లో కూడా అదేవిధంగా అడ్డు కుంటున్నారు. మార్కెట్‌కు అమ్మకానికి తీసుకుని వచ్చిన మిర్చిని ఏదో ఒక ధరకు తెగనమ్ముకోవలసిన దుస్థితి ప్రస్తుతం రైతన్నకు దాపురించింది. 

నష్టాలకు అమ్మడం ఇష్టం లేని రైతన్న కోల్డ్ స్టోరేజీ సదుపాయాలు ఉపయోగిం చుకుందామనుకుంటే ధరల పరంగా అవి అందుబాటులో లేవు. గుంటూరు పరిసర ప్రాంతాల్లో రైతుల దగ్గర కారు చౌకగా కొట్టేసిన మిర్చి పంటను వ్యాపారస్తులే రైతుల పేర్ల మీద శీతల గిడ్డంగుల్లో దాచుకోవడం ఎంత దారుణం? విత్తనం కొనుగోలు దగ్గర నుంచి, పంటను అమ్ముకునే వరకు ప్రతి దశలోనూ రైతుకు జరుగుతున్న అన్యాయా లకు జతకూడిన సరికొత్త అన్యాయమని చెప్పక తప్పదు.

అన్నదాత గిట్టుబాటు ధర కోసం పడుతున్న అగ చాట్లు మరే ఇతర ఉత్పత్తి దారుడు పడటం లేదు. సంఘ టితంగా ఉన్నందున అన్ని రంగాల వారికి క్రమబద్ధమైన మార్కెట్లు ఉన్నాయి. కానీ, వ్యవసాయదారులకు మాత్రం అటువంటి సంఘటితశక్తి లేదు. వాళ్లకు దక్కవలసిన ధర లను దళారీ మార్కెట్ వ్యవస్థ దక్కనివ్వదు. పర్యవసా నం... నష్టాలు, ఆస్తుల అమ్మకం, ఆత్మహత్యలు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం. ఎందుచేతనంటే గిట్టు బాటుధర లేక రైతన్నలు నష్టాలు-కష్టాలకు గురవుతుంటే కౌలు రైతు అదే పరిస్థితుల్లో కొనసాగుతున్నా యజమా నితో చేసుకున్న ఒప్పందం ప్రకారం కౌలు కట్టవలసిన స్థితి. కౌలు రైతులకు సంస్థాగత రుణాలు లభించడం కష్ట సాధ్యం కావడమే కాదు, ఉత్పాదకాల సబ్సిడీ సదుపా యాలు వారికి అందే పరిస్థితి అసలే లేదు.

దళారులు మార్కెట్లను తమకు అనుకూలమైన రీతి లో నడిపించుకుంటూ స్వలాభార్జనే పరమావధిగా రైతన్న లను దోచుకోవడం ప్రతి నిత్యమూ జరుగుతున్నదే. వ్యవ సాయ ఉత్పత్తులకు వినియోగదారులు చెల్లించే మొత్తంలో సింహభాగం ఉత్పత్తిదారుడైన రైతన్నకు చెందవలసి ఉండగా, దళారీల మోసపూరిత మార్కెటింగ్ పద్ధతుల పుణ్యమా అని రైతన్నకు కేవలం 10 నుంచి 20 శాతం మాత్రమే దక్కుతున్నది.

కేవలం తమ దగ్గర ఉన్న డబ్బు, పలుకుబడి ఉపయోగించి దళారులు మార్కెట్లను శాసిస్తూ అక్రమంగా ధనార్జనకు ఎగబడుతున్నారు. ఆరుగాలం చెమటోడ్చి శ్రమించి పండించిన పంటను గద్దల్లాగా దళా రులు తన్నుకుపోతూ ఉంటే వ్యవస్థ చేష్టలుడిగి చూస్తూ ఉండటం ఎంత దారుణం?

రైతన్నలు తమ ఉత్పత్తులను ప్రతికూల పరిస్థితుల్లో తెగనమ్ముకోవడం మన రాష్ట్రంలో నిత్యకృత్యంగా మారింది. దళారులు రైతన్నలను తూనికల విషయంలోను, గ్రేడింగ్ లేదనే మిషతోను, రంగు లేదనో, పరిమాణం లేదనో లేక ఇతర ప్రమాణాలు లేవనో రైత న్నను మోసగించడం రోజూ చూస్తున్నాం, వింటున్నాం. ఈ విధంగా అనేకానేక రుగ్మతలతో కూడిన దళారీ వ్యవస్థకు ఊతమిచ్చే మన మార్కెట్ వ్యవస్థ మూలంగానే రైతన్నలు మోసపోతున్నారనేది అందరికీ తెలిసిందే. 

వ్యవసాయ ఉత్పత్తుల ధరలకు సంబంధించి దళా రుల మోసాలను కాసేపు పక్కన పెడితే... అనేక కారణాల వలన కూడా ధరలకు నిలకడ కొరవడుతున్నదని చెప్పక తప్పదు. ప్రభుత్వ యంత్రాంగం ధరల స్థిరీకరణకు వ్యవ స్థాగతంగా ఇప్పటివరకూ సానుకూల చర్యలు చేపట్టలేదు. 
దరల స్థిరీకరణ జరగకనే దళారులు దండుకుంటున్నారనే వాస్తవాన్ని ప్రభుత్వం గమనించనట్టు నటిస్తున్నది. ఏటా వెలువడే కనీస మద్దతు ధర ప్రకటనలు రైతుకు న్యాయం చేకూర్చడంలేదని అనేక ఏళ్లుగా రైతు సంఘాల నాయకు లు మొత్తుకుంటున్నా ఫలితం మాత్రంశూన్యం. కనీస మద్దతు ధరే అన్యాయమని ఓ వైపు రైతన్న ఘోషిస్తుంటే, చాలాసార్లు మార్కెట్ ధర అంతకన్నా అట్టడుగుకు దిగజా రుతుంటే ప్రభుత్వం స్పందించకపోవడం ఎంతటి భయా నకం! 

అలిఖిత వ్యాపార నియమావళి వ్యవసాయానికి కానీ, వ్యవసాయదారులకు కానీ పూర్తిగా ప్రతికూలమే నన్నది పచ్చి నిజం. వ్యవసాయ ఉత్పత్తుల ధరలను దళా రులతో పాటు రాష్ట్రీయ, అంతర్రాష్ట్రీయ మార్కెట్ శక్తులు నిర్ధారిస్తాయనేది ఓ నగ్న సత్యం. ఈ పరిస్థితుల్లో బక్క చిక్కిన సన్న, చిన్నకారు రైతన్నల బాగోగులకు బాధ్యత వహించాల్సింది వ్యవస్థే! రైతు సహనానికి పరీక్షలు ఏటేటా పెడుతూనే ఉన్నారు. సహనం కోల్పోకముందే మార్కెట్‌లో నెలకొని ఉన్న అవ్యవస్థను చక్కదిద్ది అన్న దాతకు ఆదరువు కల్పించాల్సిన కనీస కర్తవ్యం రాష్ట్ర ప్రభుత్వానిదే.
Share this article :

0 comments: