విజయవాడ, న్యూస్లైన్: దిక్కులన్నీ దద్దరిల్లేలా జగన్నినాదాలు.. జంక్షన్లన్నీ జామైపోయేలా జనప్రవాహాలు.. కనుచూపు మేర కిక్కిరిసిన రహదారులు.. డప్పుల మోతలు.. యువత కేరింతలు... వెరసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాకతో శుక్రవారం విజయవాడలో పండుగ వాతావరణం నెలకొంది. ఆయన కాన్వాయ్ వెంబడి వరుసగా కార్లు, బైక్ల ర్యాలీలతో యువత హోరెత్తించారు. పూలవర్షాలతో మహిళలు అభిమానం చాటుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటన ముగించుకుని జగన్ కృష్ణా జిల్లాలోని కైకలూరు, గుడివాడ, హనుమాన్ జంక్షన్, గన్నవరం మీదుగా రాత్రి 6.40 గంటలకు విజయవాడ చేరుకున్నారు. అక్కడ రామవరప్పాడు నుంచి రాఘవయ్య పార్కు వరకు ఆయన ఏడు కిలోమీటర్లు ప్రయాణించేందుకు గంటన్నరసేపు పట్టిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
వంశీని ఆలింగనం చేసుకున్న జగన్: రామవరప్పాడులో జగన్ అడుగుపెట్టగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా అనుచరులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. అక్కడ్నుంచి ద్విచక్ర వాహనాలు, కార్లతో భారీ ర్యాలీ ముందుకు సాగింది. ‘జై జగన్.. జోహార్ రంగా’ అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ట్రాఫిక్లో యలమంచిలి కాంప్లెక్స్ వద్ద ఆగి ఉన్న టీడీపీ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీని వంగవీటి రాధా జగన్ వద్దకు తీసుకొచ్చారు. జగన్మోహన్రెడ్డి.. వంశీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. కుశల ప్రశ్నలు అడిగారు. ఇది విజయవాడ టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.
ఎక్కడి వాహనాలు అక్కడే..
జగన్ పర్యటన సందర్భంగా గన్నవరం మీదుగాా విజయవాడ వరకు జాతీయ రహదారి కిక్కిరిసింది. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. అందరి దృష్టీ జననేతపైనే. అన్ని బాటలూ ఆ వంకే. అందరి తాపత్రయం ఆయనతో కరచాలనం చేయాలనే. వారందరికీ అభివాదం చేస్తూ అడుగడుగునా అడ్డుపడుతున్న అభిమాన జల్లుల్లో తడుస్తూ జగన్మోహన్రెడ్డి పర్యటన సాగింది. ఆయన కాన్వాయ్ వెళ్లేంతవరకు నగరంలో పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిపేశారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు మధ్యాహ్నం మూడు గంటలకే విజయవాడకు తరలివచ్చి జగన్నినాదాలతో హోరెత్తించారు.
0 comments:
Post a Comment