‘వైఎస్‌ను దళిత వ్యతిరేకిగా చిత్రీకరిస్తే...’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘వైఎస్‌ను దళిత వ్యతిరేకిగా చిత్రీకరిస్తే...’

‘వైఎస్‌ను దళిత వ్యతిరేకిగా చిత్రీకరిస్తే...’

Written By news on Tuesday, April 10, 2012 | 4/10/2012

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిని దళిత వ్యతిరేకిగా చిత్రీకరించాలని ప్రయత్నిస్తే కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో పూర్తిగా నూకలు చెల్లినట్లేనని వైఎస్సార్ కాంగ్రెస్ దళిత నేతలు హెచ్చరించారు. పార్టీ ఎస్.సి విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాశరావు, ఎస్.సి కమిషన్ మాజీ ఛైర్మన్ మేరుగ నాగార్జున మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దళిత దళారులైన రాజ్యసభ సభ్యుడు జె.డి.శీలం, మంత్రి కొండ్రు మురళీమోహన్, లోక్‌సభ సభ్యుడు హర్షకుమార్ వై.ఎస్‌పై అభూతకల్పనలు, అసత్య ప్రచారం చేస్తే రాష్ట్రంలో ఎస్.సి, ఎస్టీలు సహించరని హెచ్చరించారు. 

రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చే వరకూ కర్నాటకలో ఐఏఎస్ అధికారిగా ఉంటూ వేలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన శీలం వైఎస్‌పై దుమ్మెత్తి పోస్తారా? అని వారు ప్రశ్నించారు. అంబేద్కర్ పేరుతో కళాశాల పెడతానని చెప్పి వెయ్యి ఎకరాలు కేటాయింప జేసుకున్న కొండ్రు మురళి, అమలాపురంలో అంబేద్కర్ విగ్రహాలను పడగొట్టిన నిందితులను అరెస్టు చేయకుండా ఆపిన హర్షకుమార్‌లు వైఎస్‌ను విమర్శించడం ఏమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వై.ఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో కనీ వినీ ఎరుగని రీతిలో ప్రవేశపెట్టిన రెండు రూపాయల కిలోబియ్యం, ఆరోగ్యశ్రీ, గృహ నిర్మాణం, విద్యార్థులకు ఫీజు చెల్లింపు వంటి పథకాలతో ఎస్.సి, ఎస్.టి, బీసీ, బలహీనవర్గాలు మైనారిటీలు పెద్ద ఎత్తున లబ్ది పొందారనీ అందుకే వై.ఎస్ చనిపోయిన తరువాత కూడా వారి హృదయాల్లో నిలిచి పోయారని వారన్నారు. 

దళిత నాయకులమని చెప్పుకుంటున్నవారు అసలు సిగ్గు ఉండే వై.ఎస్‌ను విమర్శిస్తున్నారా? అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వై.ఎస్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చుతూంటే ప్రశ్నించి ఆ పార్టీని వీడిన వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పెట్టుకుంటే ఏడాదిలోపే అశేష జనాదరణ పొందారనీ అది చూసి ఓర్వ లేక అధిష్టానం ప్రోత్సాహంతో వీరు విమర్శలు మొదలు పెట్టారనీ వారు విమర్శించారు. జగన్‌పై అక్కసుతో వైఎస్‌ను అప్రతిష్టపాలు చేసే విధంగా ఈ నాయకులు మాట్లాడుతున్నారని వారన్నారు. దళిత వాడల్లో చందాలు ఇచ్చి వై.ఎస్ విగ్రహాలు పెట్టిస్తున్నారని మురళి చేసిన వ్యాఖ్యలపై వారు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఎక్కడికో ఎందుకు మురళి సొంత గ్రామంలోని దళితవాడకే వెళ్లి అక్కడి ప్రజలనే అడుగుదాం వారక్కడ విగ్రహాలను చందాలు తీసుకుని పెట్టారో సొంతంగా నిధులు పోగేసుకుని పెట్టుకున్నారో తెలుస్తుందని వారు సవాలు విసిరారు. 

‘వైద్యానికి నోచుకోని వేలాది మంది దళితులు ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన విషయం ఈ కుహానా దళిత నేతలు మరిచారా? రాష్ట్రంలో నిర్మించిన 48 లక్షల గృహాల్లో ఎక్కువ మంది లబ్దిదారులు ఎస్.సిలు, బలహీనవర్గాలేనన్నది మరిచారా? ఉన్నత విద్యకు నోచుకోని లక్షలాది మంది విద్యార్థులకు ఫీజులు చెల్లింపు పథకం అమలు చేయడం ద్వారా ఎంతో మంది ఎస్.సిలు లబ్ది పొందిన విషయం గుర్తు లేదా? అని వారు కాంగ్రెస్ నేతలను నిలదీశారు. ఈ పథకాలు వై.ఎస్‌వి కాదనీ కాంగ్రెస్‌వేననీ చెప్పుకుంటున్న ఈ నాయకులు దేశంలో ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయలేదో సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.వైఎస్ హయాంలో ఎంత మంది దళితులను లబ్ది చేకూరిందో, ఎన్ని నిధులు ఖర్చయ్యాయో దమ్ముంటే ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని వారు కోరారు.
Share this article :

0 comments: