దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వల్ల ప్రయోజనాలు, పదవులు పొందినవారు.. ఆయన మోచేతి కింద నీళ్లు తాగినవారే మహానేతను విమర్శించడం సిగ్గుచేటు అని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు అంబటి రాంబాబు దుయ్యబట్టారు. వైఎస్ ప్రాపకంతో పైకి వచ్చి ఆయనపైనే విమర్శలు చేసేవారిని తెలుగు ప్రజలు, వైఎస్సార్ అభిమానులూ చెప్పులతో తరిమికొడతారని హెచ్చరించారు.
రాంబాబు గురువారమిక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్ను కాంగ్రెస్ నేతలు విమర్శించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రాష్ట్రంలో ఈనెల 15 నుంచి ప్రజాపథం ప్రారంభం కానుంది. అయితే అంతకుముందే పర్యటనలకు వెళ్లిన మంత్రులకు తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. గంటా శ్రీనివాసరావును అనకాపల్లి నియోజకవర్గంలో ప్రజలు తరిమి తిట్ల పురాణాన్ని లంఘించుకున్నారు. మరోచోట టి.జి.వెంకటేష్కు తీవ్ర నిరసన వ్యక్తమైంది. పొన్నాల లక్ష్మయ్యపై చెప్పులతో దాడి చేసినంత పనైంది. ప్రజాపథంలో ప్రజలు మంత్రులను ఎలా తరమబోతున్నారో అనడానికి ఇదొక శాంపిల్(నమూనా) మాత్రమే. మంత్రులు కూడా పరుగు పందానికి సిద్ధంగా ఉండాలి’ అని ఎద్దేవా చేశారు.
వైఎస్ మరణించాక ఆయన్ను దూషిస్తే ఇలాగే ఉంటుందని హెచ్చరించారు. రాజశేఖరరెడ్డి మరణించాక అసలు రాష్ట్రంలో పరిస్థితులు ఎందుకిలా తయారయ్యాయో మంత్రులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ‘వైఎస్ను విమర్శించాలనే విషయంలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలున్నాయి. కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్ తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ను విమర్శించబోనని చెప్పారు. టీడీపీ నాయకుడు పాలకొండ్రాయుడు తమ అధినేత చంద్రబాబు సమక్షంలోనే వైఎస్ను విమర్శించబోనని తేల్చి చెప్పారు. వైఎస్తో కలిసి తాను ఎన్నోసార్లు భోజనం చేశానని, కొంత కాలం పాటు సన్నిహితంగా మెలిగానని, అందుకే తాను అలా చేయనని ఆయన ప్రకటించారు. ఎపుడో సన్నిహితంగా మెలిగినందుకు, ఆయనతో కలిసి భోజనం చేసినందుకే విమర్శించబోనని పాలకొండ్రాయుడు చెప్పారంటే.. మరి వైఎస్ ప్రాపకంతో పైకి వచ్చినవారు విమర్శలకు దిగుతూ ఉంటే ఏం చెప్పాలి’ అని అంబటి దుయ్యబట్టారు.
బాబువే శవరాజకీయాలు
జగన్ శవరాజకీయాలు చేశారని, ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు పెట్టించారనీ చంద్రబాబు చేసిన ఆరోపణలపై అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. ‘అసలు శవాలతో రాజకీయం చేసింది చంద్రబాబే. ఎన్టీఆర్ను శవంగా మార్చి ఆ శవంపై కాలు పెట్టి అధికారంలోకి వచ్చిన బాబు.. ఈ రోజు చెబుతున్న మాటలు చూసి పరిశీలకులకూ, రాజకీయ విశ్లేషకులకూ నవ్వాలో, ఏడవాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది’ అని వ్యాఖ్యానించారు. కలిసి భోజనం చేసినందుకే వైఎస్ను విమర్శించబోనని టీడీపీ నాయకుడు చెప్పినపుడు.. అదే వైఎస్ దగ్గర పాకెట్మనీ(రోజువారీ ఖర్చులు) తీసుకుని రాజకీయాలు చేసిన చంద్రబాబు మరణించిన వైఎస్పై విమర్శలు చేయడం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
0 comments:
Post a Comment