హైదరాబాద్, న్యూస్లైన్: రాష్ట్రంలో శవంలా మారిన కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ నుంచి ఎంతటి వారొచ్చినా.. ఎలాంటి చికిత్స అందించినా బతికే పరిస్థితి లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు తేల్చి చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎప్పుడో చచ్చిపోయిందని, ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, ఓటర్లు అందరూ వైఎస్సార్ కాంగ్రెస్లో చేరారని తెలిపారు. ఇప్పుడున్నది పీఆర్పీ కాంగ్రెస్ అని గట్టు అన్నారు. బుధవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
‘‘కాంగ్రెస్ను రెండు సార్లు అధికారంలోకి తెచ్చి వెలుగునిచ్చిన మహానేత వైఎస్ను కాంగ్రెస్ నేతలే విమర్శించడం సిగ్గుచేటు. అన్నం పెట్టి ఆదరించిన వ్యక్తిని, ఆ కుటుంబాన్ని విమర్శించడమంటే రాజకీయాల్లో ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. వైఎస్ రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తూ.. ఆయన్నే తిడుతుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారు. విజయమ్మ కంట కన్నీరు పెట్టించిన కాంగ్రెస్ నేతలకు పాపం చుట్టుకుంది.. ఆ పాపం ఊరికే పోదు. కాంగ్రెస్ నేతలు ఇప్పటికే పాపం అనుభవిస్తున్నారు’’ అని అన్నారు. జగన్ను పొమ్మనలేక పొగబెట్టి బయటకు పంపినప్పుడే కాంగ్రెస్ పని అయిపోయిందని తెలిపారు.
వైఎస్ మీ వాడైతే తిట్టినవారిని గెంటేస్తారా?
‘వైఎస్ మావాడే. మాకు మంచి మిత్రుడు. కాంగ్రెస్కు ఎనలేని సేవ చేశారు అని వాయలార్ రవి అంటున్నారు. వైఎస్ పాలన దేశానికే ఆదర్శం అని ప్రధాని కొనియాడారు. మరి కాంగ్రెస్కు ఇంత సేవ చేసిన వైఎస్కు మీరేం చేస్తున్నారు?’ అని గట్టు నిలదీశారు. వైఎస్ను తిట్టిన వారికి మంత్రి పదవులిచ్చి పార్టీని చేతులారా చంపుకున్నది కాంగ్రెస్ అధిష్టానమేనని అన్నారు. అందుకే అసలు జబ్బు ఢిల్లీలో ఉందని, చికిత్స చేసి, మందు వేయాల్సింది కూడా అక్కడే అని తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్కు పునరుజ్జీవం పోయడానికే వచ్చానంటున్న రవి వ్యాఖ్యలు చూస్తుంటే.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆజాద్ పూర్తిగా విఫలమైనట్లా? అని ప్రశ్నించారు. సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్సను తప్పించేందుకే రవి రాష్ట్ర పర్యటన జరుపుతున్నారని ఆయన వెల్లడించారు. కిరణ్, బొత్సలు పదవులు కాపాడుకోవడానికి ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించి ఢిల్లీ టూర్లు చేస్తున్నారని గట్టు దుయ్యబట్టారు
0 comments:
Post a Comment