మైసూరా, సబ్బం, పార్టీ నేతలతో భేటీ
హైదరాబాద్, న్యూస్లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి లోటస్పాండ్లోని తన నివాసంలో.. తల్లి విజయమ్మ ఆశీస్సులు తీసుకున్న అనంతరం సీబీఐ ముందు విచారణకు హాజరయ్యేందుకు వెళ్లారు. అంతకుముందు తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. సీబీఐ నోటీసుల నేపథ్యంలో గురువారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న జగన్ శుక్రవారం ఉదయం పలువురు పార్టీ నేతలను కలుసుకున్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డితో కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు. ఆ తరువాత అనకాపల్లి ఎంపీ సబ్బంహరి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కొణతాల రామకృష్ణ, బాజిరెడ్డి గోవర్ధన్, భూమా నాగిరెడ్డి, ఎస్.వి.మోహన్రెడ్డి, ఎమ్మిగనూరు వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, జ్యోతుల నెహ్రూతో పాటుగా పలువురు నాయకులతో కొద్దిసేపు సమావేశమయ్యారు. కాగా ఏలూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) కూడా జగన్ను కలుసుకున్నారు.
ఉదయం సరిగ్గా 10.10 గంటలకు ఇంటినుంచి బయటకు వచ్చి అక్కడ వేచి చూస్తున్నవారందరికీ అభివాదం చేశారు. జగన్ను తల్లి విజయమ్మ, సతీమణి వైఎస్ భారతి, ఇతర కుటుంబసభ్యులు బయటకు వచ్చి వీడ్కోలు పలుకగా, అప్పటికే భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు ‘జై జగన్...!’ అంటూ నినాదాలు చేస్తుండగా దిల్కుశ అతిథి గృహానికి వెళ్లారు. పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాపరెడ్డి, ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్తో పాటుగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు జగన్ కాన్వాయ్ వెంట ఉన్నారు. ఇదిలావుండగా జగన్ నివాసానికి సమీప ప్రాంతాలను పోలీసులు దిగ్బంధించారు.
సుమారు అర కిలోమీటరు పరిధిలో అన్ని రహదారుల్లోనూ పెద్ద సంఖ్యలో మోహరించారు. ఎంత కట్టుదిట్టం చేసినా పార్టీ కార్యకర్తలు, అభిమానులు జగన్ నివాసం వద్దకు చేరుకోకుండా నిరోధిం చడం మాత్రం వారివల్ల కాలేదు. ఉదయం 8 గంటల నుంచే ఆయన ఇంటి ముందు వందల సంఖ్యలో అభిమానులు గుమికూడారు. జగన్ వాహనం బయటకు రాగానే పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ వీడ్కోలు పలికారు.
0 comments:
Post a Comment