సీబీఐ కేసు న్యాయస్థానాల్లో నిలవదు.. ‘సాక్షి’ మూతపడే ప్రశ్నే లేదు
సాక్షి ఉద్యోగుల జీవించే హక్కును హరించే హక్కు సీబీఐకి లేదు
టీవీ చానల్ చర్చలో ఎస్.రామచంద్రరావు విశ్లేషణ
హైదరాబాద్, న్యూస్లైన్: ‘‘ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల మీద వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై సీబీఐ నమోదు చేసిన సెక్షన్ 13 (ఇ) కేసు చట్టప్రకారం చెల్లదు. సెక్షన్ 13(ఇ) అనేది క్రిమినల్ లాకు వర్తించదు. ప్రొవిజన్స్ లా ప్రకారం అది కేవలం పబ్లిక్ సర్వెంట్స్ (ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు)కు మాత్రమే చెల్లుబాటు అవుతుంది’’ అని సీనియర్ న్యాయవాది ఎస్.రామచంద్రరావు స్పష్టం చేశారు. గురువారం ఆయన ఒక న్యూస్ చానల్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. జగన్పై సీబీఐ నమోదు చేసిన కేసు చెల్లుబాటు కాదని తేల్చిచెప్పారు. ‘‘జగన్ గతంలో పబ్లిక్ సర్వెంట్ కాదు. ఆయన సీబీఐ నమోదు చేసిన కేసుకు అర్హతే లేదు. ఒకవేళ ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్నారు కనుక పబ్లిక్ సర్వెంట్గా భావిస్తే.. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేయాలంటే లోక్సభ స్పీకర్ అనుమతి తప్పనిసరి. అలా చేసినా జగన్కు 13 (ఇ) వర్తించదు. ఎందుకంటే ఎంపీలను పబ్లిక్ సర్వెంట్గా భావించినా వారికి 7, 9, 13 సెక్షన్లు వర్తించవు. ఈ విషయాన్ని స్వయంగా దేశ సర్వోన్నత న్యాయస్థానమే స్పష్టం చేసింది’’ అని ఆయన వివరించారు.
13 (ఇ) ఎవరికి వర్తిస్తుందంటే...
‘‘పబ్లిక్ సర్వెంట్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని నిర్ధారణకు రావాలి. ఆస్తులు దుర్మార్గంగా, అక్రమంగా సంపాదించారని నిరూపించగలగాలి. అప్పుడు ఈ ఆస్తులను ఏం చేయాలనే స్టేజ్కు వ చ్చినప్పుడు కోర్టును ఆశ్రయిస్తూ.. ఈ కేసు నమోదు చేయవచ్చు. కానీ జగన్ ఆస్తుల కేసు ఇప్పటి దాకా విచారణ పూర్తి కాలేదు. ఎలాంటి నిర్ధారణకూ రాలేదు. సీబీఐ చార్జిషీట్ల మీద చార్జిషీట్లు వేస్తోంది. ఇలాంటప్పుడు ఆ కేసు న్యాయస్థానాల్లో నిలబడే ప్రసక్తే లేదు. పైగా జగన్కు ఈ కేసు ఏమాత్రం వర్తించదు’’ అని రామచంద్రరావు పేర్కొన్నారు. జగన్ ఆస్తుల కేసులో సీబీఐ జరుపుతున్న విచారణ తనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. సీబీఐ ప్రవర్తన చూస్తే.. బెయిల్ మంజూరుకు అర్హత ఉన్న వారికి అడ్డుపడుతూ, ఇవ్వకూడని వారికి స్వయంగా దగ్గరుండి మంజూరు చేయిస్తోందని పేర్కొన్నారు.
సాక్షి మూతపడే సమస్యే లేదు: ‘‘13 (ఇ) సెక్షన్పై ‘సాక్షి’ మూతపడుతుందనే వాదనకు ఒక్క శాతం అవకాశం కూడా లేదు. అసలు కేసే నిలబడదు. జగన్ పబ్లిక్ సర్వెంట్ కానప్పుడు చట్టప్రకారం ఆ కేసు చెల్లుబాటు కాదు. అదే విధంగా ఉద్యోగులు జీవించే హక్కును హరించే అర్హత సీబీఐకి లేదు. ఉద్యోగులు ఎవరూ సీబీఐ పెట్టే కేసుల పరిధిలోకి రారు. కనుక సాక్షికి ఎలాంటి నష్టం ఉండదు. రోజూలాగే కార్యకలాపాలు జరుపుకోవచ్చు’’ అని రామచంద్రరావు పేర్కొన్నారు. సీబీఐ కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తుంది కాబట్టి తప్పనిసరిగా దానిపై రాజకీయ ఒత్తిడి ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
0 comments:
Post a Comment