రైల్వేకోడూరు అర్బన్/కడప, న్యూస్లైన్: పేదలు, రైతుల కోసం పదవీ త్యాగం చేసిన కొరముట్ల శ్రీనివాసులును ఉప ఎన్నికలలో ఆశీర్వదించాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పలుచోట్ల ప్రసంగించారు. జగన్ రాకకోసం జనాలు గంటల తరబడి వేచి చూశారు. శుక్రవారం రైల్వేకోడూరులో వైఎస్ జగన్ పర్యటన అనుకున్న షెడ్యూల్ మేరకు సాగలేదు. మంగంపేట వరకే పర్యటన కొనసాగించి రైల్వేకోడూరు రోడ్షోతో ముగించారు.
ఎక్కడ చూసినా రోడ్ల వెంబడి జనాలు ఉండడంతో కాన్వాయ్ ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. జ్వరాన్ని లెక్కచేయక ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా చిరునవ్వుతో పలుకరిస్తూ ఎవరినీ నిరాశపరచకుండా జగన్ ముందుకు కదలడంతో పర్యటన ఆలస్యంగా సాగింది. ప్రతి పల్లెలో జననేతకు పూలవర్షం కురిపించారు. జనాభిమానంతో జగన్ తడిసి ముద్దయ్యారు. వెళ్లెస్తాను తల్లీ...బాయ్ అమ్మా.. బాయ్ అంటూ మందుకు కదిలారు. మంగంపేటలో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. అక్కడ హరినాథరెడ్డి, రమణారెడ్డి ఇళ్లకు జగన్ వెళ్లి తేనీటి విందును స్వీకరించారు.
జగన్ ప్రసంగానికి స్పందన
వైఎస్ జగన్ ప్రసంగానికి జనాలు జేజేలు పలికారు. ఆయన అభివాదం చేయగానే ప్రజలు ప్రతివాదం చేస్తూ చేతులు పెకైత్తి తమ అభిమానాన్ని చాటారు. మంగంపేట తనకు మరో ఇళ్లని జగన్ అభివర్ణించారు. త్వరలో సువర్ణయుగం వస్తుందని, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని సమస్యలు లేకుండా చూస్తానన్నారు.
రైల్వేకోడూరులో పోటెత్తిన జనం
రైల్వేకోడూరులో జనాలు పోటెత్తారు. వేలాది మంది ప్రజలు రోడ్ల వెంబడి జగన్ వెంట నడిచారు. జగన్ ఒంటరి వాడు కాదు...అందరివాడు అని వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి కొరముట్ల అన్నప్పుడు జనాలు మేమున్నామంటూ తమ మద్దతును తెలిపారు. నియోజకవర్గంలో రెండు రోజులపాటు జరిగిన జగన్ పర్యటన ప్రజల ఆప్యాయత, అనురాగాల మధ్య సాగింది.
సర్వమత ప్రార్థనలు
రైల్వేకోడూరు పట్టణంలో తొలుత ముస్లింలతో జగన్ సమావేశమై కొద్దిసేపు వారితో గడిపారు. ఆర్యవైశ్య అన్నసత్రంలో, గంగమ్మ తల్లి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. చిన్నరాజుపోడులో రాజు కులస్తులతో సమావేశమయ్యారు. పార్టీ అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసులు, నియోజకవర్గ ఇన్ఛార్జిలు వైఎస్ కొండారెడ్డి, రూపానందరెడ్డి, డీసీసీబీ చైర్మన్ కొల్లం బ్రహ్మనందరెడ్డి, వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి పంజం సుకుమార్రెడ్డి, క్షత్రియ నాయకుడు హేమనవర్మ, మాజీ ఎమ్మెల్యే గుంటి ప్రసాద్, చెవ్వు శ్రీనివాసులురెడ్డి, సాయి కిశోర్రెడ్డి,తదితరులు జగన్ వెంట పాల్గొన్నారు.
0 comments:
Post a Comment