న్యూస్లైన్ నెట్వర్క్: పత్రికా స్వేచ్ఛపై దాడిని నిరసిస్తూ గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. సాక్షి పత్రిక, చానల్ ఖాతాలను స్తంభింపచేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. వైఎస్సార్జిల్లా మైదుకూరులో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. సోనియాగాంధీ, సీబీఐ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
అనంతపురం జిల్లా గుంతకల్లులోని మస్తానయ్య దర్గాలో చాదర్ సమర్పించి, ప్రత్యేక పూజ లు నిర్వహించారు. పుట్టపర్తిలో ధర్నా, మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించారు. కర్నూలుజిల్లా ఎమ్మిగనూరులో భారీర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఆదోనిలో భారీర్యాలీ అనంతరం రాస్తారోకో నిర్వహించారు. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహం వద్ద రాస్తారోకో చేపట్టారు. కోవెలకుంట్లలో ర్యాలీ, ధర్నా కొనసాగింది ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలోని వెలుగోడులో రాస్తారోకో,ధర్నా చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజ మండ్రిలోని అంబేద్కర్ సెంటర్లో మానవహారం నిర్వహించి, గంటసేపు ధర్నా చేశారు. ధవళేశ్వరంలో ధర్నా చేపట్టారు. రావులపాలెంలో కళావెంకట్రావు సెంటర్ వద్ద ఐదో నెంబర్ జాతీయరహదారిపై కార్యకర్తలు బైఠాయించారు.
రాయవరం మండలం వెదురుపాకలో మోటారుసైకిల్ ర్యాలీ నిర్వహించారు.కృష్ణాజిల్లా విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్లో భారీ మానవహారాన్ని, నిరసన ప్రదర్శనను నిర్వహించారు. సీబీఐ తీరును నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా నారాయణవలస సంత వద్ద లక్ష సంతకాల సేకరణ ప్రారంభించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. నిజామాబాద్ నగరంలో స్థానిక నెహ్రూ పార్క్ నుంచి గాంధీచౌక్ వరకు కొవ్వొత్తులతో ప్రదర్శన జరిపారు. వరంగల్ జిల్లాలో వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు, మోటార్సైకిల్ ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించి ఆయా డివిజన్లలో ఆర్డీఓలకు, మండలాల్లో తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు.
1 comments:
It is time to unite all journalist fraternity
Amarender Reddy
Post a Comment