విచారణ ప్రశాంతంగా జరిగింది..సీబీఐ అడిగిన వాటికి వివరణ ఇచ్చా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విచారణ ప్రశాంతంగా జరిగింది..సీబీఐ అడిగిన వాటికి వివరణ ఇచ్చా

విచారణ ప్రశాంతంగా జరిగింది..సీబీఐ అడిగిన వాటికి వివరణ ఇచ్చా

Written By news on Saturday, May 26, 2012 | 5/26/2012



నేడు కూడా సీబీఐ ఆఫీసుకు వస్తానని వెల్లడి
తల్లి విజయమ్మ ఆశీస్సులతో దిల్‌కుశకు జగన్‌మోహన్‌రెడ్డి
ఆయన వెంట వెళ్లిన ఆళ్ల నాని, సబ్బం హరి, భూమా నాగిరెడ్డి
లోటస్‌పాండ్, దిల్‌కుశ వద్ద ఆద్యంతం పోలీసుల వీరంగం
రోడ్లన్నింటినీ అష్టదిగ్బంధం చేసి ఉదయం నుంచే ఓవరాక్షన్
భారీగా ట్రాఫిక్‌జామ్, మండుటెండలో జనం విలవిల
వైఎస్సార్‌సీపీ నేతలనూ అనుమతించని పోలీసులు
ఖైరతాబాద్ వద్దే జగన్ కాన్వాయ్ నిలిపివేత
లేక్‌వ్యూ వరకు వెళ్తామన్నా అనుమతి నిరాకరణ
జగన్ అభిమానులను అదుపులోకి తీసుకున్న వైనం

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘సీబీఐ అధికారులు వివరణ అడిగారు. వారడిగిన వాటికి పూర్తిగా వివరణ ఇచ్చాను’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సీబీఐ క్యాంపు కార్యాలయమైన దిల్‌కుశ అతిథి గృహంలో ఆయన శుక్రవారం విచారణకు హాజరయ్యారు. అనంతరం తిరిగి వెళ్తూ కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. ఇంకా మరికొన్ని అంశాలకు వివరణ ఇవ్వాల్సి ఉందని, అందుకోసం శనివారం కూడా వస్తానని వెల్లడించారు. విచారణ ప్రశాంత వాతావరణంలో జరిగిందని ఓ ప్రశ్నకు బదులుగా చెప్పారు. విచారణ నిమిత్తం దిల్‌కుశ అతిథి గృహంలోకి వెళ్లేప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారో, బయటికి వచ్చేప్పుడు కూడా జగన్ అంతే ఉత్సాహంగా కనిపించారు. దిల్‌కుశ ప్రధాన ద్వారం వద్దకు రాగానే, మాట్లాడాల్సిందిగా మీడియా ప్రతినిధులు కోరడంతో వాహనం ఆపాలని డ్రైవర్‌ను ఆదేశించారు. అందరికీ కనిపించేలా కారు డోర్ దగ్గర నుంచుని వారి ప్రశ్నలకు సమాధాన మిచ్చారు. అనంతరం బై.. బై... అంటూ తనదైన శైలిలో చేయి ఊపుతూ వెళ్లిపోయారు.

సుదీర్ఘంగా విచారణ: విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ నోటీసులిచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం 10.30కు జగన్ దిల్‌కుశ అతిథి గృహానికి వచ్చారు. అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, ఏలూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల నాని, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి ఆయన వెంటవచ్చారు. తరవాత కొద్దిసేపటికి సీబీఐ జాయింట్ డెరైక్టర్ వీవీ లక్ష్మీనారాయణ జగన్‌ను విచారించారు. ఆ సందర్భంగా హరి, భూమా, నాని వేరొక గదిలో ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటలప్పుడు హరి వెళ్లిపోయారు. వాన్‌పిక్ ఉదంతంలో అరెస్టయిన మంత్రి మోపిదేవి వెంకటరమణ, మ్యాట్రిక్స్ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్‌టీఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డిలను కూడా సీబీఐ అధికారులు విచారించారు. సాయంత్రం 4.30కు వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. సాయంత్రం 6.30 గంటలకు విచారణ ముగిశాక భూమా, నానిలతో కలిసి ఒకే వాహనంలో జగన్ తిరిగి వెళ్లిపోయారు. జగన్‌తో పాటు ఆయన వెంట వచ్చిన వారికి జగన్ నివాసం నుంచి భోజనం వచ్చింది. మధ్యాహ్నం 1.30 సమయంలో వారికి భోజనం తీసుకుని వస్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకుని కిలోమీటర్ దూరంలోనే నిలిపేయడంతో అందులోని వారు కాలినడకన వచ్చి భోజనం అందించారు. భోజన విరామం మినహా విచారణ సుదీర్ఘంగా కొనసాగింది.

ఈ సమయంలో విచారణ కుట్రే: సబ్బం
ఉప ఎన్నికలు జరుగుతున్న తరుణంలో జగన్‌ను విచారణకు పిలవడం కచ్చితంగా కుట్రేనని సబ్బం స్పష్టం చేశారు. దిల్‌కుశ నుంచి తిరిగి వెళ్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని జగన్ కూడా చెప్పారు. తనూ అలాగే భావిస్తున్నాను. రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం మేరకు 26 జీవోలిచ్చారు. జగన్ నిందితుడిగా నిర్ధారణ కావాలంటే ఆ జీవోలు రైటో, రాంగో ముందుగా తేలాల్సి ఉంది. ఆ జీవోలపై నిర్ధారణ రానంత వరకూ జగన్‌పై ఉన్నవి కేవలం ఆరోపణలు మాత్రమే’’ అని ఆయన అన్నారు. జగన్ అరెస్టు వార్తలపై స్పందించాలని కోరగా, అది సీబీఐ జేడీ లక్ష్మీనారాయణను అడగాలని సబ్బం సూచిం చారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి, జగన్‌మోహన్‌రెడ్డికి తాను అభిమానినని ఒక ప్రశ్నకు సమాధానంగా పునరుద్ఘాటించారు.

పోలీసుల వీరంగం: శుక్రవారం సీబీఐ విచారణ సందర్భంగా జగన్ నివాసం లోటస్‌పాండ్‌తో పాటు దిల్‌కుశ అతిథి గృహం సమీపంలో పోలీసులు వీరంగం చేశారు. జగన్ నివాసానికి వెళ్లే దారిలో బారికేడ్లు పెట్టి, ఎవరూ వెళ్లకుండా అడ్డుకున్నారు. జగన్‌ను కలిసేందుకు వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను కూడా నిలిపేయడంతో పోలీసులతో వారు వాగ్వివాదానికి దిగారు. పార్టీ కార్యకర్తలను, జగన్ అభిమానులను దరిదాపుల్లోకి రాకుండా చేశారు. జగన్ దిల్‌కుశకు వస్తున్న సమయంలోనూ ఖైరతాబాద్ వద్ద పోలీసులు వీరంగం సృష్టించారు. ఆయన్ను వెన్నంటి వస్తున్న కాన్వాయ్‌లోని వాహనాలను ఖైరతాబాద్ వద్ద నిలిపేశారు. లేక్‌వ్యూ వరకు వెళ్తామన్నా అంగీకరించలేదు. ఇక దిల్‌కుశకు దారి తీసే మార్గాలన్నింటినీ ఉదయం నుంచే దిగ్బంధించారు. బారికేడ్లు, ఇనుప కంచెలు వేశారు. అయినప్పటికీ పలువురు జగన్ అభిమానులు దిల్‌కుశ అతిథి గృహం వద్దకు చేరుకున్నారు. ఉదయం 11.30 సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ నేత వెల్లాల రామ్మోహన్ దిల్‌కుశ వద్దకు చేరుకుని ‘జై జగన్’ అంటూ నినాదాలు చేశారు. దాంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం నాలుగు గంటల లోపు జగన్ అభిమానులు పలుమార్లు దిల్‌కుశకు చేరుకుని నినాదాలు చేశారు. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Share this article :

0 comments: