Home »
» నాతో సహా నాటి మంత్రులందరినీ విచారించాలి
నాతో సహా నాటి మంత్రులందరినీ విచారించాలి
రామచంద్రపురం (తూర్పుగోదావరి), న్యూస్లైన్: వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో తీసుకున్న నిర్ణయాలకు అప్పటి మంత్రిమండలి మొత్తం బాధ్యత వహించాలని మాజీ మంత్రి, రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లి సుభాష్చంద్రబోస్ అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కంటే ముందుగా.. వైఎస్ మంత్రివర్గంలో ఉండి నిర్ణయాలు తీసుకున్న తనతో సహా అప్పటి మంత్రులందరినీ విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారమిక్కడ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తరువాత తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు.
బీసీ సామాజిక వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణను అరెస్ట్ చేయటం దారుణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న కుతంత్రంలో ఇదొక భాగమని ఆరోపించారు. బలహీన వర్గానికి చెందిన మంత్రిని బలి చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వైఎస్ ఒత్తిడి మేరకు సంతకం చేశానని చెబుతున్న మోపిదేవి.. ఆ విషయాన్ని అరెస్టుకు ముందు చెప్పి ఉంటే వాస్తవానికి దగ్గరగా ఉండేదన్నారు. అరెస్టయిన తరువాత ఈ మాట అనడం చూస్తుంటే .. దీని వెనుక కిరణ్ సర్కారు పెద్దల హస్తం ఉన్నట్టు స్పష్టమవుతోందన్నారు.
‘రైతు సమస్యలను ప్రాధాన్యతాంశంగా తీసుకుని అసెంబ్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశాం. సర్కారుకు వ్యతిరేకంగా ఓటేసిన ఎమ్మెల్యేలందరికీ పదవి పోతుందని ఆనాడే తెలుసు. అయితే, రైతుల కోసం పదవిని వదులుకోవటం వల్లే ఈనాడు వారికి ప్రజల్లో మరింత ఆదరణ లభిస్తోంది’ అని ఆయన తెలిపారు. ఉప ఎన్నికల్లో అన్ని చోట్లా తమ పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొందటం ఖాయమన్నారు. |
|
0 comments:
Post a Comment