25న రైతు సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ ధర్నా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 25న రైతు సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ ధర్నా

25న రైతు సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ ధర్నా

Written By news on Saturday, June 23, 2012 | 6/23/2012

ఖరీఫ్ సీజన్ మొదలైనప్పటికీ ఇప్పటిదాకా రైతులకు విత్తనాలు, ఎరువులు అందజేయడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఈనెల 25 తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ నిర్ణయించింది. పాలకుల కళ్లు తెరిపించేందుకు చేపడుతున్న ధర్నాలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పార్టీ కోరింది. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర పాలక మండలి సభ్యులు (సీజీసీ) సమావేశమై రైతాంగ సమస్యలు, ఉప ఎన్నికల ఫలితాలు, పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిపై జరుగుతున్న కుట్రలను చర్చించారు. 

అనంతరం ఆ వివరాలను సీజీసీ సభ్యులు తోపుదుర్తి కవిత, జంగా కృష్ణమూర్తి, అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మీడియాకు వివరించారు. జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యంలేక కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై సీబీఐతో కుతంత్రాలు నడిపిస్తూ.. ఆయనపై ఆరోపణలు నిరూపితం కాకముందే జైల్లో పెట్టించడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించినట్లు కవిత తెలిపారు. జగన్‌ను కస్టడీలోకి తీసుకున్న సీబీఐ రోజుకొక చోట విచారించడం, భద్రతలేని వాహనాల్లో తీసుకెళ్లడం, జైల్లో రాత్రి వేళ కరెంట్ తీయడం లాంటివి తమను ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. జగన్‌పై జరుగుతున్న కుట్రలకు సంబంధించిన ఆధారాలతో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టులతో పాటు ఇతర పార్టీలకు నివేదికలు అందజేసి న్యాయం కోరనున్నట్లు తెలిపారు. ఉప ఎన్నికల ఫలితాలను పార్టీ క్షుణ్ణంగా సమీక్షించినట్లు చెప్పారు. పార్టీ గెలుపొందిన స్థానాలతో పాటు ఓడిన వాటిల్లో ఏం జరిగిందనే దానిపై చర్చించామన్నారు. రాబోయే ఎన్నికలకు ఏ విధంగా సన్నద్ధం కావాలనే అంశంపైనా చర్చించడం జరిగిందన్నారు. పార్టీ నిర్మాణంలో భాగంగా గ్రామ కమిటీలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడంతోపాటు సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్‌కు సంబంధించి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.
Share this article :

0 comments: