‘సాక్షి’పై కొనసాగుతున్న కక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘సాక్షి’పై కొనసాగుతున్న కక్ష

‘సాక్షి’పై కొనసాగుతున్న కక్ష

Written By news on Friday, June 15, 2012 | 6/15/2012

ప్రకటనల నిలుపుదల నల్లజీవోపై స్టే విధించిన హైకోర్టు
నెలరోజులైనా జీవోను రద్దు చేసి కొత్త జీవో ఇవ్వని సర్కారు
రెండువారాలుగా ముఖ్యమంత్రి వద్దే మూలుగుతున్న ఫైలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: హైకోర్టు ఉత్తర్వులను కూడా బేఖాతరు చేసి రాష్ట్ర ప్రభుత్వం ‘సాక్షి’ మీడియా సంస్థలపై కక్ష సాధింపు కొనసాగిస్తోంది. ఆర్థికంగా దెబ్బతీయాలన్న కుట్రతో రాష్ట్ర ప్రభుత్వం ‘సాక్షి’ మీడియాకు ప్రకటనలను నిలుపుదల చేస్తూ గతనెల తొమ్మిదో తేదీ అర్ధరాత్రి నల్లజీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ జీవో-2097ను సవాల్ చేస్తూ ‘సాక్షి’ మీడియా సంస్థలు హైకోర్టును ఆశ్రయించగా... జీవోను నిలుపుదల చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసి దాదాపు నెలరోజులు కావస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రకటనలను పునరుద్ధరిస్తూ ఇప్పటివరకు ఉత్తర్వులు జారీ చేయకుండా వేధింపు ధోరణిని కొనసాగిస్తోంది. సాక్షి మీడియా సంస్థలకు వ్యతిరేకంగా సీబీఐ కోర్టులో అభియోగాలు నమోదు చేసిందని సాకు చూపిస్తూ అర్ధరాత్రి సమయంలో ‘సాక్షి’ మీడియా గొంతునొక్కడానికి ప్రకటనలు నిలిపివేసి సర్కారు... ఆ ఉత్తర్వుల ప్రతులను అన్ని ప్రభుత్వ విభాగాలకు ఆగమేఘాలపై ఫ్యాక్స్ చేసి మరీ తన కుట్రను బహిర్గతం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. 

పకటనల నిలుపుదల పత్రిక స్వేచ్ఛను హరించడమేనని మండిపడుతూ రాష్ట్ర, జాతీయస్థాయిలో మేధావులు, మీడియా ప్రతినిధులు, సంపాదకులు, జర్నలిస్టుల సంఘాలు ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించాయి. హైకోర్టు ఉత్తర్వులు, పత్రికా రంగంనుంచి నిరసనలు వెల్లువెత్తినప్పటికీ కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు మాత్రం తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం ఇప్పటివరకు చేయకపోవడం శోచనీయం. ప్రకటనలు నిలుపుదల చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ మళ్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. అందుకు అనుగుణంగా రాష్ట్ర పౌర సంబంధాల శాఖ కమిషనర్, ఆ శాఖ మంత్రి డీకే అరుణ ఫైలును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి పంపించారు. అయితే ప్రకటనల జారీకి సంబంధించిన ఫైలుపై ఆయన సంతకం చేయకుండా రెండు వారాలుగా కాలయాపన చేస్తున్నట్లు సమాచారం. 

న్యాయ వ్యవస్థపై అపార నమ్మకం ఉందని చెప్పుకునే ఈ ప్రభుత్వం రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయకుండా కోర్టు ధిక్కార నేరానికి పాల్పడుతోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రకటనలు పునరుద్ధరించాలని ‘సాక్షి’ మీడియా ప్రతినిధులు పలుమార్లు సంబంధిత శాఖ అధికారులను విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. రెండో అత్యధిక సర్క్యులేషన్ గల పత్రికకు ప్రకటనలు నిలిపివేయడం వల్ల ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరే అవకాశం లేకుండాపోతుందన్న అభిప్రాయం ఉంది. అయినా సరే ‘సాక్షి’ మీడియా సంస్థలపై కక్ష కట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు ఎలాగైనా ఇబ్బందులకు గురిచేయాలనే ధోరణితోనే ఉండడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
Share this article :