బాబు విదేశీ ఖాతాలో డబ్బులు వేశా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు విదేశీ ఖాతాలో డబ్బులు వేశా

బాబు విదేశీ ఖాతాలో డబ్బులు వేశా

Written By news on Sunday, June 10, 2012 | 6/10/2012

* బాబు సీఎంగా ఉన్నప్పుడు లోక్‌సభ సీటు ఇస్తానని రూ. 5.10 కోట్లు తీసుకున్నారు 
* అందులో రూ.10 లక్షలు మాత్రమే కోర్టుకు ఇచ్చారు 
* మిగతా డబ్బులు అడిగినందుకు నాపై మూడుసార్లు హత్యాయత్నం చేయించారు 
* లాటరీ కేసులో ఈడీకి చంద్రబాబు విదేశీ బ్యాంకు అకౌంట్ల ఆధారాలు లభించాయి 
* ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్‌కు బాబు రూ. 50 లక్షలు లంచం ఇచ్చి మేనేజ్ చేశారు 
* బాబుకు చెందిన 4 విదేశీ బ్యాంకు ఖాతాల వివరాలు బహిర్గతం చేసిన కోలా 
* తన వద్ద ఉన్న ఆధారాలతో త్వరలో హైకోర్టులో పిటిషన్ వేస్తానని ప్రకటన 
* బాబు కుటుంబ సభ్యుల 12 విదేశీ బ్యాంకు ఖాతాలనూ బయటపెడతానని వెల్లడి

హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అంతర్జాతీయంగా విస్తరించుకున్న ధన సామ్రాజ్యం గుట్టును ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగిన కోలా వెంకట కృష్ణమోహన్ రట్టు చేశారు. బాబు హవాలా బాగోతాలను ఒక్కొక్కటిగా పలు పత్రాల రుజువులతో సహా బయటపెట్టారు. చంద్రబాబుకు పలు విదేశాల్లో గల నాలుగు బ్యాంక్ అకౌంట్ల నంబర్లను శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన విదేశీ బ్యాంకు ఖాతాకు తాను రూ. 4 కోట్లు ఎలా బదిలీ చేసిందీ బహిర్గతం చేశారు. బాబు విదేశీ బ్యాంకు అకౌంట్ల విషయం తెలుసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్‌ను రూ. 50 లక్షలు ఇచ్చి ఎలా మేనేజ్ చేసిందీ వివరించారు. ఆయన విదేశీ బ్యాంకుల్లో భారీ ఎత్తున డబ్బు ఉందని.. సింగపూర్‌లోని బ్యాంక్ అకౌంట్ ఇప్పటికీ ఆపరేట్ అవుతోందని చెప్పారు. 

అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా 112 హోటళ్లు కలిగి ఉన్న మారియట్‌లో చంద్రబాబుకు వాటా ఉందని.. అందుకే ఆయన ప్రతి ఏటా సింగపూర్, స్విట్జర్లాండ్‌లకు వెళ్తుంటారని వెల్లడించారు. బాబు హవాలా బాగోతాలకు సంబంధించి తన దగ్గరున్న ఆధారాలన్నింటితో కలిపి రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేస్తానని కోలా తెలిపారు. ఆయనపై సీబీఐతో పాటు మరే ఇతర సంస్థల చేత విచారణకు ఆదేశించినా.. తన వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ అందజేస్తానని కోలా వివరించారు. వారం రోజుల్లో మరోసారి విలేకరుల సమావేశం నిర్వహించి చంద్రబాబు కుటుంబ సభ్యులకు చెందిన 11 విదేశీ బ్యాంక్ అకౌంట్ల నంబర్లను బయటపెట్టనున్నట్లు కోలా చెప్పారు. కోలా బయటపెట్టిన బాబు బాగోతం ఆయన మాటల్లోనే... 

లోక్‌సభ సీటు ఇస్తానని ఐదు కోట్లు కొట్టేశారు... 
‘‘నాకు 1999 సంవత్సరంలో యూరో లాటరీ తగిలిందని ప్రకటన వెలువడగానే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. తన తెలుగుదేశం పార్టీలో చేరాలంటూ నాకు ప్రత్యేక ఆహ్వానం పంపించారు. ఆయన దగ్గరికి వెళ్లిన తరా్వాత వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం లోక్‌సభ సీటు ఇస్తానంటూ.. నా నుంచి పార్టీ ఫండ్‌గా డబ్బు డిమాండ్ చేశారు. అప్పుడు ఆయన సీఎంగా ఉండటంతో పాటు రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతుండటంతో అప్పట్లో ఐదు కోట్ల పది లక్షల రూపాయలు అందజేశా. అందులో పది లక్షలు చెక్కు రూపంలో ఇవ్వగా.. కోటి రూపాయలను రెండు ట్రంకు పెట్టల్లో తీసుకెళ్లి ఇంట్లో ఇచ్చా. మిగతా నాలుగు కోట్లు లండన్‌లోని మిడ్‌ల్యాండ్ బ్యాంక్ (ప్రస్తుతం ఇది హెచ్.ఎస్.బి.సిలో విలీనం అయ్యిందని కోలా చెప్పారు)లో నాకున్న అకౌంట్ నుంచి నేరుగా చంద్రబాబుకు సింగపూర్‌లో ఉన్న డాయిషే బ్యాంకు అకౌంట్‌లో జమచేశా. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో నాకు సీటు ఇవ్వలేదు. ఇదేమని ప్రశ్నిస్తే రాజ్యసభ సీటు ఇస్తానని నమ్మబలికారు. 

పోలీసు అధికారులు బెదిరించారు... 
రెండు నెలల తర్వాత లాటరీ అవకతవకల విషయంలో పోలీసులు 1999 నవంబర్ 29న నన్ను అరెస్టు చేశారు. అయితే ఇక్కడ ట్విస్టు ఏంటంటే.. చంద్రబాబుకు ఇచ్చిన రూ. ఐదు కోట్ల పది లక్షల డబ్బు విషయం బయటపెట్టవద్దంటూ నాపై పెద్ద ఎత్తున ఒత్తిడి చేశారు. సికింద్రాబాద్ డెక్కన్ కాంటినెంటల్ హోటల్‌లో ఉన్న నా దగ్గరకు (అప్పటి) పోలీసు ఉన్నతాధికారులు డీజీపీ దొర, ఇంటెలిజెన్స్ ఐజీ శివశంకర్ వచ్చారు. చంద్రబాబుకు కేవలం కోటీ పది లక్షలు మాత్రమే ఇచ్చినట్లు చెప్పాలని, నాలుగు కోట్ల రూపాయల విషయాన్ని బయటపెట్టొద్దని పోలీసులు బెదిరించారు. లేదంటే తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు సీఎం కాబట్టి పోలీసులు ఆ విధంగా వ్యవహరించారు. అందుకే వారు చెప్పినట్లు చేశా. అనంతరం చంద్రబాబు ఏడు నెలల తర్వాత పది లక్షలను మాత్రమే విజయవాడ కోర్టులో సరెండర్ చేశారు. మిగతా రూ. 5 కోట్లు కానీ, పోలీసులకు వెల్లడించిన కోటి రూపాయలను కానీ ఇప్పటికీ తిరిగి ఇవ్వలేదు. 

డబ్బులు తీసుకుని లేడీతో లోకేష్ జంప్ 
చంద్రబాబు కుమారుడు లోకేష్‌బాబు నాదగ్గర రూ. 60 లక్షలు తీసుకుని ఒక టీచర్‌తో జంపయ్యాడు. లోకేష్‌కు మా ఇంట్లో రూ. 25 లక్షలు, చంద్రబాబు ఇంట్లో మరో రూ. 35 లక్షలు ఇచ్చాను. మహిళతో వెళ్లిపోయిన లోకేష్‌ను వెతకటానికి చంద్రబాబే స్వయంగా నన్ను బెంగళూరు పంపించారు. 

ఈడీకి రూ. 50 లక్షలు లంచమిచ్చారు...
లాటరీ కేసు విషయమై నాపై దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్‌కు చంద్రబాబు విదేశీ బ్యాంక్ అకౌంట్ల ఖాతాల గురించి తెలిసిపోయింది. నేను చంద్రబాబుకు విదేశీ అకౌంట్ల ద్వారా నాలుగు కోట్ల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేసిన ఆధారాలు ఈడీ దొరకబట్టింది. కానీ చంద్రబాబు ఈడీ ఉన్నతాధికారులకు రూ. 50 లక్షలు ఇచ్చి మేనేజ్ చేశారు. అప్పట్లో ఆంధ్రజ్యోతి ఎండీగా పనిచేసిన వ్యక్తి, విజయవాడకు చెందిన ముగ్గురు న్యాయవాదులు కలిసి ఈడీ అధికారులకు రూ. 50 లక్షలు అందజేశారు. దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గరున్నాయి. ఎవరిచేత ఏదైనా చేయించగలిగిన ఘనుడు చంద్రబాబు’’ అని కోలా కృష్ణమోహన్ వివరించారు. 

నన్ను చంపించటానికీ ప్రయత్నించారు... 
చంద్రబాబు కారణంగానే తాను అనేక నేరాలకు పాల్పడాల్సి వచ్చిందని కోలా వివరించారు. తన తప్పులకు ప్రత్యక్షంగానో పరోక్షంగా చంద్రబాబే కారణమన్నారు. అంతేకాదు తన నుంచి డబ్బు లాక్కోవటమే కాకుండా అనేక కేసుల్లో ఇరికించారని ఆరోపించారు. తాను నిజాయతీపరుడ్నని చెప్పుకునే చంద్రబాబు అసలు రూపం చాలా క్రూరంగా ఉంటుందని దుయ్యబట్టారు. ఇచ్చిన డబ్బులడిగినందుకే తనను చంపటానికి మూడుసార్లు హత్యాయత్నం చేయించారన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో తనకు యాక్సిడెంట్ చేయించారని ఆరోపించారు. చావుబతుకుల మధ్య ఉన్న తనను పోలీసులు కామినేని రీసెర్చ్ ఆస్పత్రిలో చేర్పించారని దాంతో అక్కడి నుంచి అదృష్టవశాత్తు బయటపడగలిగానన్నారు.
Share this article :

0 comments: