లగడపాటి.. ఘనాపాటి! ఐసీఐసీఐ బ్యాంకుకు కుచ్చుటోపీ! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లగడపాటి.. ఘనాపాటి! ఐసీఐసీఐ బ్యాంకుకు కుచ్చుటోపీ!

లగడపాటి.. ఘనాపాటి! ఐసీఐసీఐ బ్యాంకుకు కుచ్చుటోపీ!

Written By news on Friday, June 29, 2012 | 6/29/2012

ఆ బ్యాంకు నుంచి అక్రమంగా రూ.3000 కోట్లు తీసుకున్నారు
వైఎస్సార్‌సీపీ నాయకుడు గౌతమ్‌రెడ్డి ఆరోపణ
ఆయన ఆస్ట్రేలియా కంపెనినీ మోసం చేశారని ధ్వజం
మనీ లాండరింగ్‌పై ప్రధాని, లోక్‌సభ స్పీకర్, సీబీఐ, ఈడీకి ఫిర్యాదు

హైదరాబాద్, న్యూస్‌లైన్: విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్వదేశంలోని ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.3వేల కోట్ల మేర టోపీ పెట్టడమే కాక ఆస్ట్రేలియాలోని విదేశీ కంపెనీలను నట్టేట ముంచుతున్నారని, ఆయనపై తక్షణం విచారణకు ఆదేశించాలని వైఎస్సార్‌సీపీ నాయకుడు, సీనియర్ న్యాయవాది పి.గౌతమ్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాజగోపాల్ మనీ లాండరింగ్, ప్రజాధనం దుర్వినియోగం లాంటి అనేక అక్రమాలకు పాల్పడ్డారని, దీనిపై తాను ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్‌కు, ఆస్ట్రేలియా రాయబార కార్యాలయానికి, హోంమంత్రికి ఫిర్యాదు చేశానని వెల్లడించారు. ఆయన గురువారం హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

జాతీయ జెండా పట్టుకుని అందరికీ నీతులు బోధించే లగడపాటి చేసిన దురాగతాలు అన్నీ ఇన్నీ కావని విమర్శించారు. ల్యాంకో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థలోని షేర్ హోల్డర్లను కూడా మోసం చేసి రూ.440 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆయన పేర్కొన్నారు. ‘‘రాజగోపాల్ ల్యాంకో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ పేరుతో 2006 సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూ ద్వారా సుమారు రూ.440 కోట్ల ప్రజాధనాన్ని సేకరించారు. దాంతో గత ఏడాది మే 4న ఆస్ట్రేలియాలోని గ్రిఫిన్ కోల్‌మైన్స్ అనే దివాళా తీసిన సంస్థను కొనుగోలు చేశారు. గ్రిఫిన్ సంస్థ దివాళా ప్రకటించడానికి ముందు పర్ధిమాన్ కంపెనీతో బొగ్గు సరఫరా ఒప్పందం చేసుకుంది. 

బొగ్గును గ్యాస్‌గా మార్చి యూరియాను ఉత్పత్తి చేసే ప్రపంచంలోనే అతి పెద్ద కర్మాగారాన్ని నిర్మించే ప్రణాళికతో ఉన్న పర్ధిమాన్ ఫర్టిలైజర్స్ యజమాని వికాస్ రాంబాల్ అప్పటికే రెండు వందల మిలియన్ల డాలర్లను ఈ ప్రాజెక్టుపై పెట్టుబడి పెట్టారు కూడా. మిగిలిన మొత్తాన్ని ఆర్థిక సంస్థల ద్వారా సమీకరణకు రాంబాల్ ప్రయత్నిస్తూ ఉండగా ల్యాంకో ఇన్‌ఫ్రా సంస్థ గ్రిఫిన్స్‌ను కొనుగోలు చేసింది. దాంతోపాటు అప్పటికే పర్ధిమాన్ సంస్థతో చేసుకున్న బొగ్గు సరఫరా ఒప్పందాన్ని గౌరవించడానికి అంగీకరించింది. కానీ గ్రిఫిన్స్‌ను కొనుగోలు చేశాక మాట మార్చి.. బొగ్గు సరఫరా చేసేది లేదని ల్యాంకో స్పష్టం చేసింది. దాంతో పర్ధిమాన్ సంస్థ సంక్షోభంలో పడింది’’ అని గౌతమ్ వివరించారు.

3.5 బిలియన్ డాలర్లు చెల్లించాలని పిటిషన్: ల్యాంకో సంస్థ అనైతిక, అక్రమ చర్యల కారణంగా తాము తీవ్రంగా నష్ట పోయామని, దానికి పరిహారంగా తమకు 3.5 బిలియన్ డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని.. అంటే ల్యాంకో.. గ్రిఫిన్ సంస్థను కొనుగోలు చేసిన 750 మిలియన్ డాలర్ల కన్నా ఐదు రెట్లు ఎక్కువ చెల్లించాలని వెస్ట్రన్ ఆస్టేలియా కోర్టులో పర్ధిమాన్ సంస్థ దావా వేసిందని గౌతమ్‌రెడ్డి చెప్పారు. కేసు విచారణలో ఉన్నందున కోల్‌మైన్స్‌పై ఎలాంటి లావాదేవీలూ చేయరాదని కోర్టు ఆదేశించిన తరుణంలో ల్యాంకో సంస్థ మరో పెద్ద కుంభకోణానికి తెర లేపిందని ఆరోపించారు. కోర్టు వివాదాన్ని మరుగున పరచి గ్రిఫిన్ కోల్‌మైన్స్‌ను ఐసీఐసీఐ బ్యాంకుకు తనఖా పెట్టి 3 వేల కోట్ల రూపాయలు రుణంగా పొందిందని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న పర్ధిమాన్ సంస్థ లబోదిబోమంటూ తాము నష్ట పరిహారం కోసం ప్రయత్నిస్తూ ఉండగా మరోవైపు వివాదంలో ఉన్న కోల్ మైన్స్‌ను ఐసీఐసీఐ బ్యాంకుకు తాకట్టు పెట్టిందని, ఒక వేళ తాము కేసులో గెలిస్తే తమకు ల్యాంకో ఎక్కడి నుంచి డబ్బు తెచ్చి పరిహారంగా ఇస్తుందని ప్రశ్నించిందని గౌతమ్‌రెడ్డి వివరించారు.

ఐసీఐసీఐ ఇరుక్కుపోయింది: పర్ధిమాన్ పిటిషన్‌పై వెస్ట్రన్ ఆస్ట్రేలియా న్యాయశాఖ అధికారులు స్పందించి కోల్‌మైన్స్‌ను ఐసీఐసీఐకి పెట్టిన తాకట్టు చెల్లదని పేర్కొనడంతో ఇపుడు ఆ బ్యాంకు ఉచ్చులో ఇరుక్కు పోయిందని గౌతమ్ తెలిపారు. ఈ తరుణంలోనే ల్యాంకో తమ సంస్థను కొనుగోలు చేసేటపుడు చేసుకున్న ఒప్పం దాన్ని ఉల్లంఘించిందని, అందువల్ల అమ్మకపు ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనుకుంటున్నామని గ్రిఫిన్ సంస్థ ప్రకటించిందని ఆయన వివరించారు. ఈ చర్యతో ఐసీఐసీఐ బ్యాంకు ఇచ్చిన రుణానికి కూడా ముప్పు ఏర్పడిందని గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. ఒకప్పుడు 63 రూపాయల విలువ ఉన్న షేర్ ధర ఇపుడు 13 రూపాయలకు పడిపోయి వాటాదారులు తీవ్రంగా నష్ట పోయారని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో వందల కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగిందని ఆయన వివరించారు. తన ఫిర్యాదుకుకు స్పందించక పోతే తాను హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేస్తానని గౌతమ్‌రెడ్డి స్పష్టం చేశారు.
Share this article :

0 comments: