ఆ ముగ్గురూ కుట్రపన్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ ముగ్గురూ కుట్రపన్నారు

ఆ ముగ్గురూ కుట్రపన్నారు

Written By news on Wednesday, June 27, 2012 | 6/27/2012

చంద్రబాబు, దాడి, రామోజీలపై విజయసాయిరెడ్డి పరువు నష్టం దావా
ఆ ముగ్గురిపై క్రిమినల్ చర్యలు చేపట్టండి
ఘోరీ+గజనీ పోస్టర్ అంతా అభూతకల్పనలే
రాజకీయ, వ్యక్తిగత కక్షలో భాగంగా చంద్రబాబు ఈ పోస్టర్‌ను ముద్రించారు
పాత్రికేయ విలువలు పట్టని ఈనాడు టీడీపీ కరపత్రంలా వ్యవహరిస్తోంది
ఆ పోస్టర్‌ను ప్రచురించే ముందు వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు
ఇది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధం
నెల్‌కాస్ట్ కంపెనీతో నాకెలాంటి సంబంధం లేదు
న్యాయస్థానాలను ప్రభావితం చేసేలా మీడియా ట్రయల్ నడుస్తోంది
ఇది నిందితుల హక్కులను హరించడమే

హైదరాబాద్, న్యూస్‌లైన్: తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా పోస్టర్‌ను ముద్రించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, దాన్ని మీడియాకు విడుదల చేసిన ఆ పార్టీ నేత దాడి వీరభద్రరావు, ఆ పోస్టర్‌ను ప్రచురించిన ఈనాడు చీఫ్ ఎడిటర్ సీహెచ్ రామోజీరావులపై ఆడిటర్ వేణుంబాక విజయసాయిరెడ్డి పరువు నష్టం దావా దాఖలు చేశారు. 

భారతీయశిక్షాస్మృతిలోని సెక్షన్ 499, 500 కింద ఈ ముగ్గురిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని కోరుతూ సీఆర్‌పీసీ 199 కింద సాయిరెడ్డి మంగళవారం నాంపల్లి మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. అవాస్తవాలు, అభూతకల్పనలతో లెక్కలు తయారు చేసి.. ఘోరీ+గజనీ=జగన్ పేరుతో పోస్టర్ ముద్రించిన చంద్రబాబుకు, ఆ పోస్టర్ విడుదల సందర్భంగా నోటికొచ్చినట్లు మాట్లాడిన దాడి వీరభద్రరావుకు, వాస్తవాలు తెలుసుకోకుండా పోస్టర్‌ను యథాతథంగా ఈనాడు పత్రికలో ప్రచురించిన రామోజీరావులపై తగిన చర్యలు చేపట్టాలని ఈ పిటిషన్‌లో సాయిరెడ్డి కోరారు. 

రాజకీయ, వ్యక్తిగత కక్షలో భాగంగా పరువు నష్టం కలిగించే విధంగా బాబు ఈ పోస్టర్‌ను ముద్రించారని, దాన్ని ఆయన ఆదేశాల మేరకు శాసన మండలిలో టీడీపీ ఫ్లోర్‌లీడర్ దాడి వీరభద్రరావు పత్రికలకు విడుదల చేశారని తెలిపారు. పరువునష్టం కలిగించే, తప్పుడు ఉద్దేశాలతోనే రామోజీ.. తన పత్రిక ఈనాడులో ఆ పోస్టర్‌ను ప్రచురించారని చెప్పారు. నేరపూరిత కుట్రలో భాగంగా ఒకరికొకరు సహకరించుకుంటూ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని, ఆయనకు సంబంధించిన కంపెనీలు, వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంతో విషపూరిత కథనాలను, అవాస్తవాలను, అర్థం లేని ప్రకటనలను చేస్తున్నారని పేర్కొన్నారు. ‘‘జగన్‌కు నేను బినామీనంటూ తప్పుడు వ్యాఖ్యలు చేశారు. దీంతో నా పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించిన చంద్రబాబు, వీరభద్రరావు, రామోజీరావులను క్షమాపణ చెప్పాలని ఈనెల 9న నోటీసులు జారీచేసినా స్పందన లేదు’’ అని వివరించారు. ఈ నేపథ్యంలోనే వీరిపై ఐపీసీ సెక్షన్ 499, 500 కింద క్రిమినల్ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ పిటిషన్‌ను కోర్టు ఒకట్రెండు రోజుల్లో విచారించే అవకాశముంది. 

పిటిషన్‌లో సాయిరెడ్డి ఏమన్నారంటే..

‘‘జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన సీబీఐ దర్యాప్తు తీరుతెన్నులపై ఈనాడు సహా అనేక పత్రికలు తరచుగా కథనాలు ప్రచురిస్తున్నాయి. చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ సీబీఐ.. సాక్షుల వాంగ్మూలాలు, ఇతర వివరాలను దురుద్దేశంతో ఈనాడు సహా ఇతర పత్రికలకు లీకులు ఇస్తోంది. మీడియా మాకు వ్యతిరేకంగా కథనాలు ప్రచురించేలా సీబీఐ ప్రోత్సహిస్తోంది. ఇది చట్టాన్ని అపహాస్యం చేయడమే. కోర్టులకు సమాంతరంగా.. న్యాయస్థానాలను సైతం ప్రభావితం చేసేలా ‘మీడియా ట్రయల్’ నడుస్తోంది. ఇది నిందితుల హక్కులను హరించడమే. పాత్రికేయ విలువలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఈనాడు దినపత్రిక తెలుగుదేశం పార్టీ కరపత్రంగా వ్యవహరిస్తోంది. టీడీపీ పోస్టర్‌ను ప్రచురించే ముందు ఓ వార్తా సంస్థ పాటించే కనీస విలువలను కూడా పాటించలేదు. అందులో ఎంత వరకు వాస్తవాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధం’’ 

నాకు సంబంధం లేకున్నా.. 

‘‘జగన్, బినామీలు దోచుకున్న రాష్ట్ర సంపద రూ.16,97,335 కోట్లు శీర్షికన ఈనెల 9న ఈనాడులో వార్తా కథనం ప్రచురితమైంది. నెల్లూరు జిల్లా గురించి చెబుతూ నెల్‌కాస్ట్ కంపెనీ గురించి ప్రస్తావించారు. నెల్‌కాస్ట్ కంపెనీ-విజయసాయిరెడ్డి-1,500 ఎకరాలు-రూ.1,200 కోట్లు అని పేర్కొన్నారు. టీడీపీ విడుదల చేసిన పోస్టర్‌లో ఆ వివరాలు ఉన్నాయి. ఈనాడు ప్రచురించిన కథనంలో నాపేరును దేని ఆధారంగా లాగారో ఎక్కడా చెప్పలేదు. భూములను ప్రభుత్వం నాకు కేటాయించినట్లు ఆపాదించారు. నెల్‌కాస్ట్ లిమిటెడ్ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్ట్ అయిన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. దీని ప్రమోటర్ పి.రాధాకృష్ణారెడ్డి, ఇతరులు. ఈ కంపెనీ మొదట్లో ఆటోమొబైల్ పరికరాలు తయారు చేసేది. 

ఈ వ్యాపారంలో ఆ కం పెనీ గత 25 ఏళ్లుగా ఉంది. నెల్‌కాస్ట్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ అనే అనుబంధ సంస్థను 2000 సంవత్సరంలో నెల్‌కాస్ట్ లిమిటెడ్ ఏర్పాటు చేసింది. ఇందులో 5%వాటా ఎండీగా ఉన్న రాధాకృష్ణారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు ఉంది. నెల్లూరు జిల్లా, కృష్ణపట్నంలో 1,320 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేం ద్రం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నెల్‌కాస్ట్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. నేను భాగస్వామిగా ఉన్న వీఎస్‌రెడ్డి అండ్ కంపెనీ.. నెల్‌కాస్ట్ లిమిటెడ్‌కి 2010 డిసెంబర్ 31 వరకు అంతర్గత ఆడిటర్‌గా, నెల్‌కాస్ట్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చట్టబద్ధ ఆడిటర్‌గా వ్యవహరించింది. 2010 డిసెంబర్ 31న నెల్‌కాస్ట్ ఎనర్జీ, నాగార్జున పవర్ ప్రాజెక్టులో విలీనమైంది. 

2011 అక్టోబర్ 12న ఈ విలీనానికి చెన్నై హైకోర్టు ఆమోద ముద్ర వేసింది. నాగార్జునపవర్ ప్రాజెక్టులో విలీనమైన తరువాత ఆ సంస్థతో నాకు వృత్తిపరంగా గానీ, మరో రకంగా గానీ ఎటువంటి సంబంధం లేదు. ఆ రోజుకు నెల్‌కాస్ట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి భూమిని కేటాయించలేదు. తమ లక్ష్య సాధనలో భాగంగా నెల్‌కాస్ట్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ పలువురు వ్యక్తుల నుంచి దాదాపు 743.83 ఎకరాల భూమిని ప్రైవేటుగా సేకరించింది. నాకు తెలిసినంత వర కు ఆ కంపెనీకి ప్రభుత్వం ఎటువంటి భూమిని కేటాయించలేదు. ఆ కంపెనీతో నాకు ఏ రకంగానూ ఎటువంటి సంబం ధం లేదు. అలాంటప్పుడు ఆ కంపెనీకి ఎటువంటి భూమి కేటాయించకపోయినా, కేటాయించినట్లు చెప్పడమే కాకుం డా.. నాకు కేటాయించినట్లు ఎలా ఆపాదిస్తారు? ఏ భూముల నైతే కేటాయించినట్లు చెబుతున్నారో వాటిని ఆ కంపెనీ ప్రైవేటుగా కొనుగోలు చేసింది’’ అని సాయిరెడ్డి స్పష్టం చేశారు.
Share this article :

0 comments: