నేటి సాయంత్రంతో ప్రచారానికి తెర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేటి సాయంత్రంతో ప్రచారానికి తెర

నేటి సాయంత్రంతో ప్రచారానికి తెర

Written By news on Sunday, June 10, 2012 | 6/10/2012

ఉప ఎన్నికలు జరిగే నెల్లూరు లోక్‌సభ, 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆదివారం సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగియనుంది. ఆ తర్వాత నుంచి ఇంటింటి ప్రచారంతో పాటు అన్ని రకాల ప్రచారాన్నీ నిషేధించినట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. నిషేధాన్ని అతిక్రమించి ఎవరైనా ఇంటింటి ప్రచారం చేస్తే కేసు నమోదుతో పాటు అరెస్టు కూడా చేస్తామని హెచ్చరించారు. పోలింగ్ ఏర్పాట్లపై భన్వర్‌లాల్ శనివారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి తగిన ఆదేశాలు జారీ చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

ఉప ఎన్నికలు జరగనున్న జిల్లాలు, నియోజకవర్గాల్లో ఓటర్లు కాని మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా అందరూ ఆదివారం సాయంత్రం 5 తరువాత స్వస్థలాలకు వెళ్లిపోవాలని ఆదేశించారు. ఆయా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో ఓటర్లు కాని వారెవరైనా ఉంటే బయటకు పంపించాల్సిందిగా జిల్లా ఎస్పీలను ఆదేశించినట్టు చెప్పారు. ఇందుకోసం హోటళ్లు, అతిథి గృహాలు, కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్స్, రెసిడెన్షియల్స్ స్కూళ్ల వంటి వాటిని తనిఖీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామన్నారు. 

ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా కూడా ఆదివారం సాయంత్రం 5 తర్వాత ఎలాంటి ప్రచారమూ చేయరాదని స్పష్టం చేశారు. ఉప ఎన్నికలకు సంబంధించి ఎలక్ట్రానిక్ మీడియాలో ఎలాంటి చర్చాగోష్ఠులూ నిర్వహించరాదని సూచించారు. ఓటర్లందరూ నిర్భయంగా ఓటేసేందుకు అవసరమైన ప్రశాంత వాతావరణం కల్పిస్తామని తెలిపారు. నగదు, మద్యం వంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రశాంతంగా ఆలోచించి, నచ్చిన అభ్యర్థికి ఓటేయాల్సిందిగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 
Share this article :

0 comments: