సీబీఐపై ‘సుప్రీం’ కొరడా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐపై ‘సుప్రీం’ కొరడా

సీబీఐపై ‘సుప్రీం’ కొరడా

Written By news on Saturday, July 7, 2012 | 7/07/2012

‘మంచి మనిషికొక మాట... మంచి గొడ్డుకు ఓ దెబ్బ’ అంటారు. అత్యున్నత శ్రేణి దర్యాప్తు సంస్థగా భుజకీర్తులు తగిలించుకున్న సీబీఐకి మాత్రం హితవచనాలూ చెవికెక్కవు. ఎదురు దెబ్బలూ దాని వైఖరిలో మార్పు తీసుకురావు. శుక్రవారం మాయావతి ఆస్తుల కేసులో సర్వోన్నత న్యాయస్థానం మందలించాకైనా సీబీఐ సరైన తోవన నడుస్తుందేమోనన్న ఆశ కలగడానికి దాఖలాలేమీ లేవు. ఎందుకంటే, ఇలాంటి చీవాట్లు తినడం ఆ సంస్థకు ఇది మొదటిసారేమీ కాదు. 

బహుశా చివరిసారి కూడా కాకపోవచ్చు. సీబీఐ వ్యవహార శైలి ఎలా ఉంటుందో, పాలకుల చేతిలో పనిముట్టుగా ఎలా మారుతుందో సుప్రీంకోర్టు తీర్పు మరోసారి బొమ్మ కట్టిందంతే. తొమ్మిదేళ్లక్రితం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మాయావతి పనిచేసినప్పుడు తాజ్‌మహల్ పరిసరాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన తాజ్ కారిడార్ ప్రాజెక్టులో రూ.17 కోట్ల నిధులు దుర్వినియోగమయ్యా యన్నది ప్రధాన ఆరోపణ.

ఈ దుర్వినియోగంపై దర్యాప్తు జరపమని సుప్రీంకోర్టు సీబీఐని అప్పట్లో ఆదేశించింది. అయితే, ఎప్పటిలాగే కోర్టు ఆదేశాలను అడ్డం పెట్టుకుని సీబీఐ అత్యుత్సాహం ప్రదర్శించింది. తాజ్ కారిడార్ కేసు దర్యాప్తు ముసుగులో మాయావతిపై ఆదాయానికి మించి ఆస్తులున్న కేసును కూడా తగిలించింది. ఆమెను రకరకాలుగా వేధించడం మొదలుపెట్టింది. కేం ద్రంలో అధికారం చెలాయిస్తున్నవారి అభీష్టాన్ని నెరవేర్చడానికి బరితెగించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన 34 పేజీల తీర్పును చూస్తే సీబీఐ ఈ కేసులో ఆద్యంతమూ వ్యవహరించిన తీరు కళ్లకు కడుతుంది. 

తాజ్ కారిడార్ కేసు దర్యాప్తు జరపమని సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలమేరకు 2002లో మాయావతిపైనా, మరో 11మందిపైనా సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదుచేసింది. దీనిపై దర్యాప్తు మొదలెట్టి ఒక నివేదిక సైతం అందజేసింది. అయితే, ఆమె ప్రాసిక్యూషన్‌కు అవసరమైన అనుమతి గవర్నర్‌నుంచి లభించలేదన్న కారణంగా అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఆ నివేదికను తోసిపుచ్చింది. గవర్నర్ అనుమతించకపోవడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. చివరకు 2007లో తాజ్ కారిడార్ కేసులో ఆమెకు క్లీన్‌చిట్ కూడా వచ్చింది. మాయావతిని వేధించడానికి ఉపయోగిస్తుందనుకున్న కేసు కాస్తా ఇలా నీరుకారిపోవడం సీబీఐకిగానీ, దాన్ని అందరిపైనా ఉసిగొల్పడానికి అలవాటుపడిన కేంద్ర పాలకులకుగానీ ససేమిరా నచ్చలేదు. 

అందుకే సీబీఐ తనకిచ్చిన పరిమితులను అతిక్రమించింది. తన పరిధిని మించి వ్యవహరించింది. వెనక్కు వెనక్కు వెళ్లింది. 1995 నాటినుంచీ ఆమె ఆస్తులేమిటి... ఆమెకున్న ఆదాయవనరులేమిటి అన్న అంశాలపై దృష్టిసారించింది. 2003 నాటికి ఆమె ఎంత వెనకేసుకున్నారన్న అంశంపై దృష్టిపెట్టింది. అంతటితో ఊరుకోలేదు. ఆమెపై వేరే ఎఫ్‌ఐఆర్ కూడా దాఖలు చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దీన్నే తప్పుబట్టారు. 

మా ఆదేశాలేమిటో చదివారా, అవి అసలు అర్ధమయ్యాయా? అని నిలదీశారు. తాము 2003 సెప్టెంబర్‌లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం తాజ్ కారిడార్ ప్రాజెక్టు కేసు దర్యాప్తు మాత్రమే జరపాల్సి ఉండగా, మాయావతిపై విడిగా ఆస్తుల కేసు సృష్టించి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయమని ఎవరు చెప్పారని న్యాయమూర్తులు ప్రశ్నించారు. దర్యాప్తు చేస్తే చేశారు... తాజ్ కారిడార్‌కూ, ఈ ఆస్తుల పెరుగదలకూ ఉన్న లింకు ఏమైనా దొరికి ఉంటే దాన్ని మాకిచ్చిన నివేదికలో స్పష్టంగా చెప్పాలి కదా అని కూడా వారు నిలదీశారు. 

సొంతంగా ఆలోచించడం, స్వతంత్రంగా వ్యవహరించడం సీబీఐ ఎన్నడో మానేసిందని దాని చరిత్ర చూస్తేనే తెలుస్తుంది. కేంద్రాన్ని ఏలుతున్న పాలకుల అవసరాలను తీర్చడమే దాని ఏకైక ఎజెండా అన్నది ఏ కేసు చరిత్ర చూసినా వెల్లడయ్యే నిజం. పాలకులు చెబితే ఎంతటివారినైనా కేసులనుంచి తప్పించేయడం, పాలకులను వ్యతిరేకించినవారిని కేసులతో వేధించడం సీబీఐ ఒక కళగా అభివృద్ధి చేసుకుంది. 1988లో రాజీవ్‌గాంధీ తదితరులపై వచ్చిన బోఫోర్స్ కేసు ఇందుకు చక్కని ఉదాహరణ. 

ఈ స్కాంలో కీలక పాత్ర పోషించాడని వెల్లడైన రాజీవ్ కుటుంబ సన్నిహితుడు ఖత్రోచీని అందుబాటులో ఉన్నా అరెస్టుచేయక పోవడం, తీరా అతను దేశం విడిచి వెళ్లిపోయాక పట్టుకోవడం మావల్ల కాదంటూ కోర్టుకు చెప్పి విచారణ రద్దుచేయించడం ఇటీవలి చరిత్ర. పాతికేళ్లపొడవునా నడిచిన ఈ కేసు దర్యాప్తునకు రూ.300 కోట్ల ప్రజాధనం వృధా అయింది. ఇందిరా గాంధీ హత్య అనంతరం ఢిల్లీలో జరిగిన సిక్కుల ఊచకోతలో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు జగదీష్ టైట్లర్‌ను రక్షించడానికి సీబీఐ చేసిన విన్యాసాలు మరీ విచిత్రమైనవి. ఆ కేసులోని ప్రధాన సాక్షి కనబడటంలేదని కోర్టుకు అబద్ధం చెప్పిన సీబీఐ, ఆ వ్యక్తి ఆచూకీని మీడియా బయటపెట్టేసరికి అతను ఆధారపడదగిన సాక్షి కాదని కథ వినిపించింది. 

జేఎంఎం ముడుపుల కేసులో సీబీఐ వ్యవహరించిన తీరైనా, ములాయం కుటుంబంపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో యూపీఏ అవసరాలకు అనుగుణంగా స్వరం మారుస్తున్న వైఖరైనా, మన రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డిని, పలువురు పారిశ్రామిక వేత్తలను వేధిస్తున్న ఉదంతమైనా ఆ సంస్థ ప్రతిష్టను పాతాళానికి తీసుకెళ్లాయి. తాజాగా ఆదర్శ్ హౌసింగ్ స్కాంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌పై చార్జిషీటు దాఖలుచేసిన మర్నాడే అక్కడి జాయింట్ డెరైక్టర్ రుషిరాజ్ సింగ్‌ను బదిలీ చేసిన తీరు అది పాలకులకు కీలుబొమ్మగా ఎలా మారిందో చెప్పకనే చెబుతోంది. 

ఇక ఈ తరహా ప్రవర్తనను సాగనీయకూడదు. ఎప్పటినుంచో ప్రజాస్వామికవాదులు డిమాండ్ చేస్తున్నట్టుగా దాన్ని సర్కారీ అజ్మాయిషీనుంచి తప్పించి సీవీసీ పర్యవేక్షణలోకి తీసుకురావాలి. ఆ సంస్థకు వెన్నెముకనివ్వాలి. నిష్పాక్షికత, నిజాయితీ, తటస్థత వంటి పదాలకు అర్ధాలేమిటో దానికి తెలియ జెప్పాలి. ఎలా ఉండాలో, ఉండకూడదో తెలుసుకునేలా చేయాలి.
Share this article :

0 comments: