రైతుకేదీ భరోసా? విజయమ్మ ఆవేదన.. సహాయచర్యలకు ప్రధానికి విజ్ఞప్తి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతుకేదీ భరోసా? విజయమ్మ ఆవేదన.. సహాయచర్యలకు ప్రధానికి విజ్ఞప్తి

రైతుకేదీ భరోసా? విజయమ్మ ఆవేదన.. సహాయచర్యలకు ప్రధానికి విజ్ఞప్తి

Written By news on Thursday, July 5, 2012 | 7/05/2012

* రాష్ట్రంలో రైతులకు రుణాల్లేవు.. ఎరువులు, విత్తనాలు లేవు 
* సర్కారు వైఫల్యంతో రైతాంగం దయనీయ స్థితిలో ఉంది
*విత్తనాలుంటే వాటికి నీళ్లు లేవు.. బోర్లలో నీళ్లుంటే కరెంటు లేదు 
* రైతుకు బ్యాంకు రుణాలు లేవు.. సాగు పెట్టుబడికి దిక్కు లేదు 
* వైఎస్ హయాంలో రైతుకు ధీమా ఉండేది.. నేడు అది లేదు
* వైఎస్ హయాంలో ఎంతో ముందుచూపుతో ఏర్పాట్లు చేశారు 
*సీజన్‌లో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేవారు 
*బ్యాంకుల నుంచి సమయానికి రుణాలు అందేలా చూసేవారు 
*భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు పైసా పరిహారం ఇవ్వలేదు 
*ఈసారి ‘క్రాప్ హాలిడే’ ఇతర జిల్లాలకూ వ్యాపించే ప్రమాదం 
*స్వామినాథన్ సిఫారసులు అమలు చేయాలని ప్రధానిని కోరాం 
*గిట్టుబాటు ధరలు, ఇన్‌పుట్ సబ్సిడీ కల్పించాలని విజ్ఞప్తి చేశాం 
* జగన్ కేసులో సీబీఐ కక్ష సాధింపులపై ప్రధానికి వివరించాం
* భూకేటాయింపుల్లో తన ముందటి ప్రభుత్వాలు అనుసరించిన పద్ధతినే నాడు వైఎస్ అనుసరించారు 
* ఆ 26 జీవోలు తప్పయితే సంబంధితులంతా బాధ్యులే 
* కానీ వారినందరినీ వదిలిపెట్టి.. అసలు ప్రభుత్వంతో ఏ సంబంధంలేని జగన్‌ను ఎలా బాధ్యుడ్ని చేస్తారు? 
* హైకోర్టు ఆదేశాలిచ్చిన 24 గంటల్లో భారీ దాడులు చేసింది 
* చంద్రబాబు విషయంలో అసలు కదలికే లేదు 
* కక్ష సాధింపు ధోరణికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? 
* సీబీఐ జేడీ ప్రతీదీ ‘ఎల్లో మీడియా’కు లీక్ చేస్తున్నారు 
* సీబీఐ, జేడీ తీరుపై ‘సుప్రీం’ సిటింగ్ జడ్జితో విచారణ కోరాం 
*జైలులో జగన్ భద్రతకు ప్రమాదం పొంచివుంది 
* వైఎస్ కుమారుడిగా పుట్టటమే జగన్ చేసిన నేరమా? 
* ప్రధాని సావధానంగా విని సానుకూలంగా స్పందించారు 
* మీడియా సమావేశంలో వెల్లడించిన విజయమ్మ
*నేడు శరద్‌పవార్‌తో విజయమ్మ భేటీ 

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవటం వల్ల రైతాంగం అనేక అవస్థలు పడుతున్నదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘చాలా ప్రాంతాల్లో వర్షాలు కురవలేదు. వర్షాలు కురిసిన చోట విత్తనాలు దొరకటం లేదు. విత్తనాలు ఉంటే ఎరువులు అందుబాటులో లేవు. బోర్ల కింద సాగు చేసుకుందామనుకుంటే కరెంటు ఉండటం లేదు. బిందెలతో నీళ్లు పోసి పత్తి మొక్కలను బతికించుకునే దుస్థితి. మరోవైపు బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణాలు అందటం లేదు. పెట్టుబడికి దిక్కుతోచని దయనీయ పరిస్థితుల్లో రైతాంగం ఉంది. వైఎస్ ఉన్నప్పుడు వ్యవసాయ కార్యకలాపాలకు సంబంధించి ఎంతో ముందుచూపుతో వ్యవహరించేవారు. విత్తనాలు, ఎరువులు సీజన్‌లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకునేవారు. ముందస్తు రుణాలు మంజూరయ్యే ఏర్పాటు చేసేవారు. రైతుల్లో ఒక ధీమా ఉండేది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు’’ అని ఆమె పేర్కొన్నారు. 

‘‘రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనిది గత ఏడాది గోదావరి జిల్లాలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. ఈ సంవత్సరం ‘క్రాప్‌హాలిడే’ ఇతర జిల్లాలకు వ్యాపించే ప్రమాదం ఉంది. 2010-11 సంవత్సరంలో భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు చెల్లించాల్సిన పరిహారంలో ఒక శాతం కూడా చెల్లించలేదు’’ అని విమర్శించారు. వ్యవసాయ రంగంపై స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని, గిట్టుబాటు ధరలు కల్పించాలని, ఇన్‌పుట్ సబ్సిడీలు ఇవ్వాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కోరినట్లు విజయమ్మ తెలిపారు. ఆమె బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రిని ఆయన కార్యాలయంలో కలిశారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న దుస్థితిని ఆయనకు వివరించారు. 

అలాగే.. తన కుమారుడు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై కేసు విషయంలో సీబీఐ కక్షసాధింపు ధోరణి, జేడీ లక్ష్మీనారాయణ వ్యవహారశైలిపైనా ప్రధానికి ఫిర్యాదు చేశారు. జేడీ ఇస్తున్న లీకుల కారణంగా జైలులో జగన్ భద్రతకు ప్రమాదం ఉందని తన ఆందోళనను తెలియజేశారు. సీబీఐ, జేడీ తీరుపై సుప్రీంకోర్టు సిటింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించటంతో పాటు.. జైలులో జగన్‌కు భద్రత పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానితో 20 నిమిషాల పాటు భేటీ అయిన విజయమ్మ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. తాము చెప్పిన విషయాలన్నింటినీ ప్రధాని మన్మోహన్ సావధానంగా విన్నారని, సానుకూలంగా స్పందించారని ఆమె పేర్కొన్నారు. వైఎస్ కుటుంబం పట్ల సీబీఐ కక్షగట్టినట్లు వ్యవహరిస్తున్న తీరును విజయమ్మ మీడియాకు వివరించారు. 

ప్రభుత్వంలో పాత్ర లేని జగన్‌ను బాధ్యుడ్ని చేస్తారా? 
‘‘నిన్నమొన్నటిదాకా అభివృద్ధి, సంక్షేమాల విషయంలో దివంగత వైఎస్ రోల్‌మోడల్ అన్న కాంగ్రెస్ పెద్దలు.. నేడు ఆయన పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేరిస్తే నోరుమెదపటం లేదు. వైఎస్ పేరు ప్రస్తావకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయలేదు. భూముల కేటాయింపుల్లో వైఎస్ హయాంకన్నా ముందున్న ప్రభుత్వాలు అనుసరించిన విధానాలనే వైఎస్ అనుసరించారు. భూ కేటాయింపుల విషయంలో అప్పట్లో వెలువడ్డ 26 జీవోలు తప్పు కావాలి? అలాంటప్పుడు ఆ జీవోల జారీతో ప్రమేయమున్న ప్రతి ఒక్కరూ బాధ్యులే అవుతారు. వారందరినీ వదిలేసి, ప్రభుత్వంలో ఎలాంటి పాత్రాలేని, ఒక్కసారి కూడా సెక్రటేరియెట్ గడప తొక్కని జగన్‌ను బాధ్యుడిని చేయటం ఎలా భావ్యం? వైఎస్ కొడుకుగా పుట్టటమే జగన్ చేసిన నేరమా?’’ అని ఆమె ఉద్వేగభరితంగా ప్రశ్నించారు. 

‘‘ఆ 26 జీవోలపై విచారణ కోరుతూ మాజీ మంత్రి శంకర్రావు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో 52వ ప్రతివాదిగా ఉన్న జగన్‌ను సీబీఐ తన చార్జిషీట్‌లో ప్రథమ నిందితుడిగా చేర్చటమే సీబీఐ కక్షసాధిస్తోందనటానికి నిదర్శనం. హైకోర్టు ప్రాథమిక విచారణకు ఆదేశించిన 24 గంటల్లోనే 28 బృందాలతో జగన్ ఇళ్లపైనా, జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారి ఇళ్లపైనా దాడులు నిర్వహించి సోదాలు చేశారంటే సీబీఐ ఎంత ముందస్తు ఏర్పాట్లలో ఉందో అర్థమవుతోంది. మిగతా కేసుల్లో కూడా సీబీఐ ఇలాగే వ్యవహరిస్తోందా?’’ అని ఆమె ప్రశ్నించారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విషయంలో కోర్టు ఆదేశాలు ఇచ్చాక నెల రోజులైనా సీబీఐ దర్యాప్తు చేపట్టలేదన్న విషయాన్ని విజయమ్మ ఈ సందర్భంగా గుర్తుచేశారు. 

జేడీ ‘లీకుల’తో జగన్ భద్రతకు ముప్పు... 
‘‘సీబీఐ దర్యాప్తు చేపట్టి పది నెలలు కావస్తోంది. పది నెలల పాటు మిన్నకుండి తీరా ఉప ఎన్నికల సమయంలో జగన్‌ను అరెస్టు చేయటం.. అదీ కోర్టు నుంచి సమన్లు అందుకున్నాక.. ఈ దశలో సీబీఐ అరెస్టు చేసే అవకాశమే లేదని, ముందస్తు బెయిల్ అవసరం లేదని కోర్టు అభిప్రాయాన్ని వెలిబుచ్చిన తర్వాత సీబీఐ జగన్‌ను అరెస్టు చేయటం.. కక్షపూరిత చర్యలో భాగం కాదా?’’ అని విజయమ్మ ప్రశ్నించారు. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ విచారణాంశాలనే కాకుండా జగన్‌ను ఏ వాహనంలో, ఏ దారిలో కోర్టుకు తీసుకొస్తారో కూడా ‘ఎల్లో మీడియా’కు ముందుగానే సమాచారం ఇస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇలా ముందస్తు లీకుల ద్వారా జగన్ భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని విజయమ్మ ఆందోళన వెలిబుచ్చారు. జెడ్ కేటగిరీ భద్రత ఉన్న జగన్‌ను మామూలు వాహనంలో జైలుకు తరలించటం, జైలులో ఎప్పుడు కరెంట్ ఉండదో ముందుగానే బయటకు పొక్కటం లాంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. 

సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా ఆయన ‘లీకుల’ వ్యవహారాన్ని మేం బయట పెడితే.. లక్ష్మీనారాయణపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సింది పోయి.. ఆ కాల్ లిస్ట్ సేకరించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని విజయమ్మ విమర్శించారు. ఇప్పటివరకూ 2,000 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి ఫోన్లను సీబీఐ ట్యాప్ చేసిందన్నారు. సీబీఐ నియమ నిబంధనలన్నింటికీ తిలోదకాలిచ్చి, వైఎస్ కుటుంబంపైన, జగన్‌పైనా విచారణ పేరుతో కక్షసాధింపు ధోరణిలో వ్యవహరిస్తున్న జేడీ లక్ష్మీనారాయణపై తగిన చర్యలు తీసుకోవాలని, జగన్‌కు తగు భద్రత కల్పించాలని ప్రధానిని కోరినట్లు విజయమ్మ తెలిపారు. ప్రధాని తమ అభ్యర్థనను సావధానంగా విని సానుకూలంగా స్పందించారని విజయమ్మ పేర్కొన్నారు.

రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతుపై ఇంకా నిర్ణయించుకోలేదు...
రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరికి మద్దతు ఇవ్వాలన్న అంశంపై ఇంకా నిర్ణయించుకోలేదని విజయమ్మ ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థులుగా ఉన్న సంగ్మా స్వయంగాను, ప్రణబ్ ఫోన్ ద్వారాను తమ పార్టీ మద్దతు కోరారని.. పార్టీలో చర్చించిన అనంతరం ఓ నిర్ణయం తీసుకుంటామని వారిద్దరికీ చెప్పామని ఆమె వివరించారు. పార్టీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోగానే ఆ విషయాన్ని మీడియాకు తెలియచేస్తామన్నారు. వైఎస్ మరణంపై ఉన్న అనుమానాల నివృత్తికి కూడా తగిన చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరినట్లు విజయమ్మ మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. మీడియా సమావేశంలో విజయమ్మతోపాటు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ ఎంపీ మైసూరారెడ్డి, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, శోభానాగిరెడ్డిలు పాల్గొన్నారు. 

నేడు పవార్, సీవీసీలతో భేటీ... 
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్‌పవార్‌తో గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అధికారులతో సాయంత్రం 5 గంటలకు విజయమ్మ భేటీ కానున్నారు. పవార్‌తో భేటీలో ముఖ్యంగా రాష్ట్ర రైతాంగ సమస్యలను ప్రస్తావించనుండగా, సీవీసీ అధికారులతో భేటీలో సీబీఐ దర్యాప్తు తీరు, జేడీ వ్యవహార శైలిని వివరించనున్నారు.





Share this article :

0 comments: