బాబు జమానాలోనే రాక్ ప్రవేశం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు జమానాలోనే రాక్ ప్రవేశం

బాబు జమానాలోనే రాక్ ప్రవేశం

Written By news on Wednesday, July 11, 2012 | 7/11/2012

వాన్‌పిక్‌కు అనుమతులకు ముందే జగన్ సంస్థల్లో ప్రసాద్ పెట్టుబడి పెట్టారు
వాటికి సీబీఐ వక్రభాష్యం చెబుతోంది
ప్రభుత్వం నష్టపోయిందనుకుంటే రాక్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి

హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలోనే రస్‌ఆల్‌ఖైమా(రాక్) ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టిం దని వాన్‌పిక్ సంస్థల అధినేత నిమ్మగడ్డ ప్రసాద్ తరఫున్యాయవాది ఉమామహేశ్వర్‌రావు సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. బెయిల్ మంజూరు చేయాలంటూ నిమ్మగడ్డ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు మంగళవారం విచారించారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు స్వయంగా దుబాయ్‌కి వెళ్లి రస్‌ఆల్‌ఖైమాను రాష్ట్రానికి ఆహ్వానించారని కోర్టుకు ఉమామహేశ్వర్‌రావు నివేదిం చారు. వాన్‌పిక్ కంపెనీలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయకముందే నిమ్మగడ్డ జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని తెలిపారు. 

2008లో రస్‌ఆల్‌ఖైమా వాన్‌పిక్ ప్రాజెక్టును చేపట్టిందని, అంతకుముందే నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ సంస్థల్లో పెట్టుబడి పెట్టారని చెప్పారు. ఏ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలన్నది వ్యాపారవేత్తల ఇష్టమని చెప్పారు. జగన్ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ పెట్టుబడులు ముడుపులని సీబీఐ ఆరోపిస్తోందని వివరించారు. రాక్ రాయితీ ఒప్పందాన్ని అన్ని శాఖలు పరిశీలించి, మంత్రి మండలికి సిఫార్సు చేసిన తర్వాత... అన్ని అంశాలపైనా చర్చించిన తర్వాతే ఈ ప్రాజెక్టుకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని వివరించారు. లాభాలను ఆర్జించాలనే ఉద్దేశంతోనే జగన్ సంస్థల్లో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులు పెట్టారని, తర్వాత అనుకోకుండానే ప్రభుత్వంతో నిమ్మగడ్డ సంస్థలకు ఒప్పందాలు జరిగాయని తెలిపారు. దీనికి సీబీఐ వక్రభాష్యం చెబుతోందని, పరస్పరం లబ్ధి పొందడం ద్వారానే పెట్టుబడులు వచ్చాయని ఆరోపిస్తోందని చెప్పారు.

పెట్టుబడులు పెట్టడమే ఆయన వ్యాపారం: ప్రైవేటు రంగాల్లో పెట్టుబడులు పెట్టడమే నిమ్మగడ్డ ప్రసాద్ వ్యాపారమని ఉమామహేశ్వర్‌రావు చెప్పారు. కేర్ ఆసుపత్రితోపాటు మా టీవీలో కూడా ఆయన పెట్టుబడులు పెట్టారని తెలిపారు. 2008లో రాష్ట్ర ప్రభుత్వానికి రాక్ ప్రభుత్వంతో ఒప్పందం జరిగిందని, మన దేశం నుంచి వ్యాపార భాగస్వామిని తీసుకోవచ్చని ఆ ఒప్పందంలో ఉందని తెలిపారు. తర్వాతే రాక్‌తో వాన్‌పిక్‌కు ఒప్పందం జరిగిందన్నారు. పారిశ్రామికవాడ లేకుండా ఓడరేవును ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పారిశ్రామికవాడకు అనుమతి ఇచ్చిందన్నారు. దీంతో ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం భావించిందని వివరించారు. ఈ ప్రాజెక్టులో ప్రభుత్వం పెట్టుబడి పెట్టలేదని, ప్రభుత్వానికి ఒక్కపైసా నష్టం లేదని చెప్పారు. రాక్‌కు ప్రభుత్వం సెంటు భూమిని కూడా ఉచితంగా ఇవ్వలేదని, వాన్‌పిక్ భూములకు పరిహారం ఇచ్చి కొనుగోలు చేసిందని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ఒకవేళ ప్రభుత్వం నష్టపోయిందని భావించినా.., అందుకు రాక్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సి ఉంటుందని నివేదించారు. ఫార్మా రంగంలో నిమ్మగడ్డ ప్రసాద్ వ్యాపార దక్షతను చూసే రాక్ ఆయన్ని భాగస్వామిగా చేర్చుకుందని, పారిశ్రామికవేత్తగా నిమ్మగడ్డ గురించి అందరికీ తెలుసునని అన్నారు. 2000 సంవత్సరంలో రూ.3 కోట్ల పెట్టుబడితో ఓ ఫార్మా కంపెనీని కొనుగోలు చేసి, దానిని ఓ మంచి సంస్థగా అభివృద్ధి చేసి 2006లో రూ.6,200 కోట్లకు దానిని అమ్మిన చరిత్ర నిమ్మగడ్డదని తెలిపారు. ఈ డబ్బుతో 60 కంపెనీలను పెట్టి వేలాది మందికి ఉపాధి కల్పించారని నివేదించారు. రూ.200 కోట్లు ఆదాయ పన్నుగా చెల్లించారని తెలిపారు. ఆయన వాదనలు కొనసాగుతుండగానే కోర్టు సమయం ముగియడంతో విచారణను శుక్రవారానికి వాయిదావేశారు.
Share this article :

0 comments: