జగన్ రిమాండ్ 11 వరకు పొడిగింపు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ రిమాండ్ 11 వరకు పొడిగింపు

జగన్ రిమాండ్ 11 వరకు పొడిగింపు

Written By news on Wednesday, August 29, 2012 | 8/29/2012

తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సహా ఇతర నిందితుల రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు సెప్టెంబర్ 11 వరకు పొడిగించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య, వాన్‌పిక్ సంస్థల అధినేత నిమ్మగడ్డ ప్రసాద్, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, ఐఆర్‌ఏఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డిల రిమాండ్‌ను కూడా 11 దాకా పొడిగించింది. రిమాండ్ గడువు ముగియడంతో మంగళవారం వీరందరినీ చంచల్‌గూడ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు దుర్గాప్రసాద్‌రావు ఎదుట హాజరుపరిచారు. మరోవైపు.. జగన్ సంస్థల్లో పెట్టుబడుల కేసులో సీబీఐ సమర్పించిన మూడు చార్జిషీట్లలో నిందితులుగా ఉన్న ఆడిటర్ విజయసాయిరెడ్డి, జగతి, జనని తరఫున కంపెనీ సెక్రటరీ సీపీఎన్ కార్తీక్‌తోపాటు ఇతర నిందితులు హాజరయ్యారు. హెటెరో, అరబిందో, రాంకీ సంస్థల ప్రతినిధులు కూడా మంగళవారం కోర్టు ఎదుట హాజరయ్యారు. వీరి హాజరును నమోదు చేసుకున్న న్యాయమూర్తి... ఈ మూడు చార్జిషీట్లకు సంబంధించిన విచారణను సెప్టెంబర్ 11కి వాయిదా వేశారు.

ఎమ్మార్ నిందితుల రిమాండ్ పొడిగింపు: ఎమ్మార్ కేసులో నిందితులు బీపీ ఆచార్య, సునీల్‌రెడ్డి, విజయరాఘవల రిమాండ్‌ను కూడా సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు దుర్గాప్రసాద్‌రావు సెప్టెంబర్ 11 వరకు పొడిగించారు. ఎమ్మార్ కేసులో ఇటీవలే బెయిల్‌పై విడుదలైన కోనేరు ప్రసాద్, ఎమ్మార్ ఎంజీఎఫ్ ప్రతినిధులు మంగళవారం జడ్జి ఎదుట హాజరయ్యారు.

ఓఎంసీ నిందితుల రిమాండ్ పొడిగింపు: ఓఎంసీ కేసులో గాలి జనార్దన్‌రెడ్డి సహా ఇతర నిందితుల రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు సెప్టెంబర్ 11 వరకు పొడిగించింది. ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మి అనారోగ్యం కారణంగా కోర్టులో హాజరుకాలేదు. ఇదిలా ఉండగా.. చార్జిషీట్‌లో పేర్కొన్న కొన్ని పత్రాలను ఇప్పటికీ తమకివ్వలేదని శ్రీలక్ష్మి, శ్రీనివాసరెడ్డిల తరఫు న్యాయవాదులు న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. దీనిపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. నిందితుల తరఫు న్యాయవాదులు కోరిన డాక్యుమెంట్లను వీలైనంత త్వరగా ఇవ్వాలని సీబీఐ తరఫు పీపీలను ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్ 11కి వాయిదా వేశారు. 
Share this article :

0 comments: