ప్రభుత్వంపై భగ్గుమన్న విద్యార్థి లోకం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రభుత్వంపై భగ్గుమన్న విద్యార్థి లోకం

ప్రభుత్వంపై భగ్గుమన్న విద్యార్థి లోకం

Written By news on Friday, August 10, 2012 | 8/10/2012


రీయింబర్స్‌మెంట్‌ను యథాతథంగా అమలు చేయాలని డిమాండ్
వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
కలెక్టరేట్ల ముందు ధర్నాలు.. రాస్తారోకోలు.. కలెక్టర్లకు వినతి పత్రాలు
సీఎం కార్యాలయం ముందు టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళన
మంత్రుల క్వార్టర్లను ముట్టడించిన విద్యార్థి సంఘాలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: పేద విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేస్తూ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగారుస్తున్న ప్రభుత్వ వైఖరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. బడుగులను పెద్ద చదువులకు దూరం చేస్తే సహించబోమని హెచ్చరించింది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మాదిరి పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేసింది. పథకంపై ప్రభుత్వ కుట్రలను నిరసిస్తూ గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో విద్యార్థిలోకం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. జిల్లాల్లో కలెక్టరేట్ల ముందు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి, ప్రభుత్వం తన తీరు మార్చుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. హైదరాబాద్ ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో వేలాది మంది విద్యార్థులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. రోడ్డుపై బైఠాయించి ‘‘పెద్ద చదువులు.. పేదల హక్కు’’ అంటూ నినదించారు.

పెరిగిన ఫీజులను ప్రభుత్వమే భరించాలని, దివంగత వైఎస్ హయాంలో కొనసాగించిన విధానాన్నే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పుత్తా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ... దివంగత మహానేత రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సాచ్యురేషన్ పద్ధతికి స్వస్తి చెప్పి.. శ్లాబు విధానాన్ని విద్యార్థులపై రుద్దాలని చూస్తే సహించేది లేదన్నారు. ఫీజుల విధానం పట్ల ప్రభుత్వ తీరు మారకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఫీజుల పథకానికి తూట్లు పొడిస్తే రాష్ట్రం అగ్ని గుండమవుతుందని ధర్నాలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పార్టీ శాసనసభా పక్షం ఉప నాయకురాలు మేకతోటి సుచరిత హెచ్చరించారు. కేవలం వైఎస్ ప్రవేశపెట్టారనే అక్కసుతోనే ఫీజుల పథకానికి తిలోదకాలిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ చర్యల కారణంగా విద్యా సంవత్సరం నష్టపోవాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ప్లీజ్.. మీ రాజకీయాలకు మా జీవితాల్ని బలిచేయొద్దు. ఫీజులు చెల్లించి మా చదువులను సాగనివ్వండి..’’ అంటూ పలువురు విద్యార్థులు గోడు వెల్లబోసుకున్నారు. విద్యార్థులకు మద్దతుగా ఈ ధర్నాలో మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి, సేవాదళం కన్వీనర్ కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, సీఈసీ సభ్యుడు రాజ్‌ఠాకూర్, ఐటీ విభాగం కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డి, ట్రేడ్ యూనియన్ కన్వీనర్ జనక్‌ప్రసాద్, పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలతోపాటు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ నేతలు ఉన్నత విద్యామండలి కార్యదర్శి సత్తిరెడ్డికి విజ్ఞాపన పత్రం అందజేశారు. తర్వాత రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి గోషామహల్‌కు తరలించారు. తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

కదం తొక్కిన జిల్లాలు..: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలంటూ మెదక్ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగం సంగారెడ్డిలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది. అనంతరం పార్టీ నాయకులు జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. విశాఖపట్నంలో కలెక్టరేట్ వద్ద పార్టీ చేపట్టిన ధర్నాలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో పార్టీ నేతలు, విద్యార్థులు ప్రధాన రహదారులపై రాస్తారోకోలు చేశారు. తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. కరీంనగర్‌లో కలెక్టరేట్ ఎదుట గంటపాటు ధర్నా నిర్వహించి, మోకాళ్లపై భిక్షాటన చేసి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. చిత్తూరులో పార్టీ నాయకులు విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో కలెక్టరేట్ వద్ద ధర్నా అనంతరం విద్యార్థులు హోటళ్లలో టీలు, మిర్చీలు అమ్ముతూ నిరసన తెలిపారు. కర్నూలు, అనంతపురం కలెక్టరేట్ల ముందు చేపట్టిన ధర్నాలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతలో జరిగిన ధర్నాలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు తోపుదుర్తి కవిత తదితరులు పాల్గొన్నారు.

సీఎం కార్యాలయం ముందు టీడీపీ ధర్నా: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని, ఫీజు మొత్తం ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు గురువారం ముఖ్యమంత్రి కార్యాలయం ముందు ధర్నా చేశారు. సచివాలయంలో సీఎం కార్యాలయం ఉండే సీ బ్లాక్ ప్రధాన ద్వారం ముందు కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు ఎమ్మెల్యేలను అరెస్టు చేసి తీసుకెళ్లారు. ధర్నాలో పాల్గొన్నవారిలో ఎమ్మెల్యేలు గాలి ముద్దుకృష్ణమ నాయుడు, బల్లి దుర్గాప్రసాద్, మండవ వెంకటేశ్వరరావు, బీదా మస్తాన్‌రావు, దేవినేని ఉమామహేశ్వరరావు, జి. జైపాల్‌యాదవ్, మల్లెల లింగారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, టి.ప్రకాశ్ గౌడ్ ఉన్నారు.

మంత్రుల క్వార్టర్ల ముట్టడి..: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎలాంటి షరతు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు గురువారం బంజారాహిల్స్‌లోని మంత్రుల క్వార్టర్లను ముట్టడించారు. అలాగే టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో సుమారు 50 మంది విద్యార్థులు రాజ్‌భవన్ ముట్టడికి యత్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ విధానాన్ని తప్పుబడుతూ టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వీరిని అడ్డుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
Share this article :

0 comments: