రైలు దుర్ఘటన దర్యాప్తుపై పెదవి విప్పని అధికారులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైలు దుర్ఘటన దర్యాప్తుపై పెదవి విప్పని అధికారులు

రైలు దుర్ఘటన దర్యాప్తుపై పెదవి విప్పని అధికారులు

Written By news on Wednesday, August 1, 2012 | 8/01/2012



నెల్లూరు, న్యూస్‌లైన్ ప్రతినిధి: తమిళనాడు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీ దగ్ధం ఘటన దర్యాప్తులో అధికారులు గోప్యత పాటిస్తున్నారు. ఆశాఖ ఉన్నతాధికారులు గానీ భద్రతా విభాగం అధికారులుగానీ వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు. సంఘటనప్రమాదమా? విద్రోహమా? అన్న అనుమానాలను తేల్చేం దుకు రంగంలోకి దిగిన ఫోరెన్సిక్ నిపుణులు కూడా.. అయ్యిం డొచ్చు, కాకపోవచ్చు అంటూ భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎస్- 11 బోగీలో పెద్ద పేలుడు శబ్దాలను విన్నట్టుగా మదన్‌లాల్ అనే ప్రత్యక్షసాక్షి వెల్లడించిన నేపథ్యంలో ఇది విద్రోహచర్య అనే అనుమానాలకు బలం చేకూరుతోంది. దగ్ఢమైన బోగీ ని మంగళవారం పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు మాత్రం పేలుడుకు సంబంధించి ఎలాంటిఆధారాలు లభ్యం కాలేదని అంటూనే ఇప్పటికిప్పుడే కొట్టిపారేయడానికి వీల్లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే అగ్నికీలల్లో చిక్కుకున్న బోగీలోని పదో నెంబరు బెర్తు కింద భాగంలో చిన్నపాటి పేలుడు సంభవించినట్టుగా ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఇక్కడే కొన్ని కాలిపోయిన బ్యాటరీలు,ల్యాప్‌ట్యాప్ కూడా లభ్యమయ్యాయి. లభ్యమైన బ్యా టరీలు, ల్యాప్‌టాప్‌లు ప్రయాణికులవై (సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు) ఉంటాయని అంతమాత్రాన ఏ విషయాన్నీ ఇప్పుడే ధ్రువీకరించడానికి కుదరదని నిపుణల బృందంలోని సభ్యులు రైల్వేశాఖ అధికారులకు తెలియజేశారు. 

రసాయనాలను వినియోగించి కూడా విస్ఫోటనం సృష్టించే అవకాశాలున్నాయని, ఆకోణంలో కూడా దర్యాప్తు చేయాల్సి ఉందని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు. బోగీలో మంగళవారం స్వాధీనం చేసుకున్న బాటిల్‌లో ఉన్నది కిరోసిన్‌కాదని, నీళ్లు మాత్రమేనని అధికారులు తేల్చినట్లు తెలి సింది. కాగా షార్ట్‌సర్క్యూట్ అయ్యేందుకు ఉన్న అవకాశాలను మరో బృందం పరిశీలిస్తోంది. నిపుణుల బృందంలో ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ అసిస్టెంట్ డెరైక్టర్ వెంకటేశ్వరరావు, సైంటిఫిక్ అధికారి గోపీనాధ్, నిపుణులు రాజశేఖర్, ఫణికుమార్ ఉన్నారు. కమిషనర్ ఆఫ్ సేఫ్టీ డీకే సింగ్ నెల్లూరులోనే మకాం వేసి పర్యవేక్షిస్తున్నారు. ఈ కేసును పోలీసుశాఖ నుంచి జీఆర్‌పీఎఫ్‌కు బదిలీ చేశారు. జీఆర్‌పీఎఫ్ అధికారులు మాత్రం కేసు దర్యాప్తు ఇప్పుడే ప్రారంభమైందని లోతుగా విశ్లేషించాల్సి ఉందని మాత్రమే సమాధానం చెబుతున్నారు. 2008లో గౌతమి ఎక్స్‌ప్రెస్ కూడా వరంగల్ జిల్లాలో ఇదేవిధంగా మంటల్లో చిక్కుకుంది. ఆ ఘటనకు సంబంధించిన నివేదిక ఇప్పటివరకు అధికారికంగా వెల్లడికాలేదు. ఇప్పుడు రైల్వే అధికారులు వ్యవహరిస్తున్న తీరును చూస్తే ఈ ఘటనలోని వాస్తవాలు కూడా మరుగున పడిపోతాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

నాలుగు నిమిషాల్లోనే దగ్ధమైందా?

తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రంగనాయకులపేట గేట్ దాటిన తర్వాత 20 నుంచి 30 కిలోమీటర్ల స్పీడుతో మాత్రమే వెళ్లినట్లు తెలిసింది. రైలు నిదానంగా వెళుతున్న సమయంలో కూడా మంటలను నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ సిబ్బంది ఎందుకు గుర్తించాలేక పోయారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గేటు దాటాక నాలుగు నిమిషాల్లో బోగీ మొత్తం దగ్ధమైందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అధికారులు ఈ దిశగా విచారణ జరపడం లేదు. బుధవారం పోలీసు, రైల్వే, రెవెన్యూ, వైద్యశాఖ అధికారులతో పాటు ఫోరెన్సిక్ నిపుణలు సమావేశం కానున్నారు.
Share this article :

0 comments: