వాన్‌పిక్‌పై బాబు వీధి నాటకం . - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వాన్‌పిక్‌పై బాబు వీధి నాటకం .

వాన్‌పిక్‌పై బాబు వీధి నాటకం .

Written By news on Thursday, August 9, 2012 | 8/09/2012

 వాన్‌పిక్‌పై బాబు వీధి నాటకం
* వాన్‌పిక్‌పై వాస్తవాలు దాచి బాబు రాద్ధాంతం
* 28 వేల ఎకరాలిచ్చారంటూ అడ్డగోలు ప్రచారం
* నిజాలకు గంతలు కడుతూ ధర్నాలు, యాత్రలు
* వాన్‌పిక్ ప్రతిపాదన వచ్చిందే బాబు హయాంలో
* భూ సంతర్పణల్లో అద్వితీయ రికార్డు కూడా ఆయనదే
* నిందలే.. నిజాలతో పనిలేదు
* వాన్‌పిక్‌పై వాస్తవాలు విస్మరిస్తున్న టీడీపీ
* 18 వేలకు బదులు 28 వేల ఎకరాలిచ్చారంటూ రాద్ధాంతం
* 18 వేల ఎకరాలు కేటాయించినా ఇప్పటిదాకా సేకరించింది 13 వేల ఎకరాలే
* అధికం అసైన్డ్ భూమి కావడంతో ప్రభుత్వానికి అప్పగించిన వాన్‌పిక్
* దాన్లో 6వేల ఎకరాల్ని ఇంకా వాన్‌పిక్‌కు లీజుకివ్వని సర్కారు
* ఈ జాప్యంతో టెండర్లు పిలిచినా మొదలుకాని పనులు
* 2 పోర్టులు, షిప్‌యార్డు, ఎయిర్‌పోర్ట్‌కు 6,800..
* పోర్టు ఆధారిత పరిశ్రమలకు 11,200 ఎకరాలు
* ఇవి వదిలి పోర్టుకు 28 వేల ఎకరాలిచ్చారంటున్న టీడీపీ
* రెండు పోర్టులు, ఎయిర్‌పోర్టు, షిప్‌యార్డు, సెజ్‌కు ఇచ్చింది 18 వేల ఎకరాలే
* రస్ అల్ ఖైమాతో ఒప్పందానికి ముందే జగతిలో నిమ్మగడ్డ పెట్టుబడి
* అయినా సరే వాన్‌పిక్ దక్కినందుకే పెట్టుబడి పెట్టారంటూ వితండ వాదన

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: గురివిందకు తన నలుపు తెలియదు. చంద్రబాబునాయుడికి తాను గతంలో చేసిన భూ కేటాయింపులు గుర్తుండవు. ఏ ప్రాజెక్టయినా పర్వాలేదు... ఏ కేటాయింపైనా పర్వాలేదు. అది వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిందయితే చాలు!! వీలైనంత రాద్ధాంతం చేయాలన్నదే ఇపుడాయన సిద్ధాంతం. అందుకని ఆ ప్రాజెక్టుకు సంబంధించిన నిజానిజాలతో ఆయనకు గానీ, ఆయన పార్టీ వారికి గానీ పని లేదు. ఆ ప్రాజెక్టు వస్తే జరగబోయే అభివృద్ధి కూడా వారికి అనవసరం. వారిక్కావాల్సిందల్లా రాజకీయ లబ్ధి! అందుకోసం రచ్చ చెయ్యటం! అంతే!!. అందుకే ఇపుడు టీడీపీ ఆందోళనల జాబితాలో ‘వాన్‌పిక్’ చేరింది. స్థానికంగా అనుకూల రాజకీయ పక్షాలతో రౌండ్‌టేబుల్ నిర్వహించిన టీడీపీ నేతలు... యాత్రలు కూడా మొదలుపెట్టారు. ఆ భూముల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ లేవనెత్తిన చంద్రబాబు... శుక్ర, శనివారాల్లో ‘వాన్‌పిక్’ స్థలాల వద్దకు స్వయంగా వెళుతున్నారు.

జరుగుతున్న తతంగం చూస్తుంటే చంద్రబాబు గానీ, టీడీపీగానీ వాన్‌పిక్‌కు సంబంధించిన నిజాల్ని కావాలనే విస్మరిస్తున్నారన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే దీనికి కేటాయించిన భూమి విషయంలో రాజకీయ పక్షాలన్నీ తప్పుడు లెక్కలే చెబుతూ వస్తున్నాయి. పెపైచ్చు అది ప్రభుత్వ భూమి కాదన్న విషయం బయటకు రానీయకుండా... సర్కారుకు తీరని నష్టం జరిగిందంటూ డిమాండ్లు చేస్తున్నాయి. సాధారణ రాయితీలపైనా గగ్గోలు పెడుతున్నాయి. మరి దీన్లో నిజానిజాలేంటి? అసలు ఈ ప్రాజెక్టును వైఎస్ కాకుండా వేరొకరెవరైనా కేటాయించి ఉంటే ఈ పార్టీలన్నీ ఇలాగే రచ్చ చేసేవా? జగన్‌మోహన్‌రెడ్డి తిరుగులేని రాజకీయ నాయకుడిగా ఎదగకుండా ఉంటే వీరు ఈ అంశాన్ని ఇంతలా పట్టించుకునేవారా? అభివృద్ధిని అడ్డుకుంటూ పోతే ఇది ఎంతవరకూ వెళుతుంది? కావాలంటే దీన్లో నిజానిజాలు మీరే చూడండి...


వాడరేవు అండ్ నిజాంపట్నం పోర్ట్స్ ఇండస్ట్రియల్ కారిడార్. ఇదే వాన్‌పిక్. అంటే వాడరేవులో ఒకటి, నిజాంపట్నంలో ఒకటి చొప్పున రెండు పోర్టులు, షిప్‌యార్డు, విమానాశ్రయం, పరిశ్రమల కారిడార్. ఇవన్నీ కలిస్తేనే వాన్‌పిక్. దీనికోసం ప్రభుత్వం వివిధ జీవోల ద్వారా సేకరించడానికి అనుమతించిన భూమి 22,990 ఎకరాలు. అంటే 23వేల ఎకరాలు. కాకపోతే ఆయా జీవోల్లో పేర్కొన్న ప్రాంతాల్లో అటవీ భూములు, పర్యావరణ పరంగా ఇబ్బందులు ఎదురయ్యే ఇతర భూములు గనక ఉంటే వాటిని మినహాయించాలని జీవోల్లో స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో అలాంటి భూముల్ని సేకరించటం లేదని తెలియజేస్తూ వాన్‌పిక్ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి లేఖలు పంపింది.

ఈ లెక్కన సదరు జీవోల ప్రకారం నికరంగా సేకరించడానికి వీలైన భూమి 18,000 ఎకరాలు. స్పష్టంగా చెప్పాలంటే వాన్‌పిక్‌కు ప్రభుత్వం వివిధ జీవోల ద్వారా కేటాయించిన భూమి అక్షరాలా ఈ పద్దెనిమిది వేల ఎకరాలే. ఈ 18వేల ఎకరాల్లో కూడా వాన్‌పిక్ ఇప్పటిదాకా సేకరించింది 12,973 ఎకరాలు. వాన్‌పిక్ సేకరించిన భూమిలో ప్రభుత్వ భూమి కేవలం 174 ఎకరాలు. పట్టా భూమి 1,480 ఎకరాలు. మిగిలినదంతా అసైన్డ్ భూమే. అంటే ఇప్పటికే ప్రభుత్వం వివిధ వర్గాల వారికి ఉచితంగా కేటాయించిన భూమి.

దాన్ని తగిన ధర చెల్లించి సేకరించిన వాన్‌పిక్... అసైన్డ్ భూముల్ని తాను తీసుకోవటానికి వీల్లేదు కనక తిరిగి ప్రభుత్వానికి అప్పగించింది. ప్రభుత్వం వాటిని వాన్‌పిక్‌కు తిరిగి లీజుకివ్వాల్సి ఉంటుంది. నిజానికి ఇలా 12,973 ఎకరాలు సేకరించి ప్రభుత్వానికి వాన్‌పిక్ అప్పగించగా... దాన్లో 6,418 ఎకరాలను మాత్రమే ప్రభుత్వం వాన్‌పిక్‌కు అప్పగించింది. మిగిలిన భూమిపై తాత్సారం చేస్తూ ఉండటంతో, దాన్లో పోర్టులకు సంబంధించిన భూమి ఉండటంతో ప్రాజెక్టుకు టెండర్లు పిలిచి కూడా మొదలుపెట్టలేకపోతున్నట్లు వాన్‌పిక్ పేర్కొంటోంది. మొత్తమ్మీద ఎకరాకు కనిష్టంగా 1.2 లక్షల నుంచి గరిష్టంగా రూ.5 లక్షలు వెచ్చించి వాన్‌పిక్ సంస్థ భూముల్ని కొనుగోలు చేసింది. ఇందుకోసం దాదాపు రూ.450 కోట్లు ఖర్చుపెట్టింది. అంటే మొత్తమ్మీద సగటున ఎకరాకు రూ.3.5 లక్షలు ఖర్చుచేసింది.

ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఒక్కటే
భూముల వివరాలన్నీ ఇంత స్పష్టంగా ఉన్నపుడు అటు చంద్రబాబు గానీ, ఇటు తెలుగుదేశం పార్టీ గానీ 28,000 ఎకరాల్ని వాన్‌పిక్‌కు కట్టబెట్టారంటూ ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయి? అసలు 28వేల ఎకరాలనే సంఖ్య ఎక్కడి నుంచి వచ్చింది? ఒకే పోర్టుకు అన్నివేల ఎకరాల్ని ఇచ్చేశారని చెబుతున్న చంద్రబాబునాయుడికి ఆ 18వేల ఎకరాల్ని కేటాయించింది ఒక పోర్టుకు కాదని, అక్కడ రెండు పోర్టులు, షిప్‌యార్డు, విమానాశ్రయం, పారిశ్రామిక కారిడార్ వస్తాయని తెలియదా? ఇదంతా రాజకీయం కోసమే చేస్తున్నారనటానికి ఇంకా నిదర్శనమేం కావాలి?

బాబు రాయితీల వెల్లువ ఇదీ..
హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కోసం జీఎంఆర్ సంస్థకు చంద్రబాబు ప్రభుత్వం హైదరాబాద్ సమీపంలో విలువైన 5,500 ఎకరాల్ని కేటాయించింది. దీంతో పాటు వడ్డీ లేకుండా రూ.315 కోట్ల రుణాన్ని సమకూర్చింది. మరో రూ.107 కోట్లను అడ్వాన్స్‌డ్ డెవలప్‌మెంట్ గ్రాంట్‌గా అందజేసింది. ఇవన్నీ చేసి కూడా... తొలి ఎనిమిదిన్నర ఏళ్ల పాటు లీజు మొత్తాన్ని చెల్లించకుండా మినహాయింపునిచ్చింది. గంగవరం పోర్టు కోసం 2,800 ఎకరాల్ని బాబు కేటాయించారు.

దీంలో 1,400 ఎకరాలు విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి తీసుకుని మరీ ఇచ్చారు. దీన్లో 1,800 ఎకరాల్ని రాష్ట్ర ప్రభుత్వ వాటాగా (ఈక్విటీ), మిగిలిన భూమిని లీజు పద్ధతిలోనూ సమకూర్చారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇచ్చిన భూమికి కట్టిన విలువెంతో తెలుసా? కేవలం ఎకరం రూ.2.86 లక్షలు. విశాఖపట్నానికి కూతవేటు దూరంలో స్టీల్‌ప్లాంట్లో భాగంగా ఉన్న ఈ భూములకు అప్పట్లోనే ఎకరా ధర రూ.50 లక్షలకు తక్కువ కాకుండా ఉండేది. అలాంటి చోట ఎకరా కేవలం 2.86 లక్షలకే ఇచ్చిన ఘనత బాబుది.

ప్రస్తుత ప్రభుత్వానిదీ ఇదే తీరు...
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఇటీవలే మచిలీపట్నం పోర్టు కోసం నవయుగ సంస్థకు 5,324 ఎకరాల భూమిని లీజు పద్ధతిలో కేటాయించటానికి అంగీకరించింది. దీంతో పాటు రూ.355 కోట్ల ఆర్థిక సాయం చేయాలని కూడా ప్రతిపాదించింది. నిజానికి ఈ పోర్టుకు గతంలో టెండర్లు పిలిచినపుడు రామలింగ రాజుకు చెందిన మేటాస్ ఇన్‌ఫ్రా దక్కించుకుంది. తరువాతి పరిస్థితుల నేపథ్యంలో దాన్ని రద్దు చేసి నవయుగ సంస్థను ఎంపిక చేశారు.

చంద్రబాబు ఒక ఎయిర్‌పోర్టుకు 5,500 ఎకరాలిచ్చారు. అదీ హైదరాబాద్ సమీపంలో. పోర్టుకు 2,800 ఎకరాలిచ్చారు. విశాఖ నగరంలో. కిరణ్ కుమార్ రెడ్డి మరో పోర్టుకు 5,324 ఎకరాలిచ్చారు. అవేవీ తప్పు కానపుడు వైఎస్ ప్రభుత్వం రెండు పోర్టులు, ఒక ఎయిర్‌పోర్టు, షిప్‌యార్డు, పారిశ్రామిక కారిడార్‌కు కలిపి 18,000 ఎకరాలివ్వటం ఏ విధంగా తప్పు?

చంద్రబాబు హయాంలోనే ప్రతిపాదన..
వాడరేవు పోర్టు నిర్మాణ ప్రతిపాదనలు 1999లో బాబు హయాంలోనే వచ్చాయి. ఈ మేరకు ఆంధ్రా సీపోర్ట్స్ లిమిటెడ్‌తో బాబు కన్సెషన్ ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. కానీ అది లాభసాటి కాదన్న కారణంతో ఆ సంస్థ వెనుకంజ వేసింది. చివరకు 2005లో ఒప్పందాన్ని రద్దు చేశారు. తరవాత చెక్ రిపబ్లిక్‌కు చెందిన ‘స్కోడా’ సంస్థ ముందుకొచ్చింది. 2006లో ఈ కంపెనీతో ప్రభుత్వం ఎంఓయూ కూడా కుదుర్చుకుంది. కానీ 2007 వరకూ దీన్లో ఎలాంటి పురోగతీ లేకపోవటంతో చివరకు ఎంఓయూ రద్దు చేసింది.

ఆ స్థానంలో రస్ అల్ ఖైమా ప్రభుత్వం ముందుకు రాగా... దాంతో ప్రభుత్వం వాన్‌పిక్ కోసం ఒప్పందం చేసుకుంది. రస్ అల్‌ఖైమా తన భారత భాగస్వామిగా తనకు యాదృచ్ఛికంగా కలిసిన, అప్పటికే పారిశ్రామిక వేత్తగా అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించిన నిమ్మగడ్డ ప్రసాద్‌ను ఎంచుకుంది. ఆయనకు చెందిన ‘మ్యాట్రిక్స్ ఎన్‌పోర్ట్స్’తో ఒప్పందం చేసుకుంది. జరిగింది ఇదైతే.. మ్యాట్రిక్స్‌కు వైఎస్ కావాలనే భూముల్ని కేటాయించారని విమర్శలు చేస్తుండటం సమంజసమా?

‘బూట్’ మార్చారంటూ అడ్డగోలు వాదన...
ఈ ప్రాజెక్టును తొలుత బిల్ట్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (బూట్) పద్ధతిలో ప్రతిపాదించారని, తరవాత దాన్ని బిల్ట్ ఆపరేట్ ఓన్(బూ) పద్ధతికి మార్చారని వివిధ పక్షాలు చెబుతున్నాయి. ఇలా మార్చటంలోనే అప్పటి ప్రభుత్వం చేసిన కుట్ర దాగి ఉందంటూ సీబీఐ కూడా వాదిస్తోంది.

దీన్లో నిజానిజాలేంటో చూద్దాం...
బూట్ అంటే లీజు గడువు ముగిశాక తిరిగి ప్రభుత్వానికి అప్పగించటం. బూ అంటే లీజు గడువేదీ ఉండదు. వాన్‌పిక్‌లో పోర్టులు, షిప్‌యార్డు, విమానాశ్రయం బూట్ పద్ధతిలోనే ప్రతిపాదించారు. ఇప్పటికీ బూట్ పద్ధతిలోనే ఉన్నాయి కూడా. అంటే వీటిని నిర్మించి, నిర్వహించి, లీజు గడువు ముగిశాక ప్రభుత్వానికి అప్పగిస్తారు. ఇక పారిశ్రామిక కారిడార్ విషయానికొస్తే దాన్ని మొదట్లో ‘బూట్’ అని గానీ, ‘బూ’ అని గానీ పేర్కొనలేదు. కన్సెషన్ ఒప్పందంలో దాన్ని ‘బూ’ పద్ధతిలో ఇస్తున్నట్లుగా పేర్కొన్నారన్నది సీబీఐ వాదన. నిజానికి ఏ సెజ్‌గానీ, ఏ ఇండస్ట్రియల్ కారిడార్ గానీ బూట్ పద్ధతిలో ఉండదు.

ఎందుకంటే లీజు గడువు ముగిశాక తిరిగి ప్రభుత్వానికి అప్పగించే ప్రాతిపదికన ఏ కంపెనీ కూడా తన యూనిట్‌ను ఏర్పాటు చేయటానికి ముందుకు రాదు. ఇది చంద్రబాబుకు గానీ, సీబీఐకి గానీ తెలియక కాదు. ఎందుకంటే విశాఖ ఫార్మాసిటీ విషయంలో చంద్రబాబు నాయుడు తొలుత ‘బూట్’ పద్ధతిలోనే టెండర్లు పిలిచారు. ఏ ఒక్కరూ రాకపోయేసరికి దాన్ని ‘బూ’ పద్ధతికి మార్చారు. అప్పుడు రాంకీ సంస్థ ముందుకు రాగా... దానికి భూమిని కట్టబెట్టారు. ఈ విషయాన్ని జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడుల కేసుకు సంబంధించి దాఖలు చేసిన 3వ చార్జిషీట్లో సీబీఐ కూడా వివరంగా పేర్కొంది. కాకపోతే అప్పుడు చంద్రబాబు చేసిన చర్య దానికి తప్పుగా కనిపించలేదు. వాన్‌పిక్ విషయంలో మాత్రం అది తీవ్ర నేరంగా కనిపిస్తుండటం గమనార్హం.

భూ విక్రయదారులకు చెల్లించినదెంత?
భూముల్ని విక్రయించిన వారికి చెల్లించిన మొత్తంపై రాజకీయ పక్షాలు, సీబీఐ చేస్తున్న వాదన ఒకలా ఉండగా... వాన్‌పిక్ వాదన మరొకలా ఉంది. ‘‘ఒక సర్వే నంబర్లో ఒక వ్యక్తికి ఎకరాకు రూ.3.9 లక్షలు చెల్లించినట్లుగా వాన్‌పిక్ రికార్డుల్లో పేర్కొంది. కానీ అక్కడికెళ్లి సదరు వ్యక్తిని నేరుగా అడిగితే తనకు రూ.1.9 లక్షలే వచ్చిందని చెబుతున్నాడు.

మరి మిగిలిన 2 లక్షలు ఎక్కడికెళ్లాయి? ఇది తేలాలి’’ అంటోంది సీబీఐ. అయితే తాము సేకరించినవన్నీ అసైన్డ్ భూములని, ఈ రకం భూముల్లో తొలి అసైనీ ఒకరైతే దాన్ని బదిలీ చేసుకున్న వ్యక్తి మరొకరని, వాస్తవంగా ఆ భూమిని అనుభవిస్తున్నది మరొకరని... అలాంటపుడు తాము ఆ ముగ్గురికీ ఎంతో కొంత మొత్తం చెల్లిస్తే తప్ప వారు సంతకం చేయని పరిస్థితి ఉండేదని వాన్‌పిక్ చెబుతోంది. ‘‘అలాంటి పరిస్థితుల్లో ఆ ముగ్గురికీ ఎంతో కొంత చెల్లించటం జరిగింది. అలా చెల్లించిన ప్రతి పైసానూ రికార్డుల్లో చూపించాం. ప్రతి పైసాకూ లెక్కలున్నాయి’’ అని వాన్‌పిక్ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. పోనీ వీరిద్దరి వాదనల్లోనూ వైరుధ్యాలున్నాయనే అనుకుందాం.

మరి వాన్‌పిక్ వద్ద ప్రతి పైసాకూ లెక్కలున్నాయని చెబుతున్నపుడు... సదరు భూమి కోసం నిజంగా ఎంతమందికి ఎంత మొత్తం చెల్లించారన్నది ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవటం కష్టమా? నేరుగా ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తే ఎవరికివారు వచ్చి నిజం చెప్పకుండా ఉంటారా? మరి సర్కారు ముందు ఇలాంటి మార్గం ఉన్నపుడు అవేమీ చేయకుండా ఆరోపణలు మరింత ముదరటానికి, అపోహలు తీవ్రమవటానికి ఎందుకు కారణమవుతోంది?

ఇదీ.. రైతుల మాట
అమ్ముకొని బాగుపడ్డాం
మా ప్రాంతంలో అన్నీ బీడు భూములు. సాగుకు పనికి రావు. ఎంతకాలం ఎదురుచూసినా ఆ భూముల్లో నీటి వసతి ఏర్పాటయ్యే అవకాశం లేదు. వాన్‌పిక్ సంస్థ నాకున్న పదెకరాలను కొనుగోలు చేసింది. రూ.30 లక్షలు ఇచ్చింది. వాటితో రొయ్యల చెరువులను కొనుగోలు చేసి సాగు చేస్తున్నాం. ఆర్థికంగా నిలదొక్కుకున్నాం. మా ఇద్దరి కుమారులకు వాన్‌పిక్ ఆఫీసులో ఉద్యోగాలు ఇచ్చారు. వాన్‌పిక్ సంస్థ రాకుంటే మాకు అన్యాయం జరుగుతుంది.
- వడ్లమూడి సామ్రాజ్యం, గొల్లపాలెం,
మోటుపల్లి పంచాయతీ, చినగంజాం మండలం

అభివృద్ధి కుంటుపడింది
వాన్‌పిక్ వారు భూములను కొనుగోలు చేయడం ద్వారా మా ప్రాంతంలో కుటుంబాలు బాగుపడ్డాయి. కేవలం వేలు ఖరీదు చేసే భూముల వల్ల లక్షల్లో ఆర్జించాం. వాన్‌పిక్‌కు భూములు అమ్మడం వలన స్థానికులు నష్టపోయారు అనే మాట పూర్తిగా అవాస్తవం. కొద్దిమంది తమ స్వార్థం కోసం వాన్‌పిక్‌తో నష్టం వస్తుందని లేనిపోని ప్రచారాలు సృష్టిస్తున్నారు. వాన్‌పిక్ వచ్చి ఉంటే స్థానిక యువకులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దొరకడంతో పాటు ఈ ప్రాంతం అభివృద్ధి జరిగేది.

- మీసాల ఏడుకొండలు,
కొత్తరెడ్డిపాలెం, వేటపాలెం మండలం

ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందా?
ఒప్పందం ప్రకారం 18 వేల ఎకరాలనూ సేకరించాల్సింది వాన్‌పిక్ సంస్థే. దీన్లో ప్రభుత్వ భూమి 174 ఎకరాలే. మిగిలినదాంట్లో అత్యధికం ప్రభుత్వం వివిధ వర్గాలకు కేటాయించిన అసైన్డ్ భూమి. దానికి తగిన పరిహారం చెల్లించి, కొనుగోలు చేసి తిరిగి ప్రభుత్వానికే అప్పగిస్తుంది వాన్‌పిక్. దాన్ని తిరిగి ప్రభుత్వం ఈ సంస్థకు కేటాయించాలి. ఇదో వినూత్న పద్ధతి. కేటాయించేది కూడా ప్రభుత్వ భూమి కాదు కనుక ప్రభుత్వం నష్టపోయేదేమీ ఉండదు. పెపైచ్చు వాన్‌పిక్ చెబుతున్న దాని ప్రకారం మొత్తం 18 వేల ఎకరాల్లో వారు సేకరిస్తున్న పట్టాభూములు 3,400 ఎకరాలు. దాదాపు 20 శాతం. దీన్నిబట్టి నిరాశ్రయుల సంఖ్య సాధ్యమైనంత తక్కువగా ఉండటానికి అప్పటి ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుందన్నది తెలియకమానదు. మరి దీన్లో ప్రభుత్వం నష్టపోయేదేముంది?

ప్రలోభాలకు గురి చేస్తున్నారు
వాన్‌పిక్‌కు భూములను అమ్మడం ద్వారా మేం సంతృప్తి చెందాం. అయితే, పలు ప్రజా సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీల వారు మా గ్రామాల్లోకి వచ్చి మీ భూములు మీకిప్పిస్తామని, అదనంగా డబ్బులు ఇప్పిస్తాం, మాకు అనుకూలంగా మాట్లాడండి అని ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలోకి వచ్చేవారిని నమ్మలేని పరిస్థితి.

- ప్రళయకావేరి రాములు,
రామచంద్రాపురం, వేటపాలె మండలం

మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చేవి
వాన్‌పిక్ భూముల కొనుగోలు ద్వారా మాకెలాంటి నష్టం జరగలేదు. భూములకు సంబంధించి మేం అడిగిన రేటు ఇచ్చారు. మా ప్రాంతంలో కుటుంబాలన్నీ లాభపడ్డాయి. వాన్‌పిక్ ఉంటే మా జీవితాలు ఇంకా అభివృద్ధి చెందేవి. మా పిల్లలకు భృతి దొరికేది.
- అప్పల నాగేశ్వరరెడ్డి, పాతరెడ్డిపాలెం,
పుల్లరిపాలెం పంచాయతీ, వేట పాలెం మండలం
Share this article :

0 comments: