శ్రీకాకుళంలో పోలీసుల దాష్టీకం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » శ్రీకాకుళంలో పోలీసుల దాష్టీకం

శ్రీకాకుళంలో పోలీసుల దాష్టీకం

Written By news on Saturday, September 1, 2012 | 9/01/2012

- రోడ్డుపై ఈడ్చివేసి దుర్భాషలాడిన మహిళా ఎస్‌ఐ నారీమణి 
- ప్రశ్నించిన ఎమ్మెల్యే కృష్ణదాస్‌పై దౌర్జన్యం.. ఆయన చేతికి గాయం 

శ్రీకాకుళం, న్యూస్‌లైన్: శ్రీకాకుళం జిల్లాలో శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియపై పోలీసులు దాష్టీకానికి పాల్పడ్డారు. పద్మప్రియ మరో ముగ్గురు మిహ ళా నేతలతో కలసి శుక్రవారం ఉదయం బంద్‌ను పర్యవేక్షిస్తూ పట్టణంలో తిరుగుతుండగా ఆర్‌టీసీ బస్టాండ్ వద్ద పోలీసులు వారిని అడ్డగించారు. మహిళా ఎస్‌ఐ నారీమణి వచ్చి అరెస్టు చేస్తున్నట్టు చెప్పారు. తాము ఎవరినీ బలవంతం చేయటం లేదని.. ఎందుకు అరెస్టు చేస్తారని పద్మప్రియ ప్రశ్నించారు. ఇదేమీ వినిపించుకోని ఎస్సై తన సిబ్బందితో కలసి వారిని బలవంతంగా పోలీసు జీపులోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు. పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బొడ్డేపల్లి పద్మజను అమాంతంగా ఎత్తి జీపులో పడేశారు. మరో నేత వరుదు కల్యాణిని కూడా బలవంతంగా జీపులోకి నెట్టివేశారు. పద్మప్రియ, ఆమెతో పాటు ఉన్న మాజీ సర్పంచి ఇందిరలను అలాగే నెట్టివేయబోగా వారు ప్రతిఘటించారు. తాము నడుచుకుంటూ పోలీస్‌స్టేషన్‌కు వస్తామని చెప్పి నడక ప్రారంభించారు. ఎస్సై నారీమణి తన సిబ్బందితో వారిని అడ్డుకుని పద్మప్రియను రోడ్డుపై పడవేసి ఈడ్చివేశారు. పద్మప్రియ ప్రతిఘటించగా పోలీసులు ఆమెపై చేయిచేసుకుని బలవంతంగా పోలీసు జీపులో పడవేశారు. పెనుగులాటలో ఆమె దుస్తులు చిరిగిపోయినా పట్టించుకోలేదు. జీపులో తీసుకువెళుతున్నప్పుడు కూడా నారీమణి పద్మప్రియను ఏకవచనంతో సంభోదిస్తూ పరుష పదజాలంతో దూషించారు. పోలీస్ స్టేషన్‌లో పెట్టి కొడతామని కూడా బెదిరించారు. పద్మప్రియను పోలీసు జీపులోనే పట్టణంలోని పలు పోలీసు స్టేషన్లకు తిప్పుతూ మానసికంగా హింసించారు. 

ఎమ్మెల్యే కృష్ణదాస్‌పైనా దౌర్జన్యం...
పద్మప్రియ భర్త, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ విషయం తెలుసుకుని పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. పోలీసు జీపులో ఉన్న పద్మప్రియను పలకరించబోతే ఎస్‌ఐ నారీమణి ఆయన్ను అడ్డుకున్నారు. తమ అదుపులో ఉన్న ఆమెతో మాట్లాడటానికి వీల్లేదని తూలనాడారు. దాంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ సందర్భంగా కృష్ణదాస్‌పై నారీమణి దౌర్జన్యం చేయటంతో ఆయన చేతి వేలికి తీవ్రగాయమైంది. నెత్తురోడుతున్న చేతితోనే ఆయన పద్మప్రియను తీసుకుని నేరుగా కలెక్టర్ సౌరభ్‌గౌర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. గతంలో నరసన్నపేట ఎస్‌ఐగా నారీమణి పనిచేసినప్పుడు ఆమె తప్పుడు పనులను ప్రశ్నించినందునే కక్షగట్టి ఇప్పుడు పద్మప్రియపై దౌర్జన్యం చేసినట్టు కలెక్టర్‌కు వివరించారు. ఎమ్మెల్యేనని కూడా చూడకుండా తనపై దౌర్జన్యం చేసి గాయపరిచిన తీరును చెప్పారు. అనంతరం ఎస్‌పీ వి.వి.గోపాలరావును కూడా కలిసి నారీమణిపై ఫిర్యాదు చేశారు. కలెక్టర్, ఎస్‌పీలతో మాట్లాడుతున్న సందర్భంలో ఆవేదనను నియంత్రించుకోలేక ఎమ్మెల్యే కృష్ణదాస్, పద్మప్రియ కన్నీటిపర్యంతమయ్యారు. ఎస్‌పీ సూచన మేరకు నారీమణిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు ఎమ్మెల్యే కృష్ణదాస్‌ను రిమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లి గాయానికి చికిత్స చేయించారు. పద్మప్రియ, కృష్ణదాస్‌లపై ఎస్‌ఐ నారీమణి దౌర్జన్యానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు శ్రీకాకుళం వైఎస్సార్ సర్కిల్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. నారీమణిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌పీ కె.వి.వి.గోపాలరావు ఎమ్మెల్యే కృష్ణదాస్‌తో ఫోన్లో మాట్లాడారు. విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని చెబుతూ ధర్నా విరమించాల్సిందిగా కోరారు. దీంతో ధర్నాను విరమించారు. 

స్పీకర్‌కు కృష్ణదాస్ ఫిర్యాదు.. 
ఎమ్మెల్యేనైన తనపై దౌర్జన్యానికి పాల్పడి గాయపరిచిన ఎస్‌ఐ నారీమణిపై చర్య తీసుకోవాలని కోరుతూ ధర్మాన కృష్ణదాస్ అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు పంపించారు. శాసససభ్యుల హక్కుల పరిరక్షణ కింద ఎస్‌ఐ నారీమణిపై చర్య తీసుకోవాలని కోరారు. డీజీపీ దినేష్‌రెడ్డికి కూడా ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఎస్‌ఐ నారీమణి.. ఎమ్మెల్యే కృష్ణదాస్ తన విధుల నిర్వహణకు ఆటంకం కలిగించారంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయటం కొసమెరుపు. తమ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం జిల్లా పార్టీ కన్వీనర్ పద్మప్రియలపై దౌర్జన్యానికి పాల్పడిన గార ఎస్‌ఐ నారీమణిని వెంటనే సస్పెండ్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి డిమాండ్ చేశారు. 
Share this article :

0 comments: