వైఎస్‌ఆర్‌ సిపి ప్రభంజనం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్‌ఆర్‌ సిపి ప్రభంజనం

వైఎస్‌ఆర్‌ సిపి ప్రభంజనం

Written By news on Thursday, September 13, 2012 | 9/13/2012


రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంచలనం సృష్టిస్తోంది. 125 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్‌, 30 ఏళ్ల క్రితం పుట్టిన తెలుగుదేశం పార్టీ ముచ్చటగా మూడేళ్లైనా నిండని ఈ పార్టీని చూసి వణికిపోతున్నాయి. పార్టీ అధికారంలో లేదు. మరో పక్క పార్టీ అధ్యక్షుడిని అన్యాయంగా అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. అయినా ఈ రెండు పార్టీలకు చెందిన సామాన్య కార్యకర్త నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వరకు, రాజకీయంగా తలపండిన అతిరధమహారథులు సైతం భారీ సంఖ్యలో వైఎస్ఆర్ సిపిలోకి వలసదారి పడుతున్నారు. అధికార పార్టీ నేతలకు ఎన్ని ఆశలు చూపినా వలసలు ఆగడంలేదు. ఏమిటీ ప్రభంజనం అని ఆ పార్టీల నేతలు విస్తుపోతున్నారు. చేజారిపోతున్న క్యాడర్‌ను కళ్లు అప్పగించి చూస్తూ దిగులుపడుతున్నారు. ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటున్నారు. ఎన్నికల సమయం కాకపోయినా ఈ వలసలేంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జనం మద్దతు కూడగట్టుకోవడానికి ఆ రెండు పార్టీలు నానా తంటాలు పడుతున్నాయి.
వైఎస్‌ఆర్‌ సిపిపై ఎవరెన్ని దుష్ర్పచారాలు చేసినా ఆ పార్టీ హవా ఏ మాత్రం తగ్గడంలేదు. తాజా రాజకీయ పరిణామాలే ఇందుకు నిదర్శనం. ప్రజా సమస్యలపై వైఎస్‌ఆర్‌ సిపి పోరాడుతూ అధికార, ప్రతిపక్ష పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రజల నాడిని తెలుసుకుని ముందుకు సాగుతోంది. పార్టీ స్థాపించిన కొద్దికాలంలోనే జనంలోకి దూసుకువెళ్లింది. రాజకీయ పార్టీగా కాకుండా ప్రజల పార్టీగా ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్యపైన ఉద్యమాలు, ఆందోళనలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని పూర్తీగా పొందగలిగింది. ఎన్ టి రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి ప్రజాదరణకు మించిన ఆదరణ ఇప్పుడు ఈ పార్టీకి లభిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

సుదీర్ఘ చరిత్ర గలిగి, కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దాదాపు 30 ఏళ్ళ చరిత్ర గల ప్రధాన ప్రతిపక్షం టిడిపి. ఈ రెండు పార్టీలను కాదని నేతలంతా వైఎస్‌ఆర్‌ సిపి వైపు చూస్తున్నారు. ఇంతమంది నేతలు వలస రావడం చూసి చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు కాలాల పాటు రాజకీయ భవిష్యత్‌ ఉండాలనుకునే నేతలంతా ఈ పార్టీలో చేరేందుకు క్యూ కట్టేశారు. కొందరు ఇప్పటికే చేరిపోయారు. మరి కొందరు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకొందరైతే ఇప్పటికే ఆలస్యం చేశామని బాధపడుతున్నారు. ఇప్పటికే తమ స్థానాలను వేరొకరు ఆక్రమించేశారన్నది వారి భావన.
రెండుసార్లు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో, ఇండియాటుడే, ఎన్డీటీవీసర్వేల్లో జనం జై జగన్‌ అన్నారు. ప్రధాన పార్టీల కోటలకు బీటలుపడుతున్నాయి. ప్రజలమద్దతు, రాజకీయ భవిష్యత్తు మెండుగా ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లోకి భారీ వలసలు కొనసాగుతున్నాయి. ఒకప్పుడు టిడిపికి కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లా ఇప్పుడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు గట్టిపట్టున్న జిల్లాగా మారింది. మొన్నటి ఉప ఎన్నికల్లో అనంతపురం, రాయదుర్గం స్థానాలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ సొంతం చేసుకుంది. పలు నియోజకవర్గాల్లోని ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలంతా ఈ పార్టీ బాట పట్టారు. పరిటాల రవీంద్రకు అన్నీతామై వ్యవహరించిన వేపకుంట రాజన్న, బి.నారాయణస్వామి సునీత నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. టిడిపికి రాజీనామా చేసిన రామాంజనేయులు, రఘువీర్‌ చౌదరిలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరనున్నారు. 
నరసన్నపేట ఉప ఎన్నిక గెలుపుతో శ్రీకాకుళం జిల్లాలో వైఎస్‌ఆర్‌ సిపి బలపడసాగింది. జిల్లా కాంగ్రెస్‌కు అన్నీ తానైన ధర్మానప్రసాద రావుపై సిబిఐ కేసు నమోదుచేయడం, మంత్రి పదవి ఊగిసలాట చూశాక కాంగ్రెస్‌ కేడర్‌ ఆత్మస్థైర్యం దెబ్బతింది. ఆ కేడరంతా జగన్‌ వైపు రావడానికి సన్నధ్దమవుతోంది. టిడిపికి భవిష్యత్తు లేదని తేలిపోవడంతో మాజీ మంత్రి ఎర్రన్నాయుడు వియ్యంకుడు సైతం జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిపోయారు. ఎన్నికల సమయం దగ్గరపడేకొద్దీ ఆ రెండు ప్రధాన పార్టీల నుంచి భారీగా వలసలు ఉంటాయని తేలిపోయింది. 

తెలంగాణలోనూ ఫ్యాన్‌ గాలి ఊపందుకుంది. నిజామాబాద్‌ జిల్లాలో మాజీ ఎంపీ కేశుపల్లి గంగారెడ్డి, మాజీ మంత్రి సంతోష్‌రెడ్డి, బోధన్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ నాయకుడు కె.కరుణాకర్‌ రెడ్డి ఇప్పటికే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరారు. పసుపురైతు కోసం ఆర్మూర్‌లో జగన్‌ చేసిన దీక్షతో ఇక్కడి రైతుల్లో ఈ పార్టీపై నమ్మకం పెరిగింది. నిజామాబాద్‌లో టిడిపి-కాంగ్రెస్‌ల పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఆయా పార్టీల ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు టిఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ల్లోకి భారీగా వలస వస్తున్న తీరు ఆ పార్టీలను కలవరపెడుతోంది. పరకాల ఎన్నికలతో వరంగల్‌ జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ సత్తా తెలిసొచ్చింది. అన్ని పార్టీలు ఏకమై పోరాడినా కొండా సురేఖకు వచ్చిన ఓట్లను చూసిన తరువాత టిడిపి, కాంగ్రెస్‌ నేతల చూపు ఫ్యాన్‌ వైపు మళ్లింది. ఇప్పటికే మండల, గ్రామీణ స్థాయిలో వేలాదిమంది కార్యకర్తలు కొండా దంపతుల ఆధ్వర్యంలో ఈ పార్టీలో చేరిపోయారు. 

కరీంనగర్‌లో టిడిపి, కాంగ్రెస్‌లు ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్రజా సమస్యలపై పోరాటంతో వైఎస్‌ఆర్‌ సిపి, తెలంగాణ ఉద్యమంతో టిఆర్‌ఎస్‌ బలపడుతున్నాయి. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డిలు వైఎస్‌ఆర్‌సిపి వైపు ఆసక్తి చూపుతున్నారు. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొంతకాలం వేచి ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. టిడిపి నుంచి మాజీ మంత్రి మాతంగి నర్సయ్య వైఎస్‌ఆర్‌సిపిలో చేరేందుకు జగన్‌ను ఇప్పటికే కలిశారు. ఎన్నికల సమయం దగ్గరపడితే టిఆర్‌ఎస్‌ నుంచి కూడా వలసలు భారీగా ఉంటాయని భావిస్తున్నారు. 

తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్‌ఆర్‌సిపి హవా కొనసాగుతోంది. జక్కంపూడి కుటుంబం, జ్యోతుల నెహ్రూ, పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌ వంటి పట్టున్న నేతలు జగన్‌ వైపు ఉండటంతో టిడిపి, కాంగ్రెస్‌లోని ద్వితీయశ్రేణి నాయకత్వం, కార్యకర్తలు ఈ పార్టీ బాట పడుతున్నారు. ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపులు సుబ్బారావు, పిఠాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పెద్దాపురం నుంచి తోట గోపాలకృష్ణ అనుచరులు వైఎస్‌ఆర్‌ సిపి బలాన్ని పెంచారు. ఆదిరెడ్డి ఆప్పారావు, బొమ్మన రాజ్‌కుమార్‌ల ప్రభావం వల్ల కూడా పార్టీ బలం పుంజుకుంటోంది. టిడిపిలో గ్రూపులు ఆ పార్టీని బలహీనపరిచాయి. కాంగ్రెస్‌ ప్రాభవం రోజురోజుకు బలహీనపడుతోంది. 

ఇటీవల కాలంలో ఈ వలసల ప్రక్రియ మరింత ఊపందుకుంది. గత కొద్ది రోజులుగా అనేకమంది ప్రముఖులు ఈ పార్టీలో చేరారు. ఈ రోజు కృష్ణా జిల్లాలో వలసల ప్రభంజనం మొదలైంది. పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పామర్రు వెళ్లిన సందర్భంగా భారీ సంఖ్యలో జనం తరలి వచ్చారు. సభా ప్రాంగణం అంతా 'జై జగన్‌' నినాదాలతో హోరెత్తిపోయింది. విజయమ్మ సమక్షంలో టీడీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, ఆ పార్టీ మాజీ పోలిట్‌బ్యూరో సభ్యురాలు ఉప్పులేటి కల్పన. జిల్లాపరిషత్ మాజీ చైర్మన్‌ కుక్కల నాగేశ్వరరావు, ప్రముఖ పారిశ్రామిక వేత్త వాకా వాసుదేవరావులతో పాటు పలువురు స్ధానిక ప్రజా ప్రతినిధులు పార్టీలో చేరారు. 

అంతకు ముందు పార్టీలో చేరిన ప్రముఖులు: 

సుజయ్‌ కృష్ణ రంగారావు - కాంగ్రెస్‌ ఎమ్మెల్యే
ఆళ్ళ నాని - కాంగ్రెస్‌ ఎమ్మెల్యే
మైసూరారెడ్డి - టీడీపీ మాజీ ఎంపీ
వైఎస్‌ వివేకానందరెడ్డి - కాంగ్రెస్‌ మాజీ మంత్రి
హరిరామజోగయ్య - సీనియర్‌ నేత
ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి - కాంగ్రెస్‌ సీనియర్‌ నేత
గద్దే బాబూరావు - టీడీపీ మాజీ చీప్ విప్
వంగవీటి రాధాకృష్ణ - కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే
మినతీ గోమాంగో - కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే
సినీ నటుడు గిరిబాబు

హైదరాబాద్‌, రంగారెడ్డి పరిధిలో కార్పోరేటర్లు, ముఖ్యనేతలు:

ఆదం విజయ్‌ కుమార్‌ - కాంగ్రెస్‌ కార్పొరేటర్‌
సురేష్‌ రెడ్డి - కాంగ్రెస్‌ కార్పొరేటర్‌
ధన్‌పాల్‌ రెడ్డి - ఇండిపెండెంట్‌ కార్పోరేటర్‌
హరివర్ధన్‌ రెడ్డి - కాంగ్రెస్‌ కార్పొరేటర్‌
కొలన్‌ శ్రీనివాస్‌రెడ్డి
పీజేఆర్‌ కుమార్తె విజయారెడ్డి

వీరే కాకుండా చెంగల వెంకట్రావు, టిడిపి కార్పోరేటర్ దేపా సురేఖా భాస్కర్‌ రెడ్డి వంటివారు త్వరలో పార్టీలో చేరతామని ప్రకటించారు. ఈ వలసలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. 

ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరకుపైగా సమయం ఉంది. ఈ ముందస్తు వలసలు కాంగ్రెస్‌, టిడిపిలకు తగ్గుతున్న జనాదరణకు నిదర్శనం. ఈ వలసలను ఆపడానికి టిడిపి, కాంగ్రెస్‌లు ఎన్ని ఎత్తులు వేసినా నేతలు మాత్రం 'జై జగన్‌' అంటున్నారు. భవిష్యత్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌దే అని వారు నమ్ముతున్నారు. కాబోయే ముఖ్యమంత్రి జగన్ అని వారు నిర్ధారణకొచ్చేశారు.
Share this article :

0 comments: