‘సీబీఐ దర్యాప్తు’పై చక్రం తిప్పిన చంద్రబాబు... రంగంలోకి బిల్లీరావు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘సీబీఐ దర్యాప్తు’పై చక్రం తిప్పిన చంద్రబాబు... రంగంలోకి బిల్లీరావు

‘సీబీఐ దర్యాప్తు’పై చక్రం తిప్పిన చంద్రబాబు... రంగంలోకి బిల్లీరావు

Written By news on Sunday, September 30, 2012 | 9/30/2012

‘ఐఎంజీ’ అక్రమాలపై సీబీఐ దర్యాప్తును అడ్డుకునేందుకు ఎత్తుగడ 
నాట్‌బిఫోర్ నాటకాలు ఫలించే అవకాశం లేకపోవటంతో తెరపైకి బిల్లీ 
సీబీఐ దర్యాప్తు జీవో 310ని కొట్టివేయాలంటూ బిల్లీరావు చేత పిటిషన్
దర్యాప్తునకు హైకోర్టు ఆదేశాలు జారీ చేయనున్న నేపథ్యంలో పిటిషన్
న్యూయార్క్‌లోని బిల్లీరావుతో లీగల్ టీం ద్వారా కథ నడిపించిన బాబు
దర్యాప్తును అడ్డుకోకుంటే నీవే ఇరుక్కుంటావంటూ బిల్లీరావుకు చంద్రబాబు కబురు 
టీడీపీ అధినేత సూచనల మేరకు ఆగమేఘాలపై పిటిషన్ తయారు
తరువాత దానిని న్యూయార్క్‌లోని బిల్లీరావుకు పంపిన వైనం
న్యూయార్క్ నుంచి సంతకాలతో పిటిషన్ రాగానే హైకోర్టులో దాఖలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఐఎంజీ భారత సంస్థకు తన హయాంలో వేల కోట్ల రూపాయల విలువైన భూములను సంతర్పణ చేసిన ఉదంతంపై సీబీఐ దర్యాప్తు జరగకుండా అడ్డుకోవటానికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పావులు కదుపుతున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా.. ఐఎంజీ భారత కంపెనీ ఏర్పడిన నాలుగు రోజులకే దానికి భూములను ధారాదత్తం చేయటంలో జరిగిన భారీ అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు సీబీఐ సంసిద్ధతను వ్యక్తం చేయటంతో బాబు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు ప్రారంభించకుండా అడ్డుకునేందుకు.. చంద్రబాబు తన బినామీ బిల్లీరావు అలియాస్ అహోబలరావును రంగంలోకి దించారు. ఐఎంజీ భూముల వ్యవహారంలో సీబీఐ దర్యాప్తునకు సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ దర్యాప్తునకు ఆధారమైన జీవో 310 చట్టబద్ధతను సవాలు చేయిస్తూ బిల్లీరావు చేత హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. జీవో 310ని కొట్టివేయాలంటూ హైకోర్టులో బిల్లీరావు పిటిషన్ దాఖలు చేశారు. 

కోర్టు జోక్యంతో దర్యాప్తునకు సీబీఐ సై 

చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండగా.. రాష్ట్ర రాజధాని నగరంలో వేల కోట్ల రూపాయల విలువ చేసే 850 ఎకరాల భూమిని నామమాత్రపు ధరకు తన జేబు సంస్థ ఐఎంజీ భారత కంపెనీకి కట్టబెట్టిన విషయం తెలిసిందే. ప్రజా ప్రయోజనాలను తాకట్టుపెట్టి, ఆ కంపెనీకి భారీ లబ్ధి చేకూరేలా ఆ సంస్థతో పలు చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. చంద్రబాబు చర్యల ద్వారా ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లటంతో.. ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఐఎంజీ భూముల వ్యవహారంలో దర్యాప్తు చేయాలని సీబీఐని కోరుతూ జీవో 310ని జారీ చేసింది. అయితే తమకు సిబ్బంది లేరనే సాకుతో ఇన్ని రోజులు సీబీఐ దర్యాప్తు జోలికి వెళ్లలేదు.

దీంతో జీవో 310 ప్రకారం ఐఎంజీ భూముల వ్యవహారంలో దర్యాప్తు చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు ఎ.బి.కె.ప్రసాద్, ఆడిటర్ విజయసాయిరెడ్డి, న్యాయవాది శ్రీరంగారావు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు ధర్మాసనం.. జీవో 310 ప్రకారం ఎందుకు దర్యాప్తు చేయరని, దీనిపై వైఖరి ఏమిటని సీబీఐని నిలదీసింది. దీంతో సీబీఐ విధిలేని పరిస్థితుల్లో దర్యాప్తు చేయటానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ హైకోర్టులో గత వారం కౌంటర్ దాఖలు చేసింది. ఈ కౌంటర్‌ను పరిశీలించిన ధర్మాసనం, అక్టోబర్ 1న సీబీఐ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. 

నాట్ బిఫోర్ నాటకం పారదని... 

సీబీఐ ఎప్పుడయితే దర్యాప్తుకు తాము సిద్ధమని చెప్పిందో.. ఆ క్షణం నుంచి చంద్రబాబునాయుడు ఆలోచనకు పదునుపెట్టారు. ఈ కేసులో ఎలాగైనా ఇంప్లీడ్ కావాలని నిర్ణయించుకుని, హైకోర్టులో అన్నీ తానై నడిపించే ఓ కీలక వ్యక్తితో పాటు తన లీగల్ టీంను సంప్రదించినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అవసరమైతే తమను ఎప్పుడూ రక్షిస్తూ వచ్చిన ‘నాట్ బిఫోర్’ నాటకాన్ని ఈసారి కూడా రక్తికట్టించాలని నిర్ణయించారు. అయితే అన్ని మార్గాలను పరిశీలించిన ఆ కీలక వ్యక్తి, ఇతర లీగల్ టీం సభ్యులు ఇంప్లీడ్ కావటం సాధ్యం కాదని, అందువల్ల ఒరిగేదేమీ ఉండదని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబుకు తన బినామీ బిల్లీరావు ఆపద్భాంధవుడిలా కనిపించారు. బిల్లీరావును రంగంలోకి దించితే ఎలా ఉంటుందని తన ఆలోచనలను లీగల్ టీం ముందుంచారు. లీగల్ టీంకు సైతం చంద్రబాబు ఆలోచన నచ్చటంతో పని మొదలు పెట్టారు. ఓ సీనియర్ న్యాయవాది ద్వారా బిల్లీరావు నంబర్‌ను చంద్రబాబు టీం సంపాదించింది. ఎక్కడో న్యూయార్క్‌లో ఉన్న బిల్లీరావును ఆ టీం సంప్రదించింది. హైకోర్టు సోమవారం సీబీఐ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేయనున్నదని, ఈ ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు మొదలుపెడుతుందని, అదే జరిగితే మొదట ఇబ్బందిపడేది నీవేనంటూ బిల్లీరావును భయపెట్టింది. 

న్యూయార్క్ నుంచి ఆగమేఘాలపై 

సీబీఐ దర్యాప్తును అడ్డుకోవాలంటే హైకోర్టులో జీవో 310పై రిట్ పిటిషన్ దాఖలు చేయటం ఒక్కటే మార్గమని, అది నీవల్ల మాత్రమే సాధ్యమవుతుందని బిల్లీరావుకు.. చంద్రబాబు టీం స్పష్టం చేసింది. దీంతో బిల్లీరావు సైతం సీబీఐ దర్యాప్తు మొదలైతే నిజంగా తానే ఇబ్బంది పడాల్సి వస్తుందని నిర్ణయించుకుని జీవో 310ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వెంటనే చంద్రబాబునాయుడి నుంచి బిల్లీరావు వ్యవహారాలను చూస్తున్న హైకోర్టు సీనియర్ న్యాయవాది ఒకరికి ఆదేశాలు వెళ్లాయి. వాస్తవానికి వచ్చే సోమవారం (అక్టోబర్ 1వతేదీన) తగిన ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు ఈ నెల 24న చెప్పింది. వెంటనే ఆ మరుసటి రోజు అంటే 25న రిట్ పిటిషన్ తయారైపోయింది. తయారైన రిట్ పిటిషన్‌ను చంద్రబాబు పరిశీలనకు పంపారు. 

హైకోర్టులోని కీలక వ్యక్తి సైతం ఆ పిటిషన్‌ను పరిశీలించారు. చంద్రబాబు, ఆ కీలక వ్యక్తి ఇద్దరూ ఓకే చేయటంతో దానిని సంతకాల కోసం న్యూయార్క్‌లో ఉన్న బిల్లీరావుకు పంపారు. విదేశాల్లో ఉన్న వ్యక్తి మరో దేశంలోని కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలంటే, ఆ పిటిషన్‌పై అక్కడి నోటరీ సంతకం చేయాల్సి ఉంటుంది. దీంతో బిల్లీరావు తాను దాఖలు చేయనున్న రిట్ పిటిషన్‌పై న్యూయార్క్ స్టేట్ నోటరీ క్రిస్టల్ మెకాచిన్ చేత నోటరీ చేయించారు. తరువాత బిల్లీరావు ఆ పిటిషన్‌ను తన న్యాయవాదికి పంపారు. బిల్లీరావు నుంచి పిటిషన్ అందుకోగానే అది హైకోర్టులో దాఖలైపోయింది. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది.. అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తరువాత ఏం జరిగింది అనే విషయాలను ఈ సందర్భంగా బిల్లీరావు తన పిటిషన్‌లో వివరించారు. చంద్రబాబునాయుడి ప్రభుత్వం నుంచి బిల్లీరావు మొత్తం 850 ఎకరాల భూమిని పొందితే, తన పిటిషన్‌లో బిల్లీరావు తనకు ప్రభుత్వం 400 ఎకరాలు మాత్రమే కేటాయించినట్లు పేర్కొనటం విశేషం.

source:sakshi
Share this article :

0 comments: