రెండు కళ్ల సిద్ధాంతం.. మళ్లీ దాటవేత ధోరణి. ప్రధానికి బాబు లేఖ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రెండు కళ్ల సిద్ధాంతం.. మళ్లీ దాటవేత ధోరణి. ప్రధానికి బాబు లేఖ

రెండు కళ్ల సిద్ధాంతం.. మళ్లీ దాటవేత ధోరణి. ప్రధానికి బాబు లేఖ

Written By news on Thursday, September 27, 2012 | 9/27/2012

* తెలంగాణపై అదే రెండు కళ్ల సిద్ధాంతం.. మళ్లీ దాటవేత ధోరణి.. 
* అఖిలపక్ష భేటీ తప్ప కొత్త మాటలేవీ లేకుండానే చంద్రబాబు లేఖ
* తెలంగాణపై తమ అభిప్రాయం నాటి ప్రణబ్ కమిటీకి చెప్పామన్న బాబు 
* ఇరు ప్రాంతాల టీడీపీ నేతలను మరింత గందరగోళంలోకి నెట్టిన లేఖ 
* బాబు తీరుపై మండిపడుతున్న సీమాంధ్ర, తెలంగాణ నేతలు 
* నిజాయతీ లేని ఈ వైఖరితో పార్టీకి నష్టమేనంటున్న టీడీపీ వర్గాలు 

హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ అంశంపై ఒక స్పష్టతను ఇస్తానని ఇంతకాలం చెప్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చివరకు ఆ అంశాన్ని ఎటూ తేల్చకుండా ఆ పార్టీని మొత్తం మరింత గందరగోళంలో పడేశారు. తెలంగాణ అంశాన్ని తేల్చటానికి తక్షణం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు రాసిన లేఖలో కోరారు. ఈ మేరకు బుధవారం రాత్రి ప్రధానమంత్రికి రాసిన లేఖను పత్రికలకు విడుదల చేశారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో తెలంగాణ అంశంపై తేల్చాలని చెప్పటమన్న ఒక అంశం తప్ప లేఖ ఆసాంతం కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలకే ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం చెప్తారని భావించిన టీడీపీ నేతలను తాజాగా చంద్రబాబు రాసిన లేఖ మరింత ఇరకాటంలోకి నెట్టింది. 

ఆయన లేఖపై ఇరు ప్రాంతాల నేతల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది. ‘‘లేఖను క్షుణ్ణంగా పరిశీలిస్తే మా పార్టీ అధ్యక్షుడి వైఖరిలో చిత్తశుద్ధి, నిజాయతీ లేదని కచ్చితంగా అర్థమవుతుంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో ఆయన లేఖ ఇరు ప్రాంతాల నేతలను మరింత గందరగోళంలో పడేసింది...’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడొకరు.. బాబు ప్రధానికి రాసిన లేఖపై ‘న్యూస్‌లైన్’తో వ్యాఖ్యానించారు. తెలంగాణ విషయంలో స్పష్టత ఇవ్వకుండా తన వరకు కట్టె విరగదు.. పాము చావదు.. అన్న చందంగా వ్యవహరిస్తే పార్టీకి మరింత నష్టం తప్ప ప్రయోజనం లేదన్నారు. చంద్రబాబు రాసిన లేఖపై పలువురు నాయకులు అనేక సందేహాలను వ్యక్తం చేశారు. ఈ నెల 30న తెలంగాణ మార్చ్ నిర్వహిస్తున్న తరుణంలో గత వారం రోజులుగా పార్టీకి చెందిన ఇరు ప్రాంతాల నేతలతో చంద్రబాబు సమాలోచనలు జరుపుతున్నారు. 

బుధవారం కూడా పార్టీ నేతలు కోడెల శివ ప్రసాదరావు, కె.ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు, ఎర్రబెల్లి దయాకరరావు, కడియం శ్రీహరి, మోత్కుపల్లి నర్సింహులు, రేవూరి ప్రకాష్‌రెడ్డి తదితరులతో చంద్రబాబు చర్చలు జరిపారు. ప్రధానమంత్రికి రాసే లేఖపై దాదాపు నాలుగు గంటల పాటు చర్చించారు. లేఖ ఇవ్వాలని ఎవరూ అడగని సమయంలో లేఖ రాయటమేమిటని కోస్తా ప్రాంత నేతలు అభ్యంతరం వ్యక్తం చేయగా.. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తామని మొదటి నుంచి చెప్తున్నందున లేఖ ఇవ్వాల్సిందేనని తెలంగాణ ప్రాంత నేతలు కోరారు. దాంతో ఇరు ప్రాంతాలకు ఇబ్బంది లేకుండా లేఖ రాస్తానని ఆ సమావేశంలో చంద్రబాబు చెప్పారు. అనంతరం రాత్రి ప్రధానమంత్రికి లేఖ పంపించారు.

అభిప్రాయం ప్రణబ్ కమిటీకి చెప్పాం... 
తెలంగాణ విషయంలో రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ తన బాధ్యత నుంచి తప్పించుకుంటున్నదని, 2014 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీఆర్‌ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలతో చేతులు కలిపి తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయటానికి పథక రచన చేస్తున్నారని చంద్రబాబు ప్రధానమంత్రికి రాసిన లేఖలో విమర్శించారు. డిసెంబర్ 2009లో కేంద్ర హోంమంత్రి ప్రకటన అనంతర పరిణామాల్లో జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్‌ను వేయగా, డిసెంబర్ 2010లో నివేదిక సమర్పించిందన్న విషయాన్ని ఆ లేఖలో చంద్రబాబు గుర్తుచేశారు. అయితే ఆ నివేదికపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా.. కేంద్ర హోంమంత్రి మళ్లీ అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకుంటామని చెప్పారని పేర్కొన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీయే ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదన్న విషయాన్ని ఇటీవలి కాలంలో స్వయంగా కేంద్ర హోంమంత్రి పార్లమెంట్‌లో అంగీకరించారని గుర్తుచేశారు. 

రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తున్న దశలో కేంద్రం తెలంగాణపై ఎటూ తేల్చని కారణంగా దెబ్బతింటోందన్నారు. 2004 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత హామీ నిలబెట్టుకోలేదని ఆరోపించారు. ఆ తర్వాత 2009 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 2008లో ప్రణబ్‌ముఖర్జీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. తెలంగాణపై తమ అభిప్రాయమేమిటో 2008 అక్టోబర్ 10వ తేదీన ఆ కమిటీకి తెలియజేశామన్నారు. ఈ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి వల్ల రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగిందన్నారు.

ప్రణబ్ కమిటీకి ఏం చెప్పారో చెప్పరేం: 
చంద్రబాబు రాసిన లేఖపై టీడీపీలోని ఇరు ప్రాంతాల నేతలు అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. 2004లో టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పొత్తుపెట్టుకున్న విషయాన్ని లేఖలో గుర్తుచేసిన చంద్రబాబు, ఆ తర్వాత 2009లో అదే టీఆర్‌ఎస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకున్న విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. 2008లో ప్రణబ్ కమిటీకి లేఖ ఇచ్చామని చెప్తున్నప్పటికీ తదనంతర పరిస్థితుల్లో మరోసారి వైఖరిని స్పష్టం చేయాల్సిన అవసరం ఏర్పడినందునే, స్పష్టత ఇస్తామని ఇంతకాలం చెప్తూ వచ్చామని, తీరా లేఖ రాసి 2008లో ప్రణబ్ కమిటీకి ఏమని లేఖ ఇచ్చామన్న విషయాన్ని కూడా అందులో పేర్కొనకపోవటమేమిటని ఆ పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. పోనీ ఆ లేఖలో పేర్కొన్న అంశాలకు కట్టుబడి ఉంటామని కూడా చెప్పలేదేమని నిలదీస్తున్నారు. తెలంగాణ మార్చ్ సమయం దగ్గర పడుతున్న తరుణంలో అనుకూలంగా లేఖ ఇప్పించాలని ఎంతగానో ఒత్తిళ్లు చేసినప్పటికీ మళ్లీ దాటవేత వైఖరిని ప్రదర్శించారే తప్ప ఎలాంటి స్పష్టతా ఇవ్వలేకపోయారని ఇరు ప్రాంతాల నేతలూ అంతర్గత చర్చల్లో అధినేతపై మండిపడుతున్నారు.

ఇక పరిష్కరించండి.. మోత్కుపల్లి:
తమను లేఖ రాయాలని ఇన్నాళ్లు రాజకీయంగా విమర్శించిన వారు ఇప్పుడు సమస్యను పరిష్కరించాలని టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్శింహులు డిమాండ్ చేశారు. ముందు నుంచి చెప్పినట్టే చంద్రబాబు లేఖ రాశారని కడియం శ్రీహరి అన్నారు.
http://www.sakshi.com/main/FullStory.aspx?catid=458188&Categoryid=1&subcatid=33

Share this article :

0 comments: