మరో ‘ప్రస్థానం’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మరో ‘ప్రస్థానం’

మరో ‘ప్రస్థానం’

Written By news on Friday, October 12, 2012 | 10/12/2012

*ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు 18 నుంచి షర్మిల పాదయాత్ర..
*కాంగ్రెస్, టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్‌ను ప్రజలకు వివరించాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయం
*అవిశ్వాసం పెట్టకుండా యాత్రలు చేస్తున్న బాబు నాటకం బయటపెట్టేందుకు సిద్ధం
*పార్టీ అధినేత వైఎస్ జగన్ బయట లేనందున అన్న తరఫున ప్రజల్లోకి సోదరి షర్మిల
*మహానేత వైఎస్ అడుగుజాడల్లో.. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా యాత్ర
*పేరు ‘మరో ప్రజా ప్రస్థానం’.. 3,000 కిలోమీటర్ల మేర కాలినడక
*జైలు నుంచి రాగానే యాత్రను వైఎస్ జగన్ కొనసాగిస్తారని విజయమ్మ వెల్లడి
*ప్రభుత్వ వైఖరికి, కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా నల్లబ్యాడ్జీ ధరించనున్న షర్మిల

‘‘అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా..? అసలు పరిపాలన ఉందా? ప్రతిపక్షం ఉందా? ప్రజల పరిస్థితి ఇలా ఉండటానికి మూలం ప్రధాన ప్రతిపక్షం. టీడీపీ సరిగ్గా పనిచేసి ఉంటే ప్రభుత్వానికి భయం ఉండేది. ప్రజల పట్ల చిత్తశుద్ధి ప్రభుత్వానికీ లేదు, ప్రతిపక్షానికీ లేదు. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఓ వైపు బాబు విమర్శిస్తారు. ప్రజల పట్ల మొసలి కన్నీరు కారుస్తారు. కానీ అవిశ్వాస తీర్మానం పెట్టరు. ఇది ప్రభుత్వంతో కుమ్మక్కు కాక మరేమిటి? అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వం పడిపోయేది. అలా చేయకుండా పాదయాత్ర అంటూ తిరుగుతున్నారు.’’

హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రజా సమస్యల పరిష్కారంలోనూ, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలోనూ ఘోరంగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వాన్నిఎండగట్టేందుకు ప్రజల్లోకి వెళ్లాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అన్నింటా విఫలమైన ఈ ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి పడగొట్టే అవకాశం ఉన్నా, అలా చేయకుండా మొసలి కన్నీరు కారుస్తూ పాదయాత్ర చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కుమ్మక్కు రాజకీయాలను కూడా ప్రజలకు వివరించాలని నిర్ణయం తీసుకుంది. 

ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల ‘మరో ప్రజా ప్రస్థానం’ పేరుతో ఈ నెల 18 నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి(ఇడుపులపాయ) నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర అనంతపురం, కర్నూలు తదితర జిల్లాల మీదుగా సాగుతూ శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంతో ముగుస్తుంది. మొత్తం 3,000 కిలోమీటర్ల మేర ఈ యాత్ర ఉంటుంది. ప్రజల పట్ల ప్రభుత్వ వైఖరి, అధికార, ప్రతిపక్షాల కుమ్మక్కు కుట్రకు నిరసనగా షర్మిల ఈ యాత్రలో నల్లబ్యాడ్జీ ధరించనున్నారు. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి జైలు నుంచి ఎప్పుడు బయటకు వస్తే అప్పటి నుంచి ఆయనేనేరుగా ఈ పాదయాత్రను కొనసాగిస్తారని, పూర్తి చేస్తారని పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ కలిసి పన్నిన రాజకీయ కుట్ర ఫలితంగా జైలు పాలైన జగన్‌మోహన్ రెడ్డి ప్రజలను కలుసుకునే పరిస్థితి లేనందున షర్మిల ఈ పాదయాత్ర చేపడుతున్నారని వెల్లడించారు. ఆమె గురువారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సమస్యలతో అల్లాడుతూంటే కాంగ్రెస్, టీడీపీ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికార, ప్రతిపక్షాలపైనే పోరాటం

ప్రజాపక్షంగా తమ పార్టీ పోరాటం ప్రధానంగా అధికార, ప్రతిపక్షాలపైనేనని విజయమ్మ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు తీర్చలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న ప్రభుత్వంపై బాబు అవిశ్వాస తీర్మానం పెట్టి గద్దె దించేందుకు ప్రయత్నించకుండా రోడ్డెక్కి మొసలి కన్నీరు కార్చితే ప్రయోజనం ఏమిటని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టబోమని చెప్పడం ద్వారా చంద్రబాబు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భుజాలకెత్తుకున్న విషయం స్పష్టమైందని, అదే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళతామని ఆమె ప్రకటించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం, అలాగే సంక్షోభంలో ఉన్న రైతులను ఆదుకోవాలని కోరుతూ జగన్‌తో పాటు తాను దీక్షలు చేపట్టినా ప్రభుత్వంలో చలనం లేదని, ఆ నిరసనలకు కొనసాగింపుగా పాదయాత్ర ఉంటుందని ఆమె వివరించారు.

పాదయాత్ర ఎందుకు?

‘‘రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా...! అసలు పరిపాలన ఉందా? అన్పిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం పరిస్థితీ అలాగే ఉంది. అసలు ప్రతిపక్షం ఉందా? లేదా? అని అనుమానంగా ఉంది. ఈ రోజు రాష్ట్రంలోని ఏ వర్గానికి చెందిన ప్రజలూ సంతోషంగా లేరు. ఈ రోజు ఒక్క రేషన్ కార్డు ఇవ్వడం లేదు. ఒక్క పెన్షన్ మంజూరు కావడం లేదు. ఒక ఇల్లు కూడా ప్రభుత్వం ఇవ్వలేక పోతోంది. కానీ ఖజానా నింపుకొనేందుకు ప్రజలపై పన్నులు వేసి భారం మోపుతోంది. కరెంటు చార్జీలు పెంచారు. సర్‌చార్జి సర్దుబాటు పేరుతో ఇంకా ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ రేట్లను పెంచేశారు. నిత్యావసర వస్తువులైతే కొండెక్కి కూర్చున్నాయి. 

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేద ప్రజల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలేవీ అమలు కావడం లేదు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారు. అందులోని చాలా వ్యాధులను ప్రభుత్వ ఆసుపత్రుల జాబితాలో చేర్చారు. అక్కడ ఆపరేషన్లు చేయడానికి పరికరాల్లేవు, వసతులు లేవు. 108 అంబులెన్స్‌లు చూస్తే డీజిల్ లేకుండా ఉంది. 104 అసలుకే లేదు. వడ్డీలేని రుణాలు ఇస్తామంటున్నారు. కానీ ఎక్కడా ఆ ఊసే లేదు. వైఎస్ హయాంలో పావలా వడ్డీకి ఎంతో మందికి రుణాలు ఇచ్చారు. వైఎస్ పాలనలో ప్రతిరోజూ ఉదయం 5 గంటలకే ఆయన ముందుకు నిత్యావసర సరుకుల ధరల వివరాలు వచ్చేవి. కరెంటు సరఫరా, జలాశయాల్లో నీటి నిల్వలు ఇలాంటి వివరాలన్నీ ఆయన టేబుల్ మీద ఉండేవి. ఆయన మానిటర్ (పర్యవేక్షణ) చేసే వారు. ఈరోజు దేని మీదా ప్రభుత్వానికి శ్రద్ధ లేనట్లుంది. అన్నీ ఆగి పోయాయి. సాగునీటి ప్రాజెక్టులు ఆగిపోయాయి. కరెంటు లేక పారిశ్రామిక రంగం కుప్పకూలింది. లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. 

వారంతా తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లోనే మనం పాదయాత్ర చేయాలని జగన్ చెప్పారు. ప్రజల వద్దకు వెళ్లి వాళ్లకు మన ప్రభుత్వం వస్తుంది, వైఎస్సార్ సువర్ణయుగం వస్తుంది అని చెప్పి భరోసా ఇవ్వాలని అన్నారు. ప్రధానంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం గురించి చెప్పాలన్నారు. ఫీజుల పథకంపై జగన్‌బాబు, నేను దీక్షలు చేసినా ప్రభుత్వంలో చలనం లేదు’’ అని విజయమ్మ తెలిపారు. ‘‘కరెంటు సరఫరా గ్రామాల్లో అధ్వానంగా ఉంది. రెండు గంటలు కూడా రావడం లేదని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఉన్నపుడు ఏడు గంటల పాటు సరఫరా చేయడమే కాక ఉచితంగా ఇచ్చారు. పేద ప్రజల కోసం ప్రజా పక్షంగా ఈ యాత్ర చేస్తున్నాం’’ అని ఆమె అన్నారు.

ప్రతిపక్షం బాగా పని చేసి ఉంటే...

‘‘అసలు రాష్ట్రం ఇలా ఉండటానికి మూలం ప్రధాన ప్రతిపక్షం. టీడీపీ సరిగ్గా పనిచేసి ఉంటే ప్రభుత్వానికి భయం ఉండేది. మా పార్టీ చాలా చిన్న పార్టీ, మేం ఏమీ చేయలేం. ఈరోజు అసెంబ్లీ చూస్తే ఐదు రోజుల సమావేశాల్లో ప్రతిపక్ష నేత కీలకమైన బీఏసీ సమావేశానికి కూడా రాలేదు. అసెంబ్లీ నిర్వహించాలని ప్రభుత్వానికీ లేదు, ప్రతిపక్షానికీ లేదు. మమ్మల్ని బయటకు పంపి అసెంబ్లీ నిర్వహించుకోండి అని టీఆర్‌ఎస్ వాళ్లు కూడా చెప్పారు. చంద్రబాబు ఐదు రోజుల్లో అపుడపుడూ ఐదు నిమిషాలు వచ్చి కూర్చుని వెళ్లి పోయారు. ఒక్క సంతాపం మాత్రమే అసెంబ్లీలో చర్చకు వచ్చింది. చంద్రబాబు కాంగ్రెస్‌తో ఎంతగా కలిసి పోయారంటే జగన్‌బాబును జైలుకు పంపే విషయంలో కుమ్మక్కు అయ్యారు. కాంగ్రెస్, టీడీపీ కలిసి కోర్టుకు వెళ్లాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకరికొకరు సహకరించుకున్నారు. నిన్నటికి నిన్న బెయిల్ పిటిషన్ విచారణకు రావడానికి ఒక్క రోజు ముందు టీడీపీ ఎంపీలు ఆర్థిక మంత్రి చిదంబరంను కలిశారు. ఈడీ రెండు, మూడు గంటల్లోనే అటాచ్‌మెంట్ నోటీసులు ఇచ్చింది’’ అని విజయమ్మ అన్నారు.

అవిశ్వాసం పెట్టరేం చంద్రబాబూ?

‘‘చిరంజీవి కాంగ్రెస్‌తో కలవనంతటి వరకూ బాబు కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టలేదు. తర్వాత అవిశ్వాసం పెట్టినా అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి మాత్రమే. మరి ఈ రోజు రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యకర పరిస్థితులు ఉంటే ఎందుకు చంద్రబాబునాయుడు అవిశ్వాసం పెట్టడం లేదు? ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఓ వైపు బాబు విమర్శిస్తారు. ప్రజల పట్ల మొసలి కన్నీరు కారుస్తారు. కానీ అవిశ్వాస తీర్మానం పెట్టరు. ఇది ప్రభుత్వంతో కుమ్మక్కు కాక మరేమిటి? ఈ రోజు బాబు రోడ్డున పడి పాదయాత్ర చేస్తున్నారు, 9 ఏళ్లు అధికారంలో ఉండగా ప్రజల కోసం ఒక్క మంచి కార్యక్రమమైనా ఆయన చేశారా? వైఎస్ చేసిన పథకాలు కొనసాగించాలంటారు. మళ్లీ ప్రజల మధ్యకు వెళ్లి వైఎస్‌ను, జగన్‌ను తిట్టడం ప్రారంభిస్తారు. దానికి బదులు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వం పడిపోయేది. వేరే ప్రభుత్వం వచ్చేది. అపుడు ప్రభుత్వానికి భయం ఉండేది. అలా చేయకుండా పాదయాత్ర అంటూ తిరుగుతున్నారు.

వైఎస్‌ను అనుకరిస్తున్న చంద్రబాబు

దివంగత వై.ఎస్. రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్రను చంద్రబాబు అనుకరిస్తున్నారని విజయమ్మ అన్నారు.‘‘అసలు ఆయన వైఎస్‌ను అనుకరిస్తున్నారా... లేక జగన్‌బాబు ఓదార్పు మాదిరిగా వ్యవహరిస్తున్నారా అనేది అర్థం కావడం లేదు. ఏది ఏమైనా మేం మాత్రం ఈ ప్రభుత్వంపై ప్రతిపక్ష టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టేలా ఒత్తిడి చేయాలన్న ఉద్దేశంతో కూడా ఈ పాదయాత్ర చేస్తున్నాం. ఈ విషయాన్ని ప్రధానంగా పాదయాత్రలో ప్రజలకు చెబుతాం’’ అని విజయమ్మ వివరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రతో బాబు యాత్రకు పోలికే లేదని, ఎక్కడైనా, ఎప్పుడైనా(ఎనీ వేర్, ఎనీటైం) సాటి రాదని విజయమ్మ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

చంద్రబాబు కూడా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే పాదయాత్ర చేస్తున్నపుడు విమర్శించడం దేనికి? అని విలేకరులు ప్రశ్నించినపుడు ‘‘ఆయన తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ కార్యక్రమం చేయలేదు. ప్రజలు ఆయన్ను నమ్మని పరిస్థితి ఉంది. మాకు విశ్వసనీయత ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి వారసులుగా మాకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంది’’ అని విజయమ్మ అన్నారు. షర్మిల ఏ హోదాతో పాదయాత్ర చేస్తారని ప్రశ్నించినపుడు ‘షర్మిల వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుమార్తెగా, జగన్ సోదరిగా చేస్తుంది’ అని సమాధానం ఇచ్చారు. 

విలేకరుల సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, కొణతాల రామకృష్ణ, బాజిరెడ్డి గోవర్ధన్, బి.గుర్నాథరెడ్డి, వై.బాలనాగిరెడ్డి, అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, కొల్లి నిర్మల, వై.వి.సుబ్బారెడ్డి, ఎస్.రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Share this article :

0 comments: