రాజన్నది రామరాజ్యం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజన్నది రామరాజ్యం

రాజన్నది రామరాజ్యం

Written By news on Saturday, October 20, 2012 | 10/20/2012

వేంపల్లె, న్యూస్‌లైన్ : దివంగత నేత వైఎస్ తనయ షర్మిల చేపట్టిన పాదయాత్ర రెండవ రోజు శుక్రవారం వేంపల్లె రాజీవ్‌నగర్ కాలనీ సమీపం నుంచి ప్రారంభమైంది. రాజీవ్‌కాలనీ వద్దకు రాగానే పెద్ద ఎత్తున మహిళలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. రాజన్న పాలనలో రామరాజ్యాన్ని తలపించిందని.. ప్రస్తుతం కిరణ్ పాలన రావణ రాజ్యాన్ని తలపిస్తోందని షర్మిల ఎదుట మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం తాము పడుతున్న ఇబ్బందులను ఆమెకు ఏకరువు పెట్టారు.

వైఎస్ పుణ్యమా అని ఇళ్లు కట్టించారని.. అయితే ప్రస్తుతం కరెంటు, నీరు సరిగా రావడంలేదన్నారు. పింఛన్లు, రేషన్‌కార్డులు సరిగా ఇవ్వలేదని మొరపెట్టుకున్నారు. అక్కడి నుంచి ఉర్దూ గురుకుల పాఠశాలకు షర్మిల చేరుకుని విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, కరెంటు సరిగా రావడంలేదని.. మెస్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచాలని ఆమె దృష్టికి తెచ్చారు. అక్కడ నుంచి కత్తలూరు క్రాస్‌కు పాదయాత్ర చేరింది. ఇక్కడ స్థానిక మహిళలతో షర్మిల మాట్లాడారు.

నందిపల్లెకు పాదయాత్ర చేరుకోవడంతో వైఎస్‌ఆర్ సీపీ నాయకులు ఆర్‌ఎల్‌వీ ప్రసాద్‌రెడ్డి, కిషోర్, చిన్న, రామకృష్ణారెడ్డి, బయపురెడ్డి, చంద్ర ఓబుళరెడ్డి తదితరులు స్వాగతం పలికారు. ఇక్కడ మహిళా రైతు లక్ష్మిదేవి అరటి తోటను పరిశీలించారు. ఈ ప్రభుత్వం ఉన్నా.. లేకున్నా ఒకటేనని.. పంటలు సాగు చేయాలంటే భయమేస్తోందని ఆ రైతు తెలిపారు. ప్రభుత్వం పెడుతున్న కష్టాలను చూస్తే పురుగుల మందు తాగి చచ్చిపోవాలనిపిస్తోందని అలిరెడ్డిపల్లెకు చెందిన ఇందిరమ్మ, ఓబుళమ్మ, గంగమ్మ, శివరత్నమ్మ, తులశమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు లేక, కరెంట్ కోతలతో వేరుశనగ, పత్తి పంటలను తొలగిస్తున్నామని అమ్మగారిపల్లెకు చెందిన రామతులసి, ఆదర్శ రైతు రమణారెడ్డి, రామసుబ్బమ్మ, అయ్యవారిపల్లెకు చెందిన కోనమ్మ, గంగులమ్మ ఆమె దృష్టికి తెచ్చారు.

ప్రాణం ఎంతో విలువైందని.. జగనన్న పాలనలో మళ్లీ రామరాజ్యం తప్పక వస్తుందని.. అంతవరకు ఓపిగ్గా కష్టాలను ఎదుర్కొని నిలబడాలని షర్మిల భరోసా ఇచ్చారు. తర్వాత పులివెందుల జేఎన్‌టీయూ విద్యార్థులు తమ సమస్యలను ఆమె దృష్టికి తెచ్చారు. ఈ సమస్యలను జగనన్న దృష్టికి తీసుకెళతానని ఆమె తెలిపారు. ఆ తర్వాత నందిపల్లెలో రైతులు వైఎస్ హయాంలో 90శాతం వరకు పంటల బీమా రాగా.. ప్రస్తుతం వాతావరణ బీమాను ప్రవేశపెట్టడంతో వేంపల్లె మండలానికి 0.5శాతం వచ్చిందని వాపోయారు. పాదయాత్ర తాళ్లపల్లెకు రాగానే స్థానికులు షర్మిలపై పూల వర్షం కురిపించారు. తర్వాత ముసల్‌రెడ్డిగారిపల్లె మీదుగా అమ్మయ్యగారిపల్లె ప్రాంతంలో బస చేసే ప్రాంతానికి వెళ్లి సేద తీరారు. మళ్లీ 5గంటలకు పాదయాత్ర ప్రారంభమై చాగలేరు క్రాస్, వి.కొత్తపల్లె, వేముల వరకు కొనసాగింది.
పాదయాత్రతో బాబుకు ఒళ్లు నొప్పులే
- ఎమ్మెల్యే గొల్ల బాబురావు

పాదయాత్రతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు తలనొప్పి, ఒళ్లు నొప్పులు, దురద, కీళ్లు నొప్పులు తప్పా ఎలాంటి ప్రయోజనం ఉండదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. షర్మిల పాదయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీలను ప్రజలు విశ్వసించడంలేదని.. త్వరలోనే ఎన్నికలు రావడం తథ్యమని జోస్యం చెప్పారు.
ప్రజల కష్టాలను తెలుసుకునేందుకే పాదయాత్ర
- ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి

షర్మిల ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తోందని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. నందిపల్లె వద్ద ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. ఎన్‌టీఆర్ హయాంలో మద్యాన్ని నిషేధిస్తే.. చంద్రబాబు మళ్లీ మద్యం షాపులను కొనసాగించాడన్నారు.
వెన్నుపోటు చరిత్ర బాబుది
- ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి

మామను వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుదని కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. పాదయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ షర్మిల పాదయాత్ర చరిత్రలోనే సువర్ణధ్యాయంగా నిలిచిపోతుందన్నారు.
జగన్‌తోనే రాజన్న రాజ్యం
- మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎక్కడ చూసినా వైఎస్‌ఆర్‌సీపీ గాలి వీస్తోందని.. జగనన్నతోనే రాజన్న రాజ్యం సాధ్యమని వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యులు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. పాదయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రజలు విశ్వాసం ఎప్పుడో కోల్పోయారని పేర్కొన్నారు.
కాంగ్రెస్, టీడీపీలను ప్రజలు నమ్మరు
మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
కాంగ్రెస్, టీడీపీలను ప్రజలు నమ్మరని.. ప్రజల ఆదరణ చూస్తే వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పేర్కొన్నారు. మాట్లాడుతూ చంద్రబాబు చేసే పాదయాత్రను ప్రజలు విశ్వసించడంలేదని పేర్కొన్నారు.
ప్రజా విశ్వాసం కోల్పోయారు
- బాజిరెడ్డి గోవర్ధన్

సీఎం కిరణ్, టీడీపీ నేత చంద్రబాబు ప్రజా విశ్వాసం కోల్పోయారని వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర పాలక సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ దుయ్యబట్టారు. రెండు రోజులుగా షర్మిల పాదయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి చంద్రబాబు సీఎం పదవి కోసం వెంపర్లాడుతుంటే.. కిరణ్ తన పదవిని నిలుపుకొనేందుకు ఆగచాట్లు పడుతున్నారన్నారు.
జగన్ సీఎం కావడం తథ్యం
- మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డి

ఎప్పుడు ఎన్నికలొచ్చినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విజయ ఢంకా మోగించి జగన్ సీఎం కావడం తథ్యమని కడప మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డి అన్నారు. పాదయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పాదయాత్రకు వచ్చిన జనాన్ని చూసిన ఇతర పార్టీల్లో గుబులు ప్రారంభమైందని అన్నారు.
పాదయాత్రకు నీరాజనాలు
- వైఎస్ అవినాష్‌రెడ్డి

షర్మిల పాదయాత్రకు గ్రామ గ్రామాన నీరాజనాలు పలుకుతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా యూత్ అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాదయాత్ర విజయవంతంగా సాగిపోతోందన్నారు.
కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు
ప్రొద్దుటూరు ఇన్‌ఛార్జి రాచమల్లు ప్రసాద్‌రెడ్డి
కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై ప్రజల సమస్యలను పెడచెవిన పెట్టాయని వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు రాచమల్లు ప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నట్లు ఆయన వివరించారు.
- న్యూస్‌లైన్, పులివెందుల/వేముల
Share this article :

0 comments: