పోటెత్తిన రహదారులు.. వెంట నడిచిన అభిమానం.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పోటెత్తిన రహదారులు.. వెంట నడిచిన అభిమానం..

పోటెత్తిన రహదారులు.. వెంట నడిచిన అభిమానం..

Written By news on Thursday, November 22, 2012 | 11/22/2012

ఇసుకేస్తే రాలనంత జనం.. పోటెత్తిన రహదారులు.. వెంట నడిచిన అభిమానం.. చిన్నా, పెద్దా తేడా లేకుండా వచ్చిన ప్రజలతో కిక్కిరిసిన మిద్దెలు.. మొత్తంగా షర్మిల రాకతో బుధవారం కర్నూలు నగరం జనసంద్రమైంది. జగన్ నినాదాలు హోరెత్తగా.. పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు వైఎస్ పేరును తమ గుండెల్లోంచి తుడిచేయలేరనిచాటడం విశేషం.

కర్నూలు, న్యూస్‌లైన్ ప్రతినిధి: మరో ప్రజా ప్రస్థానం జిల్లా చరిత్రలో నూతనాధ్యాయానికి తెరతీసింది. ప్రజల కష్టాలు తెలుసుకుని ఓదార్చేందుకు కడప నుంచి ఇచ్ఛాపురం వరకు మూడు వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన షర్మిల బుధవారం జిల్లాలో 14వ రోజు పాణ్యం, కర్నూలు నియోజకవర్గాల్లో 12 కిలోమీటర్ల యాత్ర చేపట్టారు. ఉదయం కర్నూలు శివారులోని సెయింట్ క్లార్క్ స్కూల్ నుంచి మొదలైన షర్మిల పాదయాత్ర మధ్యాహ్నానికి బళ్లారి చౌరస్తా, చెన్నమ్మ సర్కిల్, కృష్ణానగర్ మీదుగా బిర్లాగేట్ వరకు సాగింది. 

మధ్యాహ్న భోజనాల అనంతరం బిర్లాగేట్ నుంచి మొదలైన పాదయాత్ర మసీదు సెంటర్, గాయత్రి ఎస్టేట్ రోడ్డు, కలెక్టరేట్, మెడికల్ కాలేజ్ గేట్, బుధవారపేట, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్, పూల బజార్, పెద్ద మార్కెట్, ఓల్డ్ బస్టాండ్, పోలీస్‌లైన్, ప్రకాశ్‌నగర్ మీదుగా సెయింట్ జోసెఫ్ కాలేజ్ చేరుకుంది. పాదయాత్ర సాగినంత సేపు ప్రజలు ఆమె వెంట బారులు తీరడం కర్నూలు చరిత్రలో ఎన్నడూ చూడలేదనే చర్చ జరిగింది. చెన్నమ్మ సర్కిల్, పాత బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటైన బహిరంగసభల్లో షర్మిల ప్రభుత్వ, ప్రతిపక్షాల కుట్రలను ఎండగట్టారు.

విజయమ్మ, షర్మిల ప్రసంగాలకు విశేష స్పందన
బుధవారం ఉదయం పాణ్యం నియోజకవర్గ పరిధిలోని చెన్నమ్మ సర్కిల్‌లో మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, పార్టీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు వివిధ ప్రాంతాల నుంచి జనం భారీగా తరలిరావడంతో జాతీయ రహదారి స్తంభించింది. షర్మిల ప్రసంగిస్తున్నంత సేపూ... ప్రజలు జేజేలు కొట్టారు. వై.ఎస్ హయంలో రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉందో... ప్రస్తుత కిరణ్ సర్కార్, వైఎస్‌కు ముందు చంద్రబాబు పాలనలో ప్రజలు ఏవిధంగా కష్టాలు పడుతున్నారో షర్మిల సవివరంగా చెప్పుకొచ్చారు. పాణ్యం నియోజకవర్గ ప్రజలకు వైఎస్ ఉన్నప్పుడు రోజూ నీరందితే... ఇప్పుడు రెండురోజులకోసారి నీరొచ్చే దుర్భర పరిస్థితి ఎందుకొచ్చిందో అర్థమైందా అని ప్రశ్నిస్తూ... ప్రభుత్వ అసమర్థ విధానాలపై ధ్వజమెత్తారు. ‘పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయన తెచ్చిన అధికారాన్ని తొమ్మిది నెలల్లోనే లాగేసుకున్న చంద్రబాబు.. తొమ్మిదేళ్లు ప్రజలకు నరకం చూపించి... మరోసారి అధికారం కావాలంటూ పాదయాత్ర డ్రామాలు చేస్తున్నారు’ అంటూ ఆమె చేసిన ప్రసంగంతో కరతాళ ధ్వనులు మిన్నంటాయి.

పాత బస్టాండ్ సర్కిల్‌లో పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ప్రసంగిస్తూ.. చంద్రబాబు పాదయాత్ర ఉద్దేశాన్ని, ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని లాక్కొనేందుకు ఎమ్మెల్యేలను ఎన్ని కోట్లిచ్చి కొనుక్కున్నారో చెప్పాలంటూ ప్రశ్నించినప్పుడు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. కర్నూలుకు వరదలొచ్చి మూడేళ్లు దాటినా ఇప్పటి వరకు రక్షణ గోడ ఏర్పాటు చేయలేదనే విషయాన్ని షర్మిల చెపుతూ... వైఎస్ బతికుంటే అసలు వరదలు వచ్చేవా? అని ప్రశ్నించడంతో జనం ‘లేదు... లేదు’ అంటూ తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. బుధవారం నాటి పాదయాత్రలో షర్మిల వెంట దివంగత ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీ పార్వతి, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, పార్టీ శాసన సభా పక్ష ఉపనేత భూమా శోభా నాగిరెడ్డి, ఎమ్మెల్యేలు బాల నాగిరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, అమరనాథ్ రెడ్డి, బాలరాజు, రాజేశ్, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మేకతోటి సుచరిత, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి, మాజీ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మూలింటి మారెప్ప, మాజీ ఎంపీ భూమా నాగిరె డ్డి, మాజీ ఎమ్మెల్యేలు గోనె ప్రకాష్‌రావు, గౌరు చరితా రెడ్డి, జంగా కృష్ణమూర్తి, కె.నారాయణ స్వామి, ప్రసాద్ రాజు, సాయిప్రసాద్ రెడ్డి, ఎస్.మనోహర్, మాజీ ఎమ్మెల్సీలు ఎస్.వి.మోహన్ రెడ్డి, రెహమాన్, పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, పార్టీ నియోజకవర్గాల ఇన్‌చార్జీలు ఏవీ సుబ్బారెడ్డి, కోట్ల హరిచక్రపాణి రెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఎర్రబోతుల వెంకటరెడ్డి, గుమ్మనూరు జయరాం, పెరుగు పురుషోత్తం రెడ్డి, తోట వెంకట కృష్ణారెడ్డి, రాము యాదవ్, రాకేష్ రెడ్డి, కృష్ణారెడ్డి, హఫీజ్ ఖాన్, తెర్నెకల్ సురేందర్ రెడ్డి, డాక్టర్ అల్లారెడ్డి, డాక్టర్ మధుసూదన్, మహేందర్ రెడ్డి, బాలరాజు, నారాయణమ్మ, అరుణ కుమారి, రమాదేవి, విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. 
Share this article :

0 comments: