బాబూ! ఎన్ని కోట్లు తీసుకున్నావ్? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబూ! ఎన్ని కోట్లు తీసుకున్నావ్?

బాబూ! ఎన్ని కోట్లు తీసుకున్నావ్?

Written By news on Thursday, November 22, 2012 | 11/22/2012

*ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా ఉండేందుకు ఎంత తీసుకున్నావో చెప్పు
* వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ డిమాండ్
*నాడు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చినందుకు ఎంత తీసుకున్నావో చెప్పు
*వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలను పెట్టి వారికెంత ఇచ్చావో చెప్పు
*ఎన్టీఆర్‌ను మానసిక క్షోభకు గురిచేసి మరణానికి కారణమైంది నువ్వు కాదా?
*తెలంగాణ ఇస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో మాటిచ్చి తెప్ప తగలేసింది నువ్వు కాదా?
*చంద్రబాబు మీద ఎంక్వైరీ చేయడానికి సిబ్బంది లేదని చెప్పిన సీబీఐ..
*జగన్‌పై కేసులో 24 గంటల్లో 28 బృందాలతో సోదాలు చేసింది 

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘జగన్ బాబు టన్నుల కొద్దీ డబ్బులు తెచ్చి ఎమ్మెల్యేలను కొంటున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అంటున్నారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తాను ఎన్‌టీఆర్ మీదనే పోటీకి నిలబడతానని చెప్పేవాడు. ఎన్నికల్లో అలాంటి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది.. ఆయనా ఓడిపోయాడు. ఆ తరువాత వారం రోజులకే ఆయన టీడీపీలో చేరారు. మరి టీడీపీలో చేరడానికి నువ్వు ఎన్ని కోట్లు తీసుకున్నావు చంద్రబాబు నాయుడూ? ఎన్‌టీఆర్ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకే ఎమ్మెల్యేలను తీసుకెళ్లి వైస్రాయ్ హోటల్‌లో పెట్టావు. అప్పుడు ఆ ఎమ్మెల్యేలకు ఎన్ని కోట్లిచ్చావు? ఈరోజు అవిశ్వా సం పెట్టకుండా ప్రభుత్వాన్ని కాపాడుతున్నావు. 

దీనికి ఈ ప్రభుత్వం దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నావు చంద్రబాబూ?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ టీడీపీ అధినేతను సూటిగా ప్రశ్నించారు. ప్రజల సమస్యలు పట్టని రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కయిన టీడీపీ వైఖరికి నిరసనగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో భాగంగా 35వ రోజు బుధవారం కర్నూలు నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో విజయమ్మ ప్రసంగిస్తూ.. కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు రాజకీయాలను గట్టిగా నిలదీశారు. ‘‘చంద్రబాబూ.. నువ్వు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్రంలో చక్రం తిప్పానని గొప్పలు చెప్పుకుంటున్నావు. ఆ రోజు చక్రం తిప్పావో లేదో కాని ఇప్పుడు మాత్రం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నావని అర్థమవుతోంది’’ అని అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి బయట ఉంటే వాళ్ల ఆటలు సాగవనే అన్యాయంగా జైలులో పెట్టారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎందుకు జైల్లో పెట్టారో చెప్పండి..
‘‘దేనికోసం నీ కొడుకు జైలుకెళ్లాడంటూ.. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలవారు నన్ను అడుగుతున్నారు. నా బిడ్డ ఏం తప్పు చేశాడని జైలులో పెట్టారో మీరే చెప్పాలి. కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ చెప్పింది మీరు వినలేదా? ‘జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే విచారణ జరిపించి ఉండేవాళ్లం కాదు.. కేంద్రంలో మంత్రి పదవిని ఇచ్చేవాళ్లం.. తరువాత సీఎంను కూడా చేసేవాళ్ల’మని ఆజాద్ చెప్పింది మీకు గుర్తులేదా? కావాలనే కేసులు పెట్టి జైల్లోకి నెట్టింది మీరు కాదా’’ అని విజయమ్మ నిలదీశారు. ‘‘చిరంజీవి గారు హోల్‌సేల్‌గా ఆయన పార్టీని కాంగ్రెస్‌కు అమ్ముకున్నారు. ఆయన మంచం కింద రూ.20 కోట్ల డబ్బులు దొరికితే ఆయన మీద కేసులుండవు.. అరెస్టులుండవు.. విచారణ ఉండదు.. పైగా బహుమానంగా కేంద్ర మంత్రి పదవి కూడా ఇచ్చారు’’ అని ఘాటుగా విమర్శించారు. 

ప్రజల్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు..
‘‘రాష్ట్రాన్ని తుపాను అతలాకుతలం చేసింది. లైలా తుపానైతేనేమి, జల్ తుపానైతేనేమి ప్రజలను తీవ్రంగా ముంచేసింది. కానీ ఈ ప్రభుత్వం ఇంత వరకు నష్ట పరిహారం ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయ్యింది. 108కు ఫోన్ చేస్తే డీజిల్ లేదంటున్నారు. మద్యం ఏరులై పారుతోంది. ఉచిత విద్యుత్తు ఊసే లేదు. పరిశ్రమలకు పదిహేను రోజులకోసారి కరెంటు ఇస్తుండటంతో ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారు. అయినా ఇవేవీ ప్రభుత్వానికి పట్టట్లేదు. వాళ్ల పదవులు కాపాడుకోవడానికి ఢిల్లీ చుట్టూ తిరగడానికే వారికి సమయం సరిపోతోంది’’ అని విజయమ్మ సర్కారు తీరును విమర్శించారు.


అమ్మో.. మళ్లీ చంద్రబాబు పాలనా?
‘‘ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు దానితోనే కుమ్మక్కయ్యాడు. అసెంబ్లీ ఐదు రోజులు నడిస్తే ప్రజల సమస్యలను చర్చించడానికి రోజుకు ఐదు నిమిషాలు కూడా వచ్చింది లేదు. ప్రజలు కష్టాల్లో ఉంటే అవిశ్వాసం పెట్టకుండా ‘వస్తున్నా మీకోసం’ అంటూ ప్రజల మధ్యకొచ్చి.. అధికారమిస్తే మీకు సేవ చేస్తానని అంటున్నాడు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏనాడూ కూడా రైతుల గురించి, వారి కష్టాల గురించి ఒక్కసారి కూడా ఆలోచన చేయలేదాయన.

ఇప్పుడు రోడ్డెక్కి మళ్లీ అబద్ధాలు మాట్లాడుతున్నాడు. మళ్లీ ఇవ్వాళ అలాంటి పరిపాలనే తీసుకొస్తానని చెబుతున్నాడు. మళ్లీ చంద్రబాబు పరిపాలన అంటే జనం భయపడిపోతున్నారు. ఎనిమిదేళ్లుగా ప్రజలు ఆయనకు శిక్ష విధిస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో డిపాజిట్లు కూడా ఇవ్వకుండా ఓడిస్తున్నారు. అయినా చంద్రబాబు నాయుడుకు బుద్ధి రావడం లేదు’’ అని విజయమ్మ విమర్శించారు.

ఎన్టీఆర్ మరణానికి నువ్వే కారణం..
‘‘చంద్రబాబు నాయుడూ.. నిజం చెప్పండి.. తెలుగుదేశం పార్టీ మీదా..? ఎన్‌టి రామారావుదా..? ఎమ్మెల్యేలను వైస్రాయ్ హోటల్‌లో పెట్టి ఆయన మీద చెప్పులు వేయించావు. పార్టీ నాయకునిగా అసెంబ్లీకి వస్తే కనీసం ఆయనకు మాట్లాడుకునే అవకాశం కూడా లేకుండా చేశావు. ఆయనను మానసిక క్షోభ పెట్టి ఎన్‌టీఆర్ మరణానికి కారకుడయ్యావు. మీడియాను మేనేజ్ చేసుకుని తెలుగుదేశం పార్టీ నాదే అని రాయించుకున్నావు. ఈరోజు వెన్నుపోటు అంటే చంద్రబాబు నాయుడే గుర్తొస్తారు’’ అని విజయమ్మ ఘాటుగా వ్యాఖ్యానించారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అక్రమాలు జరిగాయని చంద్రబాబూ గగ్గోలు పెడుతున్నారని, ఆయన ప్రభుత్వం అనుసరించిన విధానాలకు భిన్నంగా వైఎస్ ఏం చేశారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. ‘‘ఒక రామోజీరావు, ఒక మురళీమోహన్, నామా నాగేశ్వరరావు, సీఎం రమేష్, ఒక సుజనా చౌదరి... వీళ్లందరికీ ఏ మార్గదర్శకాల ప్రకారం మీరు కేటాయింపులు చేశారు? అదే గైడ్‌లైన్స్ ప్రకారం రాజశేఖర్‌రెడ్డి గారు చేస్తే తప్పవుతుందా?’’ అని ఆమె నిలదీశారు.

బాబు నిర్దోషి అని ఎవరు చెప్పారు?
‘‘చంద్రబాబు నాయుడు నిప్పులాంటి వాడట, నిర్దోషట. చంద్రబాబు నాయుడూ ఏ కోర్టు నీ మీద విచారణ చేసింది.. ఏ కోర్టు నువ్వు నిర్దోషివని తీర్పు ఇచ్చింది.. మొన్న నేను 18 అంశాలతో, 2,424 పేజీలతో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసి కోర్టుకు వేస్తే.. నెలలోపు ఎంక్వైరీ చేయాలని కోర్టు సీబీఐ వారిని ఆదేశించింది. అయితే సీబీఐ.. చంద్రబాబును విచారణ చేయడానికి తమకు తగినంత సిబ్బంది లేరని చెప్పింది. ఈలోగా చంద్రబాబు నాయుడు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు. 

చంద్రబాబు నాయుడు బతుకంతా ఎవరు ఏ కోర్టులో కేసు వేసినా స్టే తెచ్చుకుంటారు. విచారణ జరగకుండా చీకట్లో మ్యానేజ్ చేయడం ఆయనకు బాగా తెలుసు. ఆయన కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై జగన్ బాబు మీద కేసు పెడితే ఇదే సీబీఐ 24 గంటల్లో 28 బృందాలతో జగన్ బాబుతో పాటు ఆయన బంధువుల ఇళ్లల్లో సోదాలు చేసింది’’ అని విజయమ్మ.. అధికార, ప్రతిపక్షాల కుమ్మక్కును ఎండగట్టారు.

తెలంగాణపై మాట ఏమైంది బాబూ? 
‘‘చంద్రబాబు నాయుడును ఒక్క మాట అడుగుతున్నాను. నీకు మాట మీద నిలబడటమంటే తెలుసా..? 2009లో కేసీఆర్‌తో పొత్తు పెట్టుకుని మేనిఫెస్టోలో తెలంగాణ ఇస్తానని ప్రకటన చేశావు. ఎన్నికలు అయిపోయాక, ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు ప్రవర్తించావు. తెలంగాణ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టావు. నమ్మి పిల్లనిచ్చిన మామను నిండా ముంచావు. ఏ వాగ్దానంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ వాగ్దానాలనే చంద్రబాబు నాయుడు తీసేశాడు. రూ.2కే కిలో బియ్యం పథకాన్ని రూ.5కు పెంచాడు. మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి ఊరూరా బెల్టు షాపులు పెట్టాడు. మళ్లీ ఇప్పుడు అవకాశం ఇస్తే బెల్టు షాపులు తీసేస్తానని అబద్ధపు మాటలు చెబుతున్నాడు. ప్రజలకు నమ్మకంగా ఉన్నాడంటే అదీ లేదు. పోనీ నాయకులకు నమ్మకంగా ఉన్నాడంటే అదీ లేదు.’’
- వైఎస్ విజయమ్మ
Share this article :

0 comments: