నేడు సీబీఐ కోర్టుకు జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు సీబీఐ కోర్టుకు జగన్

నేడు సీబీఐ కోర్టుకు జగన్

Written By news on Wednesday, December 5, 2012 | 12/05/2012

తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో నిందితునిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం నాంపల్లి గగన్‌విహార్ కాంప్లెక్స్‌లోని సీబీఐ మొదటి అదనపు ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఐఆర్‌ఏఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డి కూడా కోర్టు ముందు హాజరవుతారు. వైఎస్ జగన్ రిమాండ్ బుధవారంతో ముగియనుంది. రిమాండ్ పొడిగించేందుకు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు బుధవారం నుంచి మూడు రోజులపాటు సెలవులో వెళ్తున్నారు. 

దీంతో ఈ కోర్టుకు మొదటి అదనపు సీబీఐ జడ్జి పుల్లయ్య ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారు. మొదటి అదనపు కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం లేనందున జగన్‌ను ప్రత్యక్షంగా హాజరుపర్చనున్నారు. ఈ ఏడాది మే 27న జగన్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేసి, 28న నాంపల్లి క్రిమినల్ కోర్టుల ఆవరణలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. ఆ తర్వాత జూన్ 11న రిమాండ్ పొడిగించేందుకు, జూలై 19న రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా, సెప్టెంబర్ 25న వాన్‌పిక్ కేసు చార్జిషీట్ ప్రతులను తీసుకునేందుకు మాత్రమే జగన్‌ను ప్రత్యక్షంగా హాజరుపర్చారు. ప్రతి 14 రోజులకు ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రిమాండ్ పొడిగిస్తున్నారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న విజయసాయిరెడ్డి, మంత్రి ధర్మాన ప్రసాదరావు, సీనియర్ ఐఏఎస్ అధికారులు శామ్యూల్, మన్మోహన్‌సింగ్, వివిధ కంపెనీల ప్రతినిధులు కూడా ఈ కోర్టులో హాజరుకానున్నారు. అలాగే ఎమ్మార్ కేసులో నిందితునిగా ఉన్న సునీల్‌రెడ్డిని, ఓఎంసీ కేసులో నిందితులుగా ఉన్న గాలి జనార్దన్‌రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్‌లను కూడా ఇదే కోర్టులో ప్రత్యక్షంగా హాజరుపర్చనున్నారు. 

71 రోజుల తర్వాత..
మే 27న జగన్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేయగా.. 28న నాంపల్లి క్రిమినల్ కోర్టుల ఆవరణలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. తర్వాత జూన్ 11న రిమాండ్ గడువు ముగిసినప్పుడు తీసుకొచ్చారు. జూలై 19న రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా కోర్టు అనుమతితో ఓటు వేసేందుకు అసెంబ్లీకి వచ్చారు. అనంతరం సెప్టెంబర్ 25న వాన్‌పిక్ కేసుకు సంబంధించిన చార్జిషీట్ ప్రతులను తీసుకునేందుకు జగన్‌ను ప్రత్యక్షంగా హాజరుపరిచారు. మళ్లీ 71 రోజుల తర్వాత సీబీఐ కోర్టుకు బుధవారం తీసుకురానున్నారు.

జగన్‌కు సాధారణ బెయిలూ ఇవ్వలేం: సీబీఐ కోర్టు
తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో నిందితునిగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సాధారణ బెయిల్ ఇవ్వలేమని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం స్పష్టంచేసింది. తనను రిమాండ్‌కు తరలించిన మొదటి చార్జిషీట్ సీసీ నంబర్ 8 కేసులో దర్యాప్తు పూర్తయినందున, సీఆర్‌పీసీ సెక్షన్ 437 కింద బెయిల్ ఇవ్వాలని కోరుతూ జగన్ దాఖలు చేసిన సాధారణ బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు మంగళవారం కొట్టివేశారు. ‘‘జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసు దర్యాప్తునకు సుప్రీంకోర్టు నిర్ణీత గడువు విధించలేదు. 

పెండింగ్‌లో ఉన్న ఏడు అంశాలపై దర్యాప్తు పూర్తయిన తర్వాతే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఈ కేసుకూ వర్తిస్తాయి. ఈ దశలో బెయిల్ ఇవ్వడంవల్ల దర్యాప్తునకు ఆటంకాలు ఏర్పడటంతోపాటు సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించినట్లు అవుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 141 ప్రకారం సుప్రీంకోర్టు తీర్పులకు దిగువ కోర్టులు కట్టుబడి ఉండాల్సిందే. అందువల్ల బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం’’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

sakshi
Share this article :

0 comments: