బతుకమ్మ, ఆటాపాటలతో ఆత్మీయవీడ్కోలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బతుకమ్మ, ఆటాపాటలతో ఆత్మీయవీడ్కోలు

బతుకమ్మ, ఆటాపాటలతో ఆత్మీయవీడ్కోలు

Written By news on Wednesday, December 12, 2012 | 12/12/2012

‘‘నేనొక్కటే మాట చెబుతున్నా.. మనందరికీ మంచి రోజులొస్తాయ్.. రాజన్న కలలను సాకారం చేసేందుకు జగనన్న మీ అందరికీ అండగా నిలుస్తాడు.. జగనన్న గురించి నేను ఒకే ఒక్క మాటచెబుతా.. ఇచ్చిన మాటకోసం ప్రాణమిస్తాడే కానీ వెనకడుగు వేసే నైజం ఆయనది కాదు’’ అంటూ కష్టాల్లో ఉన్న వారికి షర్మిల మనోధైర్యమిచ్చారు. రాజన్నబిడ్డ షర్మిలను కళ్లారాచూసి.. 20రోజుల పాటు అడుగులో అడుగేసి వెంటనడిచిన మహిళలు, అభిమానులు బతుకమ్మ, ఆటాపాటలతో ఆత్మీయవీడ్కోలు పలికారు.

మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్ ప్రతినిధి: 20 రోజులు.. 290.7 కి.మీ.. 94 గ్రామాలు తిరిగి ఎంతోమంది వృద్ధులు, మహిళలు, తమ్ముళ్లు, అన్నలు, చెల్లెళ్లను కలిసి వారి సమస్యలను ఓపిగ్గా విన్న షర్మిలకు పాలమూరు ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. కాంగ్రెస్, టీడీపీల కుట్ర రాజకీయాలను ఎండగడుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర జిల్లాలో ముగిసి మంగళవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లాలోకి అడుగుపెట్టారు. 

పాలమూరు వలస బతుకుల కష్టాలు చూసి..
‘‘ఆర్చే వాళ్లులేక.. తీర్చే వాళ్లులేక.. పొట్ట కూటి కోసం లక్షలాది మంది పాలమూరు వాసులు పట్టణాలకు వలసలు వెళ్లి కూలీలుగా మారారు. కన్న తల్లిదండ్రులను వదలిపెట్టి.. సొంతింటిని వదలిపెట్టి.. పుట్టిన గడ్డను విడిచిపెట్టి.. పట్టణాలకు వలసలు వెళ్లి గుడిసెలు వేసుకొని మారిపోయారు’’ అంటూ పాలమూరు ప్రజల బాధలు వింటూ షర్మిల కంటతడి పెట్టారు. ‘‘ సమస్యలన్నీ తీరాలంటే రాజన్న రాజ్యం రావాలని అందుకు మీరందరూ జగనన్నను ఆశీర్వదిస్తే అందరికీ మంచి రోజులొస్తాయని’’ ధైర్యం చెప్పారు. 

ఇలా 20 రోజుల పాటు ప్రజా సమస్యలు తెలుసుకొని వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మెలుగుతూ వారి కష్టాలను వింటూ జిల్లాను విడిచి మరో జిల్లాకు అడుగుపెట్టిన సందర్భంగా పలువురు మహిళలు కన్నీళ్లతో ఆమెకు వీడ్కోలు పలికారు. రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించే చోట మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్‌రెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ సీజీసీ బాలమణెమ్మతో పాటు శారద, లక్ష్మి, కందుల శోభనాదేవి, మహేశ్వరమ్మ, జయశ్రీ తదితరులు బతుకమ్మ ఆడుతూ వీడ్కోలు పలికారు. 

జగనన్నను ఆశ్వీరదించండి
అంతకుముందు పెంజర్ల గ్రామంలో ఏర్పాటుచేసిన రచ్చబండ కార్యక్రమంలో షర్మిల మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో పేదల బతుకులు దుర్భరంగా మారినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. మహానేత వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలకు ఎంతో భరోసా ఉండేదని గుర్తుచేశారు. రూ.12 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. 

పభుత్వం పాడిపరిశ్రమను నిర్లక్ష్యం చేస్తోందని, క్రాప్‌హాలిడే మాదిరి డెయిరీ హాలిడే ప్రకటించే దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తంచేశారు. వైఎస్ హయాంలో పాడి పశువులకు రూ. 50 వేలు బీమా ఉండేదని, ప్రస్తుతం ఆ మొత్తాన్ని రూ.30వేలకు కుదించారని ఓ రైతు షర్మిలకు చెబుతూ ఆవేదన వ్యక్తంచేశారు. ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిన ప్రభుత్వం చార్జీల పేర వేలకువేలు బిల్లులు ఇస్తూ రైతులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందని ధ్వజమెత్తారు.

చంద్రబాబు హయాంలో విద్యుత్ చార్జీలు చెల్లించలేని వారిపై కేసులు బనాయిస్తూ జైల్లో పెట్టాడరని గుర్తుచేశారు. వడ్డీలేని రుణాలు ఇస్తామని ముఖ్యమంత్రి ఓ వైపు చెబుతుండగా రూ.2కు పైగా వడ్డీ వసూలు చేస్తున్నారని అందుకే రుణాలు తీసుకోవడానికే వెనుకడుగు వేస్తున్నామని పలువురు మహిళలు తమ ఇబ్బందులను షర్మిలకు వివరించారు. ఓ రైతు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.300 ఉన్న డీఏపీ ప్రస్తుతం రూ.1100 నుంచి రూ.1400 వరకు విక్రయిస్తున్నారని ఇలాగైతే పంటలు ఏవిధంగా సాగుచేసుకోవాలో అర్థంకావడం లేద ని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రి చేస్తే స మస్యలుతీరుస్తారని అభయమిచ్చారు.
Share this article :

0 comments: